కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామా! అనే సందిగ్ధంలో పడింది తెలంగాణ సమాజం. అలవికాని హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు దేవుడెరుగు.. గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అమలు చేయలేక వాటికి మంగళం పాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రజాపాలన అని గప్పాలు కొడుతున్న కాంగ్రెస్పై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే హస్తం సర్కార్ అసలు రంగు ఏంటో బయటపడింది. ప్రజాక్షేత్రంలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఏ పార్టీ అయినా మనుగడ సాగించలేదు. దశాబ్దాల పాటు పాలించిన పార్టీలకు ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం మెండుగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పాలిస్తామంటే.. ఆదరించిన ప్రజల నుంచే చీదరింపులు తప్పవు.
ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పాలనా అనుభవమే లేని రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అధికారం లేనప్పుడు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్.. పదవీ బాధ్యతలు స్వీకరించాక కూడా అదే పంథాను అనుసరించడాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ చేసిన అభివృద్ధి, తెలంగాణ ప్రగతిని చూసి యావత్ దేశం గర్వపడింది. చేసిన అప్పుల కంటే సుమారుగా 16 రెట్లు ఎక్కువ సంపదను సృష్టించారు కేసీఆర్. తెలంగాణ సంక్షేమ పథకాలను పక్క రాష్ర్టాలు గుర్తించి తమ రాష్ర్టాల్లో అమలు చేశాయి. ఇవేవీ కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించటం లేదు.
పేదల పక్షపాతి అయిన కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రైతుబంధు, దళితబంధు, కేసీఆర్ కిట్, రైతు బీమా, పోషకాహార కిట్.. ఇలా చెప్తూపోతే అనేక పథకాలు ఉన్నాయి. కానీ, సోషల్ మీడియాలో, అనుకూల పత్రికల్లో, టీవీల్లో తప్పుడు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ‘డిసెంబర్లోనే పెంచిన పింఛన్లను అందిస్తాం, ఫిబ్రవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, డిసెంబర్ నుంచే కరెంట్ బిల్లులను సోనియాగాంధీ కడుతుంది’ అని చెప్పి ఆ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. డిసెంబర్ 9న రైతుభరోసా కింద ఎకరానికి రూ.15,000 ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం అందించినట్టే రూ.10,000 మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. అది కూడా అంతంతమాత్రంగానే. ఇక కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ముచ్చటే లేదు. ప్రభుత్వం ఏర్పడిన మరునాడే చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ ఊసేలేదు.
రెండు నెలలు గడిచిపోయినా ఇవేవీ అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నేతలు అవహేళన చేస్తున్నారు. ‘ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఎలా అమలు చేస్తాం’ అని ఎదురుదాడి చేస్తున్నారు. ఇది సరికాదు. గత ప్రభుత్వం పథకాల అమలుకు తేదీలను ప్రకటించలేదు. పథకాలను అమలు చేసే తేదీలను ముందే ప్రకటించింది కాంగ్రెస్పార్టీ. కాబట్టి, తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు తప్పకుండా ప్రశ్నిస్తారు. అది మేధావుల హక్కు.
ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమం కోసం ఎంతో కొంత అప్పులు చేయక తప్పదు. భారతదేశంలో ఏ రాష్ట్రం అప్పులు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చూపించగలరా? తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడ్డ రేవంత్రెడ్డి ఇప్పుడు అప్పుల వేటలో పడ్డారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసీఆర్ సంపదను సృష్టించి.. పథకాలను అమలు చేశారు. అందుకే ఆయన హయాంలో ఏ సంక్షేమ పథకం మధ్యలో ఆగలేదు. పాలన చేతకాని రేవంత్ సర్కారు మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నది.
సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లమీదకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. లాఠీ దెబ్బలు, భాష్పవాయుగోళాలకు ఎదురు నిలబడ్డారు. కేసులు లేనటువంటి, జైలుకు వెళ్లని ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. వారంతా తాము ఉద్యమకారులమని ఎలా నిరూపించుకోవాలి. ఈ షరతు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులను అవమానించటమే అవుతుంది.
ప్రగతి భవన్ వద్ద నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇనుపకంచెలను ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించి.. ఏదో గొప్ప పని చేశామని గప్పాలు కొడుతున్నారు. జ్యోతిబాఫూలే ప్రజా భవన్ అని బోర్డు పెట్టటం కాదు, ఆయన ఆశయాల కోసం పని చేయాలి. ప్రజావాణిలో ఒకేఒక్క రోజు ప్రజలను కలిసిన ముఖ్యమంత్రి దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి ప్రజలను కలిసింది లేదు. ప్రతి రోజు ప్రజావాణి ఉంటదని చెప్పి.. మాట మార్చారు. ఆ తర్వాత వారానికి రెండు రోజులే పెట్టి.. ముఖ్యమంత్రికి బదులు ఓ మంత్రి దాని బాధ్యతలు చూసుకుంటారని చెప్పారు. కానీ, ఇప్పుడు అక్కడ ఎవరూ ఉండటం లేదు. ఇదా ప్రజాపాలన అంటే? తెలంగాణ ప్రజలారా! ఒక్కసారి ఆలోచించండి. ఏది ప్రజా ప్రభుత్వమో? తెలంగాణ మేధావులారా మౌనం వీడండి. మీ మౌనం తెలంగాణకు ఎంతో నష్టం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
జి.రాజేష్ నాయక్
96035 79115