దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాకతీయుల గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏవేవో ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. వరంగల్ ప్రజానీకానికి ఉపయోగపడే ముచ్చట ఏమైనా చెప్పుతాడేమో వినాలని తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ ప్రభుత్వాల వరుస వైఫల్యాల తర్వాత దేశం సరైన నాయకుడికోసం సంఘర్షించింది. మొదటిసారి వాజపేయి నాయకత్వాన బీజేపీకి అధికారాన్ని ఇవ్వగా ఆ శూన్యాన్ని పూరించడంలో ఆ శక్తులు విఫలమయ్యాయి. కథ మళ్లీ మొదటి కొచ్చింది.
కాంగ్రెస్కు 2004, 2009లో అధికారం ఇస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టు తనకు తాను శూన్యాన్ని సృష్టించుకున్నది. 2014లో ఎన్డీఏ మిత్ర పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అచ్చేదిన్ వస్తుందని అగోచూడు.. ఇగో చూడని నమ్మబలికింది. మొదటిసారి మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు ప్రజలు దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో బృహత్తర మార్పులు తెస్తారని ఆకాంక్షించారు. నిరాశ, నిస్పృహలతో ఉన్న ప్రజానీకానికి సర్ది చెప్పే ప్రయత్నంలో ‘పెండ్లి కాగానే పిల్లలు పుడతారా? కొంతకాలం వేచి చూడాలి కదా?’ అని వెంకయ్యనాయుడు చమత్కార శైలిలో అన్న మాటలు దుమారం లేపాయి. రెండవ పర్యాయం 2019 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో పుల్వామా ఘటన జరిగింది. బాలాకోట్ ఘటన, పైలట్ అభినందన్ పాకిస్థాన్లో బందీగా మారి విడుదల కావడం వంటి అనేక గొలుసు కట్టు సంఘటనలు. మితవాద మతవాదం మాటున బీజేపీ 303 సీట్లను కైవసం చేసుకున్నది. దేశ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ.. హామీలను తుంగలో తొక్కి శూన్యాన్ని పూరించలేక పోయిందనే విమర్శ ఉన్నది. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయంపై స్పందించాలి.
తల్లిని చంపి.. బిడ్డను వేరు చేసిందని విభజన చట్టంలోని అనేక అంశాలను విస్మరించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించాలని అడుగడుగునా వివక్ష చూపెట్టింది నిజం కాదా? కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇవ్వలేదు? మీరు హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టిన మా మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశను ఎందుకు ఆమోదించడం లేదు.గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? నూతనంగా ఏర్పడ్డ జిల్లాలతో కలిపి 33 జిల్లాలు ఉంటే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ముందు పసుపు బోర్డు ఇస్తానని బాండ్ పేపర్లతో ఓట్లు దండుకొని ఎందుకు ఇవ్వలేదు? కేంద్రం 150 పైగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా?హైదరాబాద్కు ఐటీఐఆర్ ఇవ్వకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది ఎవరు? నేను సైతం బీసీని అని చెప్పుకునే మోదీ ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు? వీటికి సమాధానం చెప్పాల్సి ఉన్నది.
బీసీ జనగణనలో దగా చేస్తున్నది ఎవరు? ఇది 54 శాతం ఉన్న బీసీలను కించ పరచడమే కదా? దేశంలోనే 1984లో బీజేపీకి ఉగ్గు పాలు పోసిన రెండు సీట్లలో వరంగల్ గడ్డది ఒకటి అన్నది మర్చిపోయారా? మీరు రాష్టానికి ఏమిచ్చార ని.. ఏం సాధిద్దామని వరంగల్కు వస్తున్నారు? అని యావత్ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. వాగ్దానం చేసిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కు తరలించింది నిజం కాదా? ములుగు జిల్లా జాకారంలో 360 ఎకరాల భూమి ఇచ్చినా… గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు పెట్టలేదు? నాడు బీజేపీకి బతుకునిచ్చిన ఈ గడ్డకు అన్యాయం చేసి, గుజరాత్కు మాత్రం అన్నీ దోచిపెడుతున్న మీకు ప్రజలు వీడ్కోలు చెప్పటం ఖాయం.
2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ సమావేశంలో మోదీ మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది. అందులోని విలువలకు లోబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. మేము విచ్ఛిన్నకారులం కాము ఐక్యతతో ముందుకు సాగుతాం అంటూ నీతిబోధలు చేసి ఆతర్వాత సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారు. అప్పటికే అమెరికన్ మ్యాగజైన్ టైమ్ ఆయనను భారతదేశపు ప్రధాన విచ్ఛిన్నకారునిగా అభివర్ణిస్తూ ప్రత్యేక కథనం ప్రచురించింది.
విచిత్రమేమిటంటే నరేంద్రమోదీ ఒక అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనను అందిస్తామంటూ ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యంగా కూలదోస్తూ అనేక దుస్సాహసాలను ప్రోత్సహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికి, తీరని ద్రోహం చేస్తున్నారు.
మోదీకి బై బై అంటూ ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. అలాంటిది వరంగల్కు వచ్చి మీరు చేసేదేమున్నది? చాపకింది నీరులా బీఆర్ఎస్ విస్తరిస్తుంటే చూడలేక మధ్యప్రదేశ్ లో ఒంటి కాలు మీద లేచినట్టుకాదు. పోరుగల్లు బిడ్డల ప్రశ్నలకు జవాబు చెప్పాలి? బీజేపీ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించుకున్న ఏడాదికైనా కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం వరంగల్ పర్యటనలో చెపారేమోనని ఒళ్లంత కళ్ళు చేసుకొని, గుండెల నిండా గాయాలు నింపుకొని తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: జర్నలిజం శాఖ విభాగాధిపతి, కేయూ)