అదేదో టీవీ యాడ్ లో…ఏం నడుస్తున్నదని అడిగేతే…అంతా ఫాగ్.. నడుస్తున్నదని చెప్పినట్లు…దేశంలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే….అంతా ప్రధాని మోదీ..‘మన్ కీ బాత్’ గురించిచెబుతున్నారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీ లో చూసినా…ఆఖరుకు సామాజిక మాధ్యమాల్లోనూ.. ప్రధాని మన్ కీ బాత్ గురించి చర్చే…నిజానికి ప్రధాని మన్ కీ బాత్ అంత ప్రాధాన్యత సంతరించుకున్నదా? యావత్ దేశ ప్రజలు చర్చించుకునేంత గొప్పదా? ..
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రను తిరగేస్తే ఏ ప్రధాని ఏడాదికి ఒకటి , రెండు సార్లు తప్ప ప్రజలకు సందేశాలు ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రతి నెలా మనసు విప్పి ప్రజలతో మాట్లాడుతున్నారట. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం, ప్రభుత్వ ప్రసారమాధ్యమాలైన ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వా రా ప్రసారమవుతున్నది. ఈనెల 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసారం కానున్నది. ప్రధాని ’మన్కీబాత్’ను ‘జన్ కీ బాత్’ గా చిత్రీకరిస్తూ సంబురాలు చేసుకోవాలని బీజేపీ ఉత్సాహపడుతున్నది. నిజానికి అందులో అంత విషయం ఉందా?
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో…భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప జేశారంటూ ఆకాశానికెత్తుతూ విశ్వగురువుగా అభివర్ణిస్తున్న బీజేపీ నాయకులు నాణేనికి ఒకవైపే చూస్తున్నారు తప్ప మరోవైపు భారతదేశ తిరోగమనం మాత్రం వారికి కనిపించడం లేదు. దేశ సంపదను అదానీ, అంబానీ వంటి బడా వ్యాపారులకు దోచిపెడుతూ..అధికారాన్ని నిలబెట్టుకునేందుకు…అడ్డ దారులన్నీ తొక్కుతున్న ఉదంతాలెన్ని కనబడుతున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారు.
బీజేపీకి వెనుకుండి మంత్రదండం ద్వారా శాసించే ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్చాలక్ మోహ న్ భగవత్ కూడా తమాషా చూస్తూ నిస్సహయంగా ఉండిపోయారు. మోదీ, అమిత్ షా ద్వయం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత.., ‘ఎ పార్టీ విత్ డిఫరెంట్ ఐడియాలజీ’గా తనకున్న ముద్రను బీజేపీ తనకుతానే చెరిపేసుకున్నది. దీనిని నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం ఉందా?.
ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి మారు పేరు కాంగ్రెస్పార్టీ అంటూ గగ్గోలు పెట్టిన ఆనాటి బీజేపీ..నేటి బీజేపీ ఒకటేనా? అని సామాన్యు డు సైతం విస్తుపోతున్నాడు. ఎన్నికల్లో గెలుపొందడమే పరమావధిగా..నైతిక విలువలను పాతాళానికి తొక్కి..రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీ బీఐ, ఐటీలతో దాడులు చేయించడమే పరిపాటిగా మారింది. ఎంతటి దోషులైనా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే సఛ్చీలురు అవుతున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి అని, నిస్సిగ్గుగా పాలకులు వ్యవహరిస్తున్నారని.. మేధావులు గగ్గోలు పెడుతున్నా.. ఎప్పుడూ తన మన్కీ బాత్లో ప్రధాని ఏనాడూ స్పందించలేదు.
‘మన్ కీ బాత్’ అని చెప్పటమే తప్ప, మో దీ, ప్రజల ‘మనసులో మాట’ను తెలుసు కోవడానికి ప్రయత్నించలేదు. ప్రజలతో కాక పోయినా కనీసం, పాత్రికేయులతోనైనా ముచ్చటించిన దాఖలాలు లేవు. వారి ప్రశ్నలకూ జవాబులు చెప్పిన ఉదంతాలు లేవు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే మీడియాతోనైనా ‘మోదీజీ…కాస్త మాట్లాడండి’. అప్పుడు ప్రజల మనోభావాలతో పాటు, వాస్తవాలూ తెలుస్తాయి. మోదీ తెలంగాణాలో ‘తెలంగాణ మే కమల్ ఖిలేగా’ అని కార్యకర్తలకు భరోసా కల్పిస్తారు..కార్యకర్తలను ఉత్సాహ పరుచాలనుకోవడంలో తప్పులేదు. తెలంగాణలో అధికారంలోకి రావడం మాత్రం భ్రమే.
బీజేపీ ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చింది. ఇలా కూల్చడంలో ‘అమిత్ షా’ది అందె వేసిన చెయ్యి కదా. ఆయనతో జత కలిసినప్పటినుంచి బీజేపీ ప్రభ వెలిగిపోతున్నదని, దేశమంతా కోడై కూస్తున్నది. కానీ, బీజేపీ అంది వచ్చిన ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజలను వారికి తెలియకుండానే వారి మెదళ్లను మత విద్వేషాలతో భ్రష్టు పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నది. కానీ చాప కింద నీరులా మీరు చేస్తున్న ఆగడాలను ప్రపంచం గమనిస్తున్నది. మైక్రోసాఫ్ట్, బీబీసీలు చేసిన సర్వేలో ప్రపంచంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న దేశాల పట్టికలో భారత్ అగ్రభాగాన నిలిచింది. అందులో బీజేపీ అనుబంధ సంస్థలే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రజలకు ఉచిత తాయిలాలు వద్దంటూనే బడా బాబులకు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ, జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతీరును ప్రజలూ గ్రహిస్తూనే ఉన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు’, ‘పెట్టు బడుల ఉపసంహరణ’ పేరుతో… జాతి సంపదను.. దోచి పెడుతున్నతీరును, పార్టీ ప్ర యోజనాలకోసం ఎలక్ట్రోరల్ బాండ్ల అమ్మకానికి రాచ బాట వేసి ‘క్విడ్-ప్రో’కు బాహాటంగానే ఊతమివ్వడం.. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేశ స్వాతంత్య్రానంతరం తిరుగు లేని పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని, కూకటి వేళ్ళతో పెకిలించగలిగిన మోదీకి, ఆ పరిస్థితి రాదని ఎందుకనుకుంటున్నారు? నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చస్తుందన్నదన్నది గుర్తులేదా?
మీ ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన ఒక్క ప్రాజెక్టు ఏదైనా ఉంటే చెప్పండి? అంతెందుకు రాష్ట్ర విభజన సందర్భంగాఇచ్చిన హామీలనైనా నెరవేర్చిందా? కనీసం తెలంగాణకు ఏదైనా విషయంలో చేయూతనందించిందా? కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఏమైంది? గిరిజన విశ్వవిద్యాలయం జాడెక్కడా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సంగతి ఏమైంది? ఉమ్మడి ఆస్తుల విభజన సంగతేమిటి? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సంగతేమిటి? ఇలా.. ప్రశ్నించుకుంటూ పోతే..ఒక్కదానికైనా జవాబు చెప్పగలరా? తెలంగాణ ప్రజల మనసులో మాట ఎప్పుడైనా విన్నారా? వారు మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ మనసులోని మాటలు కాదు, వారి మన్ కీ బాత్ వినండి మోదీజీ… వీలైతే వారి ప్రశ్నలకు జవాబు చెప్పండి’ అప్పుడే మీ మన్ కీ బాత్ కు అర్థం ఉంటుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్ )
-ఎం నాగశేష కుమార్
98494 86750