రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రముఖుల్లో ఒకరు గుండెల్లి రాములుగౌడ్ సాధారణ ప్రజలతో నిరంతరం మమేకమై ఉంటారు. పబ్లిక్ టాక్కు ఆయన ప్రతిధ్వని. రాములు గౌడ్ ఏమంటారంటే.. కేటీఆర్ మాదిరిగా అభివృద్ధి ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఆయనకు తిరుగులేదు. పెట్టుబడులు సమీకరించడంలో, విశ్వవేదికలపై సరికొత్త ఆలోచనలను రేకెత్తించడంలో, భవిష్యత్తు తరాల యోగ క్షేమాలకు మార్గదర్శనం చేయడంలోనూ కేటీఆర్కు మరెవరూ సాటిరారని, ఆయన అరుదైన యువనేత అని రాములుగౌడ్ ఖుల్లం ఖుల్లా తేల్చిచెప్పారు. ఇపుడు రెండే రెండు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పబ్లిక్ నోళ్లలో నానుతున్నాయి.
మొదటిది.. జాతి జాగృతిలో తొలి అడుగు ఖమ్మం సభ అల్టిమేట్ సక్సెస్. అదే సమరోత్సాహంతో హైదరాబాద్లో ఫిబ్రవరి 17న జరుగబోయే బహిరంగ సభ గురించి టాక్ ఆఫ్ ది నేషన్. రెండోది… దావోస్ వేదికగా తెలంగాణకు ఇంకోసారి పెట్టుబడుల దావత్! మే 21-25 వరకు 5 రోజుల పాటు అమెరికాలో తలపెట్టిన ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో కీలకోపన్యాసం చేయాలని కేటీఆర్కు ఆహ్వానం అందడం. ఇవి విశ్వపటంలో తెలంగాణ ఖ్యాతికి వర్తమాన జాడలు.
మొదటిది భారతదేశ బంగరు భవిత కోసం.. రెండోది తెలంగాణ పసిడి తోరణం కోసం.. చూస్తూండగానే వివిధ రాష్ర్టాల్లో కొత్త శక్తి కదలికలతో జాతీయస్థాయి సంచలనం. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వారూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సేవలో భాగమయ్యేందుకు గులాబీ కండువా ధరిస్తూ పిడికిలి బిగిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిన ఖమ్మం భారీ బహిరంగ సభ. దేశ పాలనలో ఏం జరుగుతుందో, వందలాది ఏండ్ల వెనక్కి ఎట్లా తిరోగమనం పాల్జేశారో సగటు మనుషులు ఎంత కోల్పోతున్నారో ఎవరికి వారు చెక్ చేసుకునేలా ఖమ్మం వేదికగా సందేశం రాష్ర్టాల ఎల్లలు దాటించారు కేసీఆర్. ఒక్కో పాయింట్ మీద జనంలో విస్తృత చర్చను రాజేశారు. సాక్షాత్తూ తమిళనాడు అసెంబ్లీలోనూ తెలంగాణ సంక్షేమ పథకాలు, విధానాలూ ఆదర్శప్రాయమంటూ నిన్న మొన్ననే రీసౌండ్ ఇచ్చాయి. అంతేకాదు, మరోపక్క దేశంలోని సకల మౌలిక సమస్యలకు పరిష్కారాలు కేసీఆర్ ప్రజల ముందుంచారు. సర్వజనులు, సబ్బండవర్గాలూ కేసీఆర్ను ఫాలో అవడంలో అప్డేటెడ్ వర్తమానమే దీనికి నిదర్శనం. సమీప భవిష్యత్తులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. ఇప్పుడు గ్రామగ్రామాన, వీధివీధినా.. మౌత్ టూ మౌత్ డిస్కషన్ పెట్టారు. భారీ బహిరంగ సభల పరంపరలో మరోకటి పరేడ్ గ్రౌండ్స్లో ఆవిష్కృతం కాబోతున్నది. రాబోయే ఎన్నికల్లో గట్టి డెసిషన్కు అన్ని వర్గాల వారిని కార్యోన్ముఖులను చేయనున్నది.
ఇమికె రాములు.. వికారాబాద్ జిల్లా, దౌల్తాబాద్ మండలం ఇమ్డాపూర్ రైతు. ఇప్పుడు వంకాయ, టమాటా తోట అర ఎకరం చొప్పున వేశాడు. మూడెకరాల్లో వరి నారుమళ్లు పూర్తయ్యాయి. ఒకవైపు వ్యవసాయ పనుల్లో తలమునకలవుతూనే ఖమ్మంలో బ్రహ్మాండంగా విజయవంతమైన బీఆర్ఎస్ బహిరంగ సభ గురించి, కేసీఆర్ సహా గెస్టుల సందేశాల గురించి స్థానికంగా జరుగుతున్న చర్చను నాతో ఫోన్ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్లో ఈ నెల 17న నిర్వహించనున్న మలివిడత బీఆర్ఎస్ సభపైనా సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని పేర్కొన్నారు. తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు హాజరుకానుండటం బీఆర్ఎస్కు శుభసూచకమని, తెలంగాణ తరహా సంక్షేమ పథకాల ఎజెండా బాగుందంటూ కేసీఆర్కు జై కొట్టాడు.
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384