‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) మన దేశంలోనే అత్యంత క్రూరమైన నల్లచట్టం’ అంటూ సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో తెలిపారు. ‘ఈ చట్టం ఈడీకి అరెస్టు, జప్తు, తనిఖీ, స్వాధీనం చేయటానికి వీలుగా నిరంకుశ అధికారాలనిస్తుంది. నేర శిక్షాస్మృతిలో కల్పించిన రక్షణలు కూడా లేకుండా ఈ చట్టాన్ని రూపొందించారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన జరిపిన వాదనల సమాహారం ఇదీ..
PMLA | 2011-15 మధ్య తమిళనాడు రవాణాశాఖలో జరిగిన ఉద్యోగాల భర్తీలో సంబంధిత మంత్రి వి.సెంథి ల్ బాలాజీతోపాటు పలువురు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు తాజాగా దర్యాప్తునకు ఆదేశించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాల మీద జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ ఈడీ దుర్వినియోగంపై వాదనలు వినిపించారు.
‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, దాని అమలు తీరు అన్ని న్యాయసూత్రాలకు మాత్రమేగాక సమాఖ్య విధానాలకు కూడా పూర్తి వ్యతిరేకం. వ్యక్తులు లక్ష్యంగా ఈడీ దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతున్నది. సీబీఐ దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈడీకి అటువంటి నియంత్రణ లేదు. ఇది సమాఖ్య విధానానికి వ్యతిరేకం. పశ్చిమబెంగాల్లో ఒక నేరం జరిగిందనుకుందాం. దానికి సంబంధం ఉన్నదే ఢిల్లీలో కూడా ఒక ఘటన నమోదైతే ఈడీ ఢిల్లీలో కేసు పెడుతుంది. బెంగాల్లో ఉన్న సంబంధిత కేసులన్నీ ఢిల్లీకి బదిలీ అవుతాయి. ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం’ అని సిబల్ చెప్పారు.
ఈడీ అధికారాలకు సంబంధించి విజయ్ మదన్లాల్ చౌదరీ కేసులో గతేడాది జూలైలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సిబల్ కోరారు. ఆ కేసులో జస్టిస్లు ఏఎమ్ ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్లతో కూడిన త్రిసభ్య ధర్మాస నం, పీఎంఎల్ఏ ప్రకారం ఈడీకి ఉన్న అరెస్టు, జప్తు, తనిఖీ, స్వాధీనం చేసుకునే అధికారాలను సమర్థించింది. తాను నేరం చేయలేదని నిందితుడే నిరూపించుకోవాలని చెప్పే నిబంధన కూడా సరైనదేనని పేర్కొంది.
మనీ లాండరింగ్ నేరం గురించి చర్చించే సెక్షన్-3పై త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన వివరణను సిబల్ ఉటంకించారు. అక్రమాస్తులు ఆర్థికవ్యవస్థలో కలిసిపోయాయా లేదా అన్నదానితో సంబంధం లేకుండా నేరంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతీ చర్యను మనీలాండరింగ్ నేరంగానే ధర్మాసనం నిర్వచించింది. ఈ తప్పుడు నిర్వచనం కారణంగా నేరంతో సంబంధం ఉన్న ఆస్తులను (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) కలిగి ఉన్నంత మాత్రానే మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అవుతుందని సిబల్ తెలిపారు.
దీనికి ఒక ఉదాహరణను కూడా వివరించారు. ‘నేను ఒకరికి లంచం ఇచ్చాననుకుందాం. అది తీసుకున్న వ్యక్తి వద్ద ఉన్న ఆ సొమ్ము అక్రమమైనదే. అంతేగానీ, అది మనీ లాండరింగ్ కాదు. ఆ డబ్బును చట్టబద్ధమైన డబ్బుగా పేర్కొంటూ ఏదైనా స్థిరాస్తినో, ఆభరణాలనో కొంటే అప్పుడు ఆ నేరం మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. కానీ, మదన్లాల్ చౌదరీ కేసులో ధర్మాసనం తీర్పు తర్వాత మనీ లాండరింగ్కు, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్కు తేడా లేకుండా పోయింది. ఆ నిర్వచనం చట్టాల్లో ఉపయోగించే భాషకు, చట్టాలకు చేసే వివరణకు పూర్తి విరుద్ధమైనది. సదరు న్యాయమూర్తులకు తగిన గౌరవాన్ని ఇస్తూనే.. ఆ తీర్పు రాజ్యాంగబద్ధంగా సందేహాస్పదమైనదని పేర్కొంటున్నా’ అని సిబల్ వివరించారు. పీఎంఎల్ఏలో ఎటువంటి రక్షణలు లేకపోవటమనేది మనీ లాండరింగ్ అభియోగాలపై దర్యాప్తును ఎదుర్కొనే నిందితుల హక్కులపై ప్రభావం చూపుతున్న విషయాన్ని సిబల్ ప్రధానంగా ప్రస్తావించారు.
‘ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే, దాంట్లో పోలీసులకు ఇచ్చిన సమాచారం మాత్రమే ఉన్నా కూడా.. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను దాఖలు చేస్తుంది. నేరం జరిగిందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణే కాలేదు. దానిపై దర్యాప్తే మొదలు కాలేదు. ఈడీ సమాంతర దర్యాప్తును ఎలా ప్రారంభిస్తుంది? అంతేకాదు, సదరు ఈసీఐఆర్ను ఈడీ నిందితులకు ఇవ్వదు. అడిగితే అది తమ అంతర్గత నివేదిక అని చెప్తుంది. సమన్లు జారీ చేసే సమయంలో కూడా ఈడీ నిందితుడిగా పరిగణిస్తున్నదా? సాక్షిగానా? అన్న విషయాన్ని వెల్లడించదు. ఫిర్యాదుదారు, నిందితుడు రాజీ పడే అవకాశం ఉన్న నేరాలను (కంపౌండబుల్ అఫెన్స్) కూడా పీఎంఎల్ఏ కింద నాన్ కంపౌండబుల్ అఫెన్స్గా పరిగణిస్తారు. ఇది అహేతుకం, ఆర్టికల్ 14కు వ్యతిరేకం’ అని సిబల్ పేర్కొన్నారు. సీల్డ్ కవర్ సంస్కృతిని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై నమోదైన పీఎంఎల్ఏ కేసు నుంచి ఈ సంస్కృతి మొదలైందని, ఆ కేసులో న్యాయవాదిగా ఉన్న తాను ఆ సంస్కృతిని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా పేర్కొన్నానని తెలిపారు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా సీల్డ్కవర్ విధానాన్ని తప్పుబట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
పీఎంఎల్ఏ చట్టాన్ని శిక్షించే (పీనల్) చట్టంగా కాకుండా, నేరాలను నిరోధించే (ప్రివెంటివ్) చట్టంగా విజయ్ మదన్లాల్ చౌదరీ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం అభివర్ణించటాన్ని సిబల్ తప్పుబట్టారు. మనీలాండరింగ్కు పాల్పడిన వ్యక్తులను శిక్షించే ఈ చట్టం ఎలా ప్రివెంటివ్ చట్టం అవుతుంది? అని ప్రశ్నించారు. పీఎంఎల్ఏను పీనల్ చట్టం కాదని సుప్రీంకోర్టు పేర్కొనటం వల్ల, నిందితులను అరెస్టు చేసి వారి ఆస్తులను జప్తు చేసే అధికారం ఉన్నప్పటికీ ఈడీ అధికారులను పోలీసు అధికారులుగా గుర్తించటం లేదని తెలిపారు. ‘పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం.. ఈడీ అధికారి ముందు వాంగ్మూలం ఇవ్వటాన్ని న్యాయ విచారణగా పరిగణిస్తారు. ఇదెలా సాధ్యం? దర్యాప్తు చేసే అధికారి న్యాయాధికారి ఎలా అవుతారు?’ అని ప్రశ్నించారు. ఈడీ అధికారులకు పోలీసు అధికారులకు ఉండే అధికారాలన్నీ ఉన్నాయి కాబట్టి, వారిని పోలీసు అధికారులుగానే భావించాలని విజ్ఞప్తి చేశారు.
‘వారిని పోలీసు అధికారులుగానే పరిగణిస్తే, వారి ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించటానికి వీల్లేదు. ఇతర ఏ రకమైన సమాచారాన్ని ఈడీ రికార్డు చేసినా అది కోర్టులో ప్రవేశపెట్టే సాక్ష్యం కాబోదు. తద్వారా విచారణ సందర్భంగా న్యాయమూర్తిపై దాని ప్రభావం ఉండదు’ అని వివరించారు.
పీఎంఎల్ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ కపిల్ సిబల్ పలు వాదనలు వినిపించారు. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని విజయ్ మదన్లాల్ చౌదరీ కేసులో వెలువడిన తీర్పును పునఃసమీక్షించాలని, కేసును విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆధారాల్లేకుండా..
పీఎంఎల్ఏ కింద ఈడీ చేపలు పడుతున్నట్లు పనిచేస్తున్నది. కేవలం అనుమానం ఆధారంగా ఈ చట్టాన్ని అమలుచేయటం ఏ విధంగా సరైనది? నేరం తాలూకు సమాచారం లభించిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం సాధారణం. కానీ, ఈడీ దీనికి విరుద్ధంగా.. మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆ తర్వాత నేరం జరిగిందా, లేదా? అన్నట్లుగా దర్యాప్తు జరుపుతున్నది. నిందితుల వద్ద అక్రమ సొమ్ము పట్టుబడకపోయినా ఈడీ దర్యాప్తు ప్రారంభిస్తున్నది. ఒక్క కేసని కాదు, అన్ని కేసుల్లో ఇలానే వ్యవహరిస్తున్నది. ఇది తీవ్రమైన పొరపాటు. పీఎంఎల్ఏ చట్టం వల్ల ఈడీ యథేచ్ఛగా వ్యక్తులను ఎంచుకొని, వారి ఆస్తుల తాలూకు సమాచారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నది. సదరు ఆస్తుల సమాచారం ఈడీ వద్ద లేకున్నా, నిందితుల నుంచే వివరాలు తీసుకుంటున్నది. ఈ చట్టం నిరంకుశ నల్లచట్టంగా తయారైంది.