భారతదేశ విద్యుత్రంగంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను, ఉద్యోగులను, రైతులను, పేద ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన విద్యుత్రంగం ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పరుగెడుతున్న తరుణం ఇది.
దేశవ్యాప్త విద్యుత్ ఉద్యోగుల ఆందోళనల పర్యవసానంగా కేంద్రం తీసుకురాదలచిన విద్యుత్ సవరణ చట్టం పార్లమెంట్ స్టాండిం గ్ కమిటీకి నివేదించినప్పటికీ, సర్క్యులర్ల పేర దొడ్డిదారిన అమలుకు పూనుకుంటుండటం ఖండనీయం. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో సుమా రు లక్ష మందికిపైగా విద్యుత్రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యం ఇదీ.
యూపీ పవర్ కార్పొరేషన్లో సుమారు లక్ష మంది పనిచేస్తుండగా, అందులో దాదాపు 65 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. మార్చి 16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన ‘యూపీ రాజ్య విద్యుత్ కర్మచారి సంయుక్త సంఘర్ష్ సమితి’ ప్రధాన డిమాండ్లను ఒకసారి పరిశీలిద్దాం.
విద్యుత్ సవరణ చట్టం-2022ను ఉపసంహరించుకోవాలి. జనరేషన్, ట్రాన్స్మిషన్ రంగాల్లో తలపెట్టిన ప్రైవేటీకరణను విరమించుకోవాలి. ఓబ్రా అంపారలో తలపెట్టిన 2X800 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ జెన్కో ఆధ్వర్యంలోనే జరగాలి. 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ ఈహెచ్టీ సబ్-స్టేషన్లను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి. ఔట్సోర్సింగ్కు ఇవ్వరాదు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలి. తెలంగాణ, రాజస్థాన్ల వలె కాం ట్రాక్టు కార్మికులను దాదాపు 65 వేల మందిని క్రమబద్ధీకరించాలి. ఉద్యోగులకు 9, 14, 19 ఏండ్ల సర్వీసు అనంతరం ప్రమోషన్లు ఇవ్వాలి.
2022 డిసెంబర్ 3న ఆ రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి సమక్షంలో విద్యుత్ సంఘాలతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రైవేటీకరణ దిశగా అక్కడి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడంతో సమ్మె అనివార్యమైనట్లుగా అవగతమవుతున్నది. యూపీ విద్యుత్ కార్మికుల డిమాండ్లను పరిశీలించినప్పుడు ఒకటి, రెండు మినహా మిగ తా విషయాలన్నీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం లేదా సానుకూలంగా ఉండటం హర్షించదగిన విషయం. విద్యుత్ సవరణ చట్టా న్ని నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడ మే కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.
సుమారు రూ.30 వేల కోట్లతో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగాపవర్ ప్లాంటు(5X800=4000 మెగావాట్ల సామర్థ్యం)ను కూడా ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో చేపట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. గత 8 ఏండ్లలో నిర్మాణం జరిగిన 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లన్నీ ట్రాన్స్కో చేపట్టినవే. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం సంక్షోభంలో కూరుకుపోయిన విద్యుత్సంస్థలు ఇప్పుడు అన్నివర్గాలకు 24X7 కరెంటును అం దిస్తున్నాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా అవతరించడం ప్రభుత్వరంగంలోనే సాధ్యమైందనే విషయం గుర్తెరగాలి. 23 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించింది రాష్ట్ర ప్రభుత్వం.
పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, టైం బౌం డ్ ప్రమోషన్లు మినహాయిస్తే విద్యుత్ ఉద్యోగుల అన్ని డిమాండ్లను ఎటువంటి పోరాటాలు లేకుండానే సీఎం కేసీఆర్ అంగీకరించటం రాష్ట్ర ప్రభు త్వ ‘ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ’ విధానానికి ఉదాహరణ. 2014, 2018లో ఉద్యోగుల వేతన సవరణ ను ఆశించినదానికంటే మెరుగ్గా సీఎం కేసీఆర్ అందించడంతో విద్యుత్ ఉద్యోగులు ప్రశంసనీయమైన సేవలందించి ప్రభుత్వం, ప్రజల మన్ననలు పొందారు. కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వా లు విద్యుత్ ప్రైవేటీకరణను విరమించుకొని తెలంగాణ మాదిరిగా విద్యుత్రంగ పటిష్ఠీకరణకు పూనుకోవాలి.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్,టీఎస్ఎస్పీడీసీఎల్)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313