రెండున్నర దశాబ్దాల కిందటి మాట. ఉమ్మడి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చాంబర్ అది. ఆ శాఖకు మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓ పత్రికలో రిపోర్టింగ్ బాధ్యతల్లో ఉన్న నేను.. రవాణా శాఖ కార్యక్రమాలను చూసేవాడిని. ఆ కారణంగా సచివాలయానికి రోజూ వెళ్లేవాడిని. ముఖ్యంగా సచివాలయంలో ప్రెస్ రూం కళకళలాడుతూ ఉండేది.
రిపోర్టర్ను కావడంతో కేసీఆర్ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్డించేవారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆనాటి మంత్రి, ఉద్యమ నాయకుడు, పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ గురించి చెప్పడానికే.
పదవుల్లో ఉన్నవారు ప్రత్యేకించి శత్రువులను తయారు చేసుకోనవసరం లేదు. వారి ఉన్నతిని చూసి, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి శత్రువులు తయారైపోతారు. కేసీఆర్ రాజకీయ జీవితం, ఉద్యమకాలం గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ ఉండదు. వాటి గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. తెలియాల్సింది ఆయన వ్యక్తిత్వమే. ప్రత్యేక తెలంగాణ పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల నాకు అమితమైన ప్రేమ ఉండేది. ఉద్యమానికి ముందే, సమైక్య రాష్ర్టానికి మంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్కు తెలంగాణ పట్ల విపరీతమైన ప్రేమ ఉండేది. అలాగని, సమైక్య రాష్ట్రంలోని ఆంధ్రుల పట్ల వ్యతిరేకత నాకెక్కడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయి బతుకుతున్న వారినెవ్వరినీ కేసీఆర్ ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.
మరో ముఖ్యమైన విషయం.. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు, కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల తెలంగాణను భుజాలకెత్తుకున్నారని అటు తెలంగాణ వాదుల్లో కొందరు, ఇటు సమైక్య వాదుల్లో కొందరు అంటుంటారు కానీ, అది నిజం కాదు. ఈ విషయం కేసీఆర్కు బాగా సన్నిహితంగా మెలిగిన వారికి తెలుసు.
చంద్రబాబు నాయుడి మంత్రివర్గ సమావేశం తర్వాత జరిగే విలేకరుల సమావేశానికి కొందరు విలేకరులు వెళ్లేవారు. మరికొందరు లోపల ఏం జరిగిందో తెలుసుకునేందుకు మంత్రుల వద్దకు వెళ్లేవారు. మంత్రుల్లో చాలామంది సమావేశంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు విలేకరులకు చెప్పేవారు. కేసీఆర్ కూడా చెప్పేవారు. కానీ, అది ప్రజలకు సంబంధించినదే అయ్యేది తప్ప మిగిలినవి చెప్పేవారు కాదు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలు మాత్రం వెల్లడించేవారు కాదు. ఇదే సమయంలో మిగిలిన మంత్రులు మాత్రం వారి కంచెను దాటి మరీ అంతా పూసగుచ్చినట్టు చెప్పేసేవారు. ఉదయాన్నే పత్రికల్లో మంత్రివర్గ అంతర్గత సమావేశాలకు సంబంధించిన వార్తలు పతాక శీర్షికల్లో వచ్చేవి. ఆ అపవాదంతా కేసీఆర్పై పడేది. అయినా, ఓ బాధ్యతని భుజానికెత్తుకున్న కేసీఆర్.. ‘మౌనమే నా భాష అన్నట్టు’గా ఉండేవారు. ఇది ఆయనకు తన బాధ్యతల పట్ల ఉన్న గౌరవంగానే చూడాలి. బహుశా ఆ బాధ్యతాయుతమైన వ్యక్తిని చూశారు కనుకే తెలంగాణ ప్రజలు తమ చిరకాల ఆకాంక్షను ఆయన భుజాలపై పెట్టారేమో.
ఇక్కడ కూడా దశాబ్ద కాలానికి పైగా ఆ భుజాలు అలసిపోలేదు. ఆ కలను మధ్యలోనే వదిలేయలేదు. ఇదే కేసీఆర్ను తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేసింది. ఓ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి.. దాన్ని ఎలా విజయం దిశగా ఎలా పరుగెత్తించాలో నేటి తరానికి తెలియజేసింది నిస్సందేహంగా కేసీఆరే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలంతా కేసీఆర్కు వ్యతిరేకమని రాజకీయ నాయకులు, మేధావులు భావించారు. నిజానికి, విడదీసిన వారిపైనే కోపం ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సెటిలర్లు గంపగుత్తగా కేసీఆర్కు పట్టం కట్టడమే దీనికి తార్కాణం. ఐదేండ్ల కేసీఆర్ పాలన తర్వాత ఓ బక్కపలచని వ్యక్తిని ఓడించేందుకు సిద్ధాంతాలను పక్కనపెట్టి కలిసిన తొమ్మిది పార్టీలు కూడా కేసీఆర్ను ఓడించలేకపోయారంటేనే ప్రజల ప్రేమను అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైతే.. ఓ సీనియర్ జర్నలిస్టు మిత్రుడు నాకు ఫోన్ చేసి ‘మీ కేసీఆర్ ఓడిపోయారుగా, గులాబీ రంగు వెలిసిపోయిందిగా’ అని అన్నారు. ‘అది ఓటమి కాదు.. రెండున్నర దశాబ్దాల అలుపెరుగని ఓ యోధునికి ప్రజలు కొన్నేండ్ల పాటు ఇచ్చిన విశ్రాంతి’ అని చెప్పా. ఇక గులాబీ రంగు వెలిసిపోవడం అంటావా.. ‘అది రంగు కాదు.. తెలంగాణ ప్రజలు తొడిగిన కవచ కుండలం’ అని అన్నాను.
-ముక్కామల చక్రధర్
99120 19929