ఇవాళ జరిగేది నిన్న మనం చేసిన పనుల ఫలితమైతే, రేపు జరిగేది నేడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ఫలితమే! అందుకే గతాన్ని గుర్తుచేసుకుంటూ, ఇవాళ జరిగేది చూస్తూ భవిష్యత్తు ప్రగతి కోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. ఇక ఇప్పుడు ఏం జరుగుతోంది?
మాజీ ప్రధానమంత్రులైన ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాహుల్గాంధీ వారసులుగా తాము భారతదేశ ప్రధానమంత్రి పదవి పొందాలని ఉవిళ్ళూరుతున్న ప్రియాంక వాద్రా, రాహుల్గాంధీ తెలంగాణ నేలను పావనం చేశారు. మరికొద్ది రోజుల్లో వారి మాతృమూర్తి సోనియాగాంధీ కూడా వారి ప్రవచనం ఇవ్వటానికి తెలంగాణ రాష్ర్టానికి రాబోతున్నారు. ఇక ఇప్పుడు వచ్చినవారు ఈ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటో విశ్లేషిద్దాం.
Priyanka Gandhi | ప్రియాంక వాద్రా చాలా గౌరవప్రదంగా, గంభీరంగా మాట్లాడింది. చూడటానికే కాకుండా, వినటానికి కూడా ముచ్చటగా, మర్యాదగా తను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తిలేకుండా చెప్పింది. హిమాచల్ప్రదేశ్లోనూ, కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసింది, కాంగ్రెస్ గెలిచింది. అయితే అది కాంగ్రెస్ పార్టీ ఘనత అనే కంటే, భారతీయ జనతా పార్టీ దుష్పరిపాలన, పక్షపాత ధోరణి, విచ్చలవిడి అవినీతి వల్ల ఆ పార్టీ ఓడిపోయి, ఇంకొక పార్టీ దిక్కులేక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారని చెప్పకతప్పదు. కొంతమంది నిజంగా బీజేపీని ఓడిద్దామని కాంగ్రెస్పై ఇష్టం లేకపోయినా ఓటేస్తే, ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాయిలాలు చూసి మోసపోయి ఓటేశారు. ఎలా అయితేనేం, అరవై ఏండ్లు దేశాన్ని పాలించి, సామాన్య ప్రజలను గాలికివదిలేసి, తెలివి ప్రజ్ఞ కలిగి చదువుకున్న మేధావులకు సరైన ఉద్యోగాలు కల్పించకుండా వారు విదేశాలకు తరలిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ, దేశంలో వివిధ రాష్ర్టాలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా తమ అవినీతి కార్యక్రమాన్ని యథేచ్ఛగా సాగించింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, గాంధీ యుగాలలో. ఇప్పుడు వారసత్వ రాజకీయాలని విమర్శిస్తూ 4వ తరం వారసురాలు, వారసుడు వచ్చారు తెలంగాణ ప్రజలకు తెలివి నేర్పడానికి! ఇక ప్రియాంకా వాద్రా (గాంధీ) ఏం చెప్పిందో చూద్దాం!
రామప్ప దేవాలయం చూసి ప్రియాంకా ఒళ్ళు పులకరించిపోయిందట. అటువంటి సుందరమైన దేవాలయం ఇంతమటుకు చూడలేదంది. మరి 75 ఏండ్ల కిందట అధికారంలోకి వచ్చిన కుటుంబంలో 50 ఏండ్లు దాటిన మనిషి, జీవితమంతా రాజకీయాలలో మునిగితేలి, తమ దేశంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు కూడా తెలియదంటే ఏమనాలి? లేక దక్షిణాది రాష్ర్టాల మీద ఉన్న నిర్లక్ష్యం, అనాసక్తి, ఆపేక్షారాహిత్యం, చిన్నచూపు వల్ల ఈ మహత్తరమైన గుడి గురించి తెలుసుకోలేదా?
800 ఏండ్ల కిందట, సుమారు 40 ఏండ్లు శ్రమించి, భూకంపాలొచ్చినా చెక్కు చెదరని, అత్యద్భుత సాంకేతికతతో నిర్మించిన ఈ దేవాలయాన్ని 2021లోనే ప్రపంచ వారసత్వ చిహ్నంగా యునెస్కో గుర్తించాకైనా కనీసం రాజకీయ నాయకులైనా సందర్శించాలి కదా? ఇంత అజ్ఞానం, అనాదరణా? అసలు ఈ రాజకీయ నాయకులకు ఒక యూపీఎస్సీ పరీక్ష పెట్టాలి కదా! ఒక సామాన్య ఉపాధ్యాయుడికే శిక్షణలు, పరీక్షలున్నప్పుడు, దేశాన్నంతా పరిపాలిద్దామనే ఆశ, ఆశయం ఉన్నవారికి దేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలైనా తెలియాలి కదా! బహుశా ఇటలీ గురించి ఏమడిగినా చెప్పేవారేమో వీళ్లిద్దరూ.
తర్వాత ప్రియాంక తెలంగాణను పుణ్యభూమిగా వర్ణించారు. ఎందువల్ల? తమ స్వప్నాలు నాశనమై, రాష్ట్రం సిద్ధించక శ్రీకాంతాచారి లాంటి చాలామంది యువత నిస్పృహతో బలిదానాలు చేశారని విచారంగా చెప్పారు ప్రియాంక. అంటే రామప్ప దేవాలయ చరిత్రే కాదు, తమ వంశ రాజకీయ చరిత్ర కూడా తెలియనట్టుంది పాపం ఆమెకు.
తెలంగాణ యువత 1200 మంది, అంతకుముందు కూడా కొంతమంది ఉద్యోగావకాశాలు లేక బలిదానాలు చేయలేదు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలు. ఆఖరికి పార్లమెంటు భవనం దగ్గర ఉరేసుకొని చనిపోయిన యువకుడు, ఉస్మానియా క్యాంపస్లో నిలువుగా మంటల్లో కాలి చనిపోయిన యువకుడు, అందరూ చూస్తుండగానే ‘జై తెలంగాణ’ అంటూ పెట్రోల్ పోసుకొని తనను తాను కాల్చుకొని చనిపోయిన శ్రీకాంతాచారి – ఎవరూ కాంగ్రెస్ పెద్దల మనసు కరిగించలేకపోయారు. ఇక్కడ హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి-ఇప్పుడు తెలంగాణ ప్రగతి సాధించాక వడ్డించిన విస్తరిలా ఉన్న రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా స్వయం ప్రకటన చేసిన మనిషి – ఆ చావులు విద్యలో వెనుకబడ్డారనో, ప్రేమ విఫలమైందనో ప్రకటించి ఊరుకున్నారు వారి కుటుంబాలను కూడా పలకరించకుండా! బహుశా వారికి సరిజోడు మన ప్రధానమంత్రి మాత్రమే! చనిపోయిన జవాను కుటుంబాలకు ట్విట్టర్ మెసేజీ ఇవ్వకుండా, మణిపూర్ మారణహోమం ఆపకుండా నీరోలాగ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏ మానవుడికీ సాధ్యం కాదేమో బహుశా! మరి ప్రజాభిప్రాయం పట్టించుకోకుండా నెహ్రూ చేసిన పెండ్లి-ఒక అమాయకురాలికి, ఒక తుంటరి అబ్బాయికి- రెండవరోజు నుంచే పెటాకులైనా, ఆయన వెసులుబాటు కల్పించిన విడాకులకు సమయం 58 ఏండ్లు పట్టడం ఎంత వింత! దీనికి కేంద్రంలో 60 ఏండ్లు, రాష్ట్రంలో 49 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? నిజానికి ఏ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రియాంకకు ఆ చావులన్నీ, ఇంకా ఆ సమయంలో రైతులు, చేనేత కార్మికులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ తాను ఓటేయమని అడుగుతున్న పార్టీ చేసిన హత్యలని తెలిసేది.
ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సలైట్ పేరు పెట్టి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేయించిన ఎన్కౌంటర్లు కూడా బూటకపు నాటకాలనీ తెలిసేది. పైగా ఆవిడ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల్లోనే తెలంగాణ ఆత్మ హత్యలలో చివరగా ఉంది. రైతుబంధు, రైతుబీమా, పుష్కలంగా నీళ్లు, రోజంతా కరెంటు ఇచ్చాక తెలంగాణ రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతారు? పైగా వారిళ్లల్లో ముసలివారికి ఆసరా పింఛన్లు, ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసవానికి చక్కటి ప్రభుత్వ ఆస్పత్రులు, కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర దింపుతుంటే పల్లెల్లో ఉన్నవాళ్లకు కూడా ఏమి కష్టం? గర్భిణులకు ఆహారం, మహిళలు బయటికి వెళ్లకుండా భగీరథ మంచినీళ్ల వంటివి లభిస్తుంటే ఇంక బాధలేమిటి? చనిపోయినవారికి కూడా వైకుంఠధామాలు నిర్మించాక లేనిదేమిటి? దళితబంధు అంబేద్కర్ కలలు సాకారం చేయటం లేదా? వెయ్యిపైన పాఠశాలలు బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అందడం ఫూలే కల కాదా? పోడు భూముల పంపకం, తండాలు మున్సిపాలిటీలై వసతులన్నీ రావడం కుమ్రుంభీం ఆశయం కాదా? మీ పార్టీ అవమానించి బయటికి పంపేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, తన పేరుతో వెలుగుతున్న శాసనసభా భవనాన్ని సగర్వంగా వీక్షించటం లేదా? దానిమీద తన పేరు చూసి మీ చేతుల్లో జరిగిన అవమానానికి సమాధానం దొరికిందని తృప్తి పడటం లేదా?
ఇంకొక ముఖ్య విషయం ప్రియాంకా వాద్రా గట్టిగా చెప్పినది.. ‘రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, తన తల్లి సోనియాగాంధీ రాష్ర్టాన్ని ప్రసాదించిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చిందని’. రాష్ట్రం ఇవ్వటానికి ఇవి కారణాలు కానే కాదు. ఒకవేళ అదే కారణమైతే 2009లో తన పుట్టినరోజు నాడు చేసిన రాష్ట్ర ప్రకటన వెనక్కి తీసుకునేవారు కాదు. అప్పటినుంచి ఫిబ్రవరి 2014 దాకా తాత్సారం జరిగేది కాదు. రాష్ట్రంలో ఉన్న మీ నాయకులు-రాష్ర్టాన్నిస్తే తమ పార్టీయే బ్రహ్మాండంగా గెలుస్తుందని, కేసీఆర్తో పొత్తు కూడా అక్కరలేదనీ చెప్పడంతో ఆమె ఆశపడ్డారు. అప్పటిదాకా తెలంగాణను దోపిడీ చేసిన ఆంధ్రా ప్రాంత నాయకుల చేతిలోని ఆంధ్రా జారిపోయినా, తెలంగాణలో అఖండ విజయం కలుగుతుందని ఆమె ఆశించారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈ ఉద్యమ వేడి తెలియలేదు.
ఎన్నికలయ్యాక ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచనలు, తమకు మంత్రి పదవి కావాలనే తాపత్రయం తప్ప ఇంకో విషయం వారి బుర్రలో లేదు. పాపం వారి తెలివి తక్కువతనంతో సోనియాగాంధీని తప్పుదారి పట్టించారు. మరి ప్రియాంక ఈ చరిత్ర తెలుసుకొని ఉండాల్సింది, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, ముఖ్యంగా గాంధీ కుటుంబం మొదటిసారి టీఆర్ఎస్ ఎందుకు గెలిచిందని ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే అర్థమయ్యేదేమో! నిజానికి ఒక సామెతలో చెప్పినట్టు ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ‘ఆలస్యంగా న్యాయం దొరికినా అది న్యాయమని అనలేం’ అని అర్థం. అంటే అప్పటికే చాలా ఘోరాలు, నష్టం జరిగిపోయి ఉంటుంది ఆ మనిషికో, ప్రాంతానికో, సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అలానే జరిగింది. ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరిగాక రాష్ట్రం ఇచ్చామని ఎగిరే పార్టీకి ఎంత సిగ్గులేని తనం ఉండాలి!
ప్రియాంక ఇంకో మాటన్నారు. నెహ్రూ, ఇందిర, మన్మోహన్, రాజీవ్గాంధీ తెలంగాణలో ఐఐటీ, ఐఐఎంలు ఏర్పాటుచేశారని! జరిగిన అన్యాయానికి ప్రతిగా ఏర్పడింది. హైదరాబాద్లో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్ అసలు వరంగల్లో పెట్టాల్సింది. అనంతపూర్, కాకినాడలో పెట్టి, వరంగల్లో ఉండాల్సినది హైదరాబాద్కు జరపటంతో తెలంగాణ పిల్లలకు ఎంతో నష్టం జరిగింది. అది తెలియదు ప్రియాంకకు. ఇంకోటి ధరల పెరుగుదల గురించి. తమ కాలంలో ఇబ్బడిముబ్బడిగా ధరలు పెరగటంతోటే అది చూసి మోదీ అధికారంలోకి వచ్చాడని ఆవిడకు తెలియదా? ధరలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయా? ఇంకా 40 లక్షల నిరుద్యోగులన్నారు. మరి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆంధ్రావారు ఎగరేసుకుపోతే కిమ్మనలేదే! వ్యవసాయంలో సాగునీరు, సర్ప్లస్ ఫండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని లలిత్ భార్గవ్ కమిటీ చెప్పినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ నాయనమ్మ ఆ అన్యాయాన్ని సరిచేశారా? అది చెప్పండి ముందు.
ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం లేదన్నారు. విమెన్స్ యూనివర్సిటీ వచ్చిందని మీ నాయకులు, మీకు చెప్పాల్సింది పైగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవన్నారు. అది ఫైల్ మీద సంతకం చెయ్యని మీ రామ్లాల్ లాంటి మా గవర్నర్ను అడగండి. పైగా మీరు అభియోగం వేసినట్టు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే మాకు యూనివర్సిటీలు ఇచ్చేవాడు కదా మోదీ! 150 మెడికల్ కాలేజీలు, 100 నర్సింగ్ కాలేజీల్లో ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం, మా గిరిజన యూనివర్సిటీ ఎగరేసుకుపోయిన మోదీ, తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడంటే మెడ మీద తలకాయ ఉన్నవాడెవడైనా నమ్ముతాడా!
మీ నాయనమ్మ ఇందిరాగాంధీకి, గిరిజనులంటే ప్రేమ అన్నారు. వారిచ్చిన పూసలదండలు వేసుకొని వారితో డాన్స్ చేయడం తప్ప వారి తండాలు మున్సిపాలిటీలు చేశారా? వారికి అక్కడ పాఠశాలలు తెరిచారా? బీఆర్ఎస్ వారి హక్కులు లాక్కోలేదు. వారికి భూముల మీద హక్కులు ఇచ్చింది. పోడు భూములు పంచింది. దళితబంధు ఇచ్చి దళితులను చిరు వ్యాపారులను చేసింది. ఆత్మగౌరవంతో బతుకడానికి బాటలు వేసింది. వృత్తి వ్యాపారులకు లక్ష రూపాయలు ఇచ్చింది. అవినీతి, మోదీ రిమోట్ కంట్రోల్ ఉంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేసేది తెలంగాణ ప్రభుత్వం? బీఆర్ఎస్ సొంత భవనాలు కట్టుకోలేదు. శాసనసభా భవనం, జిల్లాల వారి సౌకర్యానికి కలెక్టరేట్లు కట్టారు. ఒక కుటుంబంలో ముగ్గురు గవర్నమెంట్లో ఉన్నారంటున్నారు. అయితే ఒక కుటుంబంలో ముగ్గురు ప్రధానులుంటే ఏమనాలి? దేశంలో కులాల కుంపటి పెట్టి మంట రాజేసిందే మీరు. ఆర్థిక అసమానతలు తొలగేటట్టు మీ ముత్తాత పాలించి ఉంటే ఈనాడు ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు కదా?
ఇక మీ పార్టీ పాలించే రాష్ర్టాల్లో చెప్పినవన్నీ చేశామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ చెప్పారుగా ప్రియాంకా గారూ! నిన్న ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎంత బ్రహ్మాండంగా పథకాలు అమలు చేస్తోందో చూద్దామా?
కర్ణాటకలో అయిదు గ్యారెంటీలు ఇచ్చారు కాంగ్రెస్ వారు. అవన్నీ ప్రియాంక గాంధీ నోట ధాటిగా విన్న ప్రజలు మురిసిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయిదు నెలలు కాకుండా మాటలన్నీ నీటి మూటలయ్యాయి. గృహజ్యోతి-200 యూనిట్ల ఉచిత కరెంటు దేవుడెరుగు, మామూలు కరెంటులో కూడా ఘోరమైన కోతలు పెడుతోంది. కరెంటు ‘గృహజ్యోతి’ ఆరిపోయింది. ‘అన్నభాగ్య’ అభాగ్య అయింది. ఇంటింటికీ 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి, ఇప్పుడు బియ్యం లేవు, కిలోకు రూ.9 చొప్పున డబ్బులిస్తామంటున్నది. ప్రపంచమంతా గాలించినా రూ.9కి కిలో బియ్యం దొరుకుతాయా? మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమని గొప్పగా ప్రకటించి నెలలోనే కర్ణాటక ఆర్టీసీ దివాళా తీసేసింది. ఇప్పుడు అందులో కొర్రీలు పెడుతోంది. ‘శక్తి’ పథకం ఆ రకంగా ‘శక్తిహీన’ అయింది. తెలంగాణలో చెప్పినట్టే ప్రతి మహిళకు నెలకు 2000 ఇస్తామన్న కర్ణాటక ప్రభుత్వం ఒక్క నెలకే చేతులెత్తేసింది. ‘గృహలక్ష్మి’ పథకం ‘జ్యేష్టాదేవి’ తీసేసుకుంది. డిగ్రీ పాసైన ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామనీ, త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామనీ చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ అయిదు నెలలైనా ఈ పథకం మొదలుపెట్టలేదు. ‘యువనిధి’ కాస్తా కర్ణాటక రాజకీయ నాయకుల నిధి అయి వెయ్యి కోట్ల ధనాన్ని తెలంగాణ ఎన్నికల్లో పంచేందుకు దాచిపెడితే అది పోలీసులు పట్టుకున్నారు.
కాంగ్రెస్ తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేస్తున్న నిర్వాకం ఇదీ. పెద్ద ఉపన్యాసం ఇచ్చిన ప్రియాంకా వాద్రా చివరికి ఒక మంచి మాట చెప్పారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. వివేకంతో వేయాలి. మీ వికాసం కోసం వేయాలి, నాయకుల వ్యక్తిత్వం చూడండి. భవిష్యత్తు కోసం, తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం ఎన్నికలో మీ ఓటు వేయండి. ఇది మాత్రం నిజం. కేసీఆర్ కూడా ఇదే మాట చెప్తారు.
ఇప్పుడు చైతన్యంతో కాంగ్రెస్ 49 ఏండ్ల పాలనలో వారి వ్యక్తిత్వం చూసిన అనుభవంతో, వికసించిన వివేకంతో ఉద్యమకాల జ్ఞాపకాలతో, అమరుల మీద ప్రేమాభిమానాలతో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ‘ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ దాన్ టూ ఇన్ ద బుష్’ అంటే దూరంగా ఉన్న రెండు పిట్టల కోసం చేతిలోని పిట్టని వదిలేస్తారా? ఉద్యమ నాయకుడా? ఊరించే ఓటుకు నోటు నాయకుడా? అన్న మాట తప్పనివాడా? అనృతం తప్ప నిజం చెప్పనివాడా? చెప్పని పథకాలు కూడా ప్రజల అవసరాలను బట్టి చేసే నాయకుడా? చెప్పినవి కూడా ఎగేసే వ్యక్తా? రాష్ర్టాన్ని సాధించినవాడా? రాష్ర్టాన్ని జాతీయ పార్టీ పాదాల దగ్గర పెట్టేవాడా? తెలంగాణ వాదా? తెలంగాణ వ్యతిరేకా? ఎవరు కావాలో జాగ్రత్తగా ఎన్నుకోవటం విజ్ఞుల లక్షణం. మీ భవిష్యత్తు మీ చేతిలో!
కనకదుర్గ దంటు
89772 43484