ఈ నెల 1న ఢిల్లీలో 17వ అఖిల భారత సహకార మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా వ్యవసాయరంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.6.5 లక్షల కోట్లు ఇస్తున్నట్టు, 2014 నుంచి తొమ్మిదేండ్లలో వ్యవసాయ బడ్జెట్లో రూ.15 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పుకొన్నారు.అలాగే మరో రూ.10 లక్షల కోట్లు కనీస మద్దతు ధరల పెంపుకోసం కేటాయించినట్టు తెలిపారు. ఇవ్వేకాదు ఇంకా అనేక రాయితీలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న 90 వేల గ్రామ సహకార సంఘాలకు అదనంగా రానున్న ఐదేండ్లలో మరో 2 లక్షల సంఘాలను ఏర్పాటుచేసి, వ్యవసాయ మౌలిక వసతులకు రూ.2.5 లక్షల కోట్లు ఖర్చుచేస్తామన్నారు. అలాగే వంట నూనెల దిగుమతిని తగ్గించి దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తామన్నా రు. ఈ ప్రకటనలు వాస్తవం కావాలని రైతులు కోరుకుంటున్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి?
2014 నుంచి గత తొమ్మిదేండ్లలో భారత వ్యవసాయరంగాన్ని విశ్లేషించినప్పుడు ప్రధాని ప్రకటన వాస్తవ దూరమన్నది నిజం. ప్రస్తుత 2023-24 బడ్జె ట్ పరిశీలిస్తే వ్యవసాయరంగానికి, వ్యవసాయ పరిశోధనలకు, పశుసంవర్ధక శాఖకు కలిపి రూ.1,29,723 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది దేశ బడ్జెట్లో 2.88 శాతం మాత్రమే. దేశ జీడీపీలో (స్థూల ఉత్పత్తి) వ్యవసాయరంగ ఉత్పత్తి 15 శాతం. కానీ జీడీపీలో ఆ మూడు రంగాలకు కేటాయించిన బడ్జెట్ 0.48 శాతం మాత్రమే. (జీడీపీ రూ. 267,99,146 కోట్లు) పీఎం ప్రణామ్ పథకం పేరుతో సేంద్రియ వ్యవసాయం వైపు ప్రచారం చేస్తూ ఎరువుల సబ్సిడీకి కోత పెడుతున్నారు. గతేడాది ఎరువుల సబ్సిడీ రూ. 2,28,530 కోట్లు కాగా, 2023-24కు రూ.1, 79,128 కోట్లకు అనగా రూ.49,402 కోట్లకు తగ్గించారు. ఇప్పటికే ఎరువుల వినియోగం శాస్త్రీయంగా పెంచకపోవడం వల్ల ఉత్పాదకత తగ్గుతున్నది.
హెక్టార్కు చైనాలో 80 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, అమెరికాలో 60 టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలో 22-25 టన్నులు మాత్ర మే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలో సాగు భూ మిలో 41 కోట్ల ఎకరాలతో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండగా, అమెరికా 39 కోట్లతో 2వ స్థానంలోనూ, చైనా 33 కోట్లతో 3వ స్థానంలో ఉన్నాయి. 2, 3 స్థానాల్లో ఉన్న దేశాలు తమ బడ్జెట్లో 7 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుతున్నాయి. అనేక దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. ప్రధాని మోదీ అంగీకరించినట్టు భారతదేశం ఇతర దేశాల నుంచి రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల వరకు దిగుమతులు చేసుకుంటున్నది. వంటనూనెలు, పత్తి, ఉన్ని, జూట్, ముత క ధాన్యాల ఉప ఉత్పత్తులు, పాల ఉప ఉత్పత్తులు, మాంసం, సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకుంటున్నది. వాస్తవానికి పత్తి, పాలు, మాంసం, మిరప, పసుపు, కోడి గుడ్ల ఉత్పత్తులలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. అయినా దిగుమతులు చేసుకుంటున్నాము.
దేశ వ్యవసాయ రంగానికి ప్రణాళిక లేదు. రైతులు తమకు తోచిన పంటలు పండిస్తున్నారు. భూసార పరీక్షలు జరిపి ఏ భూమిలో ఏ పంట వేయాలో చెప్పే నిర్దిష్ట ప్రణాళిక లేదు. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అశాస్త్రీయంగానే కాక రైతులకు నష్టదాయకంగా, కార్పొరేట్లకు, మధ్య దళారీలకు లాభదాయకంగా ఉన్నాయి.
అదనంగా 2 లక్షల సహకార సంఘాలను రానున్న ఐదేండ్లలో ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి ఒక సంఘం ఉంటుందని ప్రధాని మోదీ సెలవిచ్చారు. వాస్తవంలో ఉన్న సంఘాలను తగ్గించి 90 వేలకు కుదించారు. సహకార రంగానికి ప్రత్యామ్నాయంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కొని ప్రాసెస్ చేసి ఎగుమతులు చేస్తామని చెప్తున్నారు. 1995లో డబ్ల్యూటీవో ఏర్పడిన తర్వాత నుంచి అమలవుతున్న సంస్కరణలు దేశ వ్యవసాయాన్ని, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తున్నాయి.
కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలోకి చొచ్చుకొచ్చి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకుండా చేసి, రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటట్టు విధానాలు రూపొందిస్తున్నాయి. మోదీ అబద్ధాల సాయానికి బుద్ధి చెప్పడానికి రైతాంగం ఎదురు చూస్తున్నది.
-సారంపల్లి మల్లారెడ్డి