గత పదేండ్లుగా దేశం లోపల ఆర్థికస్థితి నాగలోకానికి (పాతాళానికి), భారతదేశ ప్రచార ప్రతిష్ఠ నాకలోకానికి (స్వర్గానికి) పరస్పర వ్యతిరేక దిశల్లో సాగుతున్నాయి. దేశంలో ఉన్నవాళ్లలో రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఆవేదన, పాతాళానికి జారుతున్న విద్యారంగం, పెరుగుతున్న నేరాలు, తగ్గుతున్న స్త్రీ గౌరవం.. విద్యావంతులు, విజ్ఞానవంతుల్లో నిర్వేదాన్ని పెంచుతుంటే, విదేశాల్లో మాత్రం ‘ఇండియా షైనింగ్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ వన్ మాన్, నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి’ అని ప్రచారం. ఇదెట్లా సాధ్యం? పైన చెప్పినట్టు విదేశాల్లో గౌరవం పెరుగుతోందని సంతోషించేవాళ్లు భజన సంఘంగా ఏర్పడితే, వ్యతిరేకులు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన, నిబద్ధత ఉన్నవాళ్లు దిక్కుతోచకుండా ఉన్నారు.
PM Modi | మేధ, ప్రజ్ఞ కలిగి దేశ భవిష్యత్తు బాగుండాలని నిజంగా తపన పడే నాయకుడు ప్రజలను ఆలోచనాపరులను చేయాలని, స్వతంత్రంగా సరైన పద్ధతిలో జీవనం సాగించే మనుషులుగా చేయాలని ప్రయత్నిస్తాడు. నియంత మాత్రం తను చెప్పిందే నమ్మేటట్టు జనాలు అమాయకులుగా, సొంత ఆలోచన లేకుండా ఉండాలని ఆశిస్తాడు. ఎన్నోరకాల అబద్ధాలు ప్రచారం చేసి వారిని లోబరుచుకోవాలని చూస్తాడు. రెండురకాల వ్యక్తులు అతన్ని అనుసరిస్తారు. చదువు, లోకజ్ఞానం లేక అధికారంలో ఉన్నవాళ్లు చెప్పేది గుడ్డిగా నమ్మేవారు, ఆ పాలకుడి వలన లబ్ధి పొందు తూ తాము చెప్పేవి అబద్ధాలని, చేసేవి దుర్మార్గాలనీ తెలిసినా ఆ నాయకుడిని అద్భుత మానవుడిగా, ఆదర్శ పురుషుడిగా ప్రచారం చేసేవారు. ఇప్పుడు సామాన్య జనాలు అజ్ఞానంతో మోదీ గొప్పవాడని నమ్మితే, బీజేపీ కొనుక్కున్న చానెల్స్, సామాజిక మాధ్యమాలు, వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారాలు చేసేవారు ఈ కోవకు చెందుతారు. అందులో కేవ లం పాఠశాల విద్య పూర్తిచేసిన వారి దగ్గరి నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణుల దాకా వేల మంది ఉన్నారు. మోదీ ఈ గ్రూపుల కోసం నెలకు కొన్ని కోట్లు ఖర్చు పెడతారని ప్రచారంలో ఉంది.
ఇక మొదటి ఎన్నికల్లో మోదీ గుజరాత్లో చేసిన అద్భుతాలను (?) పై గ్రూపులు తెగ ప్రచారం చేయటం వల్ల గెలిచారు. ఆ తర్వాత అబద్ధాల నినాదాలతో రెండవసారి గెలిచారు. చేసిన పనులు మాత్రం కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, 40 లక్షల మరుగుదొడ్లు కట్టడం వంటివి సహాయపడ్డాయి ఆ విజయానికి. నినాదాలు దారి తప్పాయి. ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తానన్నది బూటకమైతే, ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ అన్నది ‘భేటీ ఛిడావ్’ అయిపోయింది. బీజేపీ వారు, వారి అనుయాయులు చేసిన నేరాలకు శిక్షలు లేవు. ఆఖరికి అంతర్జాతీయ పతకాలు పొందిన అమ్మాయిలు కూడా లైంగిక వేధింపులకు గురికావడం ఒక వేదన అయితే, దానికి కారకులైన వారు స్వేచ్ఛగా సమాజంలో తిరగడం దేశవాసులందరికీ అవమాన సదృశ్యమైంది. అయితే అలా అని ఎవరికీ శిక్షలు పడలేదా అంటే, పడ్డాయి. రాళ్లు విసిరారనో, ఇతర నేరాలకో ముస్లింల ఇళ్ళు బుల్డోజర్ శిక్షకు గురై, నేలమట్టమయ్యాయి. లక్షద్వీప్ దాకా వెళ్లి, కుర్చీ వేసుకొని, బీచ్లో కూర్చొని ఆ ప్రాంతాన్ని ఎలా తయారుచేసి మాల్దీవులను ఎలా దెబ్బకొట్టాలా? అని గంటల తరబడి ఆలోచించే సమయం ఉన్న ప్రధానమంత్రికి మణిపూర్ మారణహోమ బాధితులను ఓదార్చే తీరిక లేదు. అక్కడ స్వేచ్ఛగా నేరాలు చేస్తున్నవారిని శిక్షించే ఉద్దేశమూ లేదు. యుగ పురుషులకు రాజ్యాంగంతో పనేముంది? వారి ఉద్దేశాలు, ఆలోచనలే న్యాయం, ధర్మం. ఎప్పుడో రాసిన రాజ్యాంగమెందుకు వారికి?
పదేండ్లు భారతదేశాన్ని గొప్పగా ఊహించుకొని మోదీ ఆదర్శ పురుషుడనుకున్నవారికి కొద్దిగా చిక్కులు వచ్చేటట్టున్నాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది అందరికీ, అన్నింటికీ వర్తించే సూక్తి. ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ఇటువంటి అత్యుత్సాహానికి బలై చివరికి హేళనకు గురవుతున్నామని శ్రీరాముడి పట్ల నిజమైన ఆరాధన, ప్రేమ, గౌరవం ఉన్నవాళ్లు భయపడుతున్నారు. ఎందుకో చూడండి.
అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ తేదీ ఈ నెల 22 అని నిర్ణయించిన దగ్గరినుంచి, మనం కలికాలంలో ఉన్నామా లేక కృతయుగానికి వెళ్లిపోయామా అని సందేహం వస్తున్నది. అక్కడ జరిగాయని మోదీ గారి ప్రచార సాధనాలు చెప్తున్న సంఘటనలు చూద్దాం!
ఒకరోజు స్వయంగా హనుమంతుడు వానర రూపంలో వచ్చి అక్కడ కొందరు దుండగులు పెట్టిన బాంబు తీగలు తెంపేశాడు. అది విన్న అక్కడి జనమంతా ‘జై రామభక్త హనుమాన్, జై భజరంగ బలి’ అని నినాదాలు చేసి హనుమంతుడి మహిమలను కొనియాడారు.
ఆ వెంటనే వేల కోతుల గుంపులు అయోధ్యకు చేరుకొని రామాలయం చుట్టూ చేరి సంతోషంతో కేరింతలు కొట్టాయి. ఆ వాతావరణం కిష్కింధవనాన్ని తలపించింది. మళ్లీ ప్రజలకు పండుగ. ఇంకో రోజు వేల కొద్ది రాబందులు (జటాయువు వారసులు) అయోధ్య చేరుకొని రామాలయం చుట్టూ తిరగసాగాయి. అది చూసి శాస్త్రజ్ఞులు కూడా ముక్కున వేలేసుకొని రామ భక్తులైపోయారు.
మరోరోజు వేలకొద్దీ నాగుపాములు అయోధ్య చేరుకొని రామాలయం చుట్టూ తిరిగాయి. ఇందులో ఆదిశేషుడు, కాళీయుడు, వాసుకి, తక్షకుడు వంటివారు ఉండొచ్చని అప్పటిదాకా భక్తి అంటే తెలియనివారు కూడా పరమభక్తులై పోయారు. ఇక ఇంకో రోజు ఎలుగుబంట్ల గుంపు అయోధ్యకు చేరి గుడిచుట్టూ విన్యాసాలు చేశాయి. వీరంతా జాంబవంతుడి వంశస్థులని అక్కడి ప్రజలంతా అనుకుంటున్నారు.
ఇక అసలు మహిమ నిన్న జరిగింది. ఆలయ పనులు పూర్తిచేస్తున్న కూలీలు కొందరు రాత్రిళ్లు అక్కడే పండుకుంటున్నారు. సురేష్ అనే వ్యక్తికి గుడిముందు ఏదో చప్పుడు వినిపించి బయటికి వచ్చిచూసి అవాక్కయిపోయాడు. అక్కడ దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతూ పుష్పకవిమానం నిలబడి ఉంది. అది నెమలి ఆకారంలో ఉంది. దాని వెలుగులను చూడలేక, షాక్కు గురై అతను వెంటనే మూర్ఛపోయాడు. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఎవరైనా చూడవచ్చు. ఇవన్నీ నన్ను చాలా చిక్కుల్లో పడేశాయి. ఎందుకంటే ఓపిక లేక, అంతమంది జనాల్లోకి వెళ్తే ఇబ్బంది పడతానేమో అని నేను రాముడంటే ఎంత ఇష్టమున్నా, తర్వాత అయోధ్యకు వెళ్దామనుకున్నాను. తీరా ఈ సంఘటనలన్నీ వీడియోల్లో చూశాక 22వ తారీఖున తప్పక వెళ్దామనిపిస్తున్నది. ఎందుకంటే ఆ రోజు అంతగొప్పగా జరిగే రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు బ్రహ్మ, శివుడు, ఐరావతం ఎక్కి ఇంద్రుడు, సప్తరుషులు, ఇంకా అంగుష్ఠ మాతృలైన వాలఖిల్యులు, ఇతర రుషి సమూహం- అందరూ వస్తే, నేను వారి దర్శనం మిస్ అవుతాను కదా, అందుకని అష్టకష్టాలు పడైనా అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను. మీరూ ఆలోచించండి.
కొందరు ఈ దేవుళ్లున్నారని నమ్మేవారున్నారు. ఇంకొందరు కొట్టిపారేసేవారున్నారు. వీరేమో అంతా నాన్సెన్స్, మీరు మూర్ఖులు అంటున్నారు. నిజానికి ఏది నిజమో నాకు తెలియదు కానీ, ఒక విషయం మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆ దేవుళ్లంతా నిజంగా ఉన్నా, అయోధ్య రామయ్యను చూడాలనుకున్నా, అక్కడ ముందువరుసలో ఉండే, రాజకీయ నాయకులను, ముఖ్యంగా బ్రిజ్భూషణ్ లాంటి వారిని చూసి అసలు అక్కడికి వస్తారా అని! రోజూ నేరాలు చేసే ఈ తుచ్ఛ మానవులకు తానున్నానని నిరూపించుకోవడం దేవుడికి అవసరమా? మీరేమంటారు. జై శ్రీరాం!
కనకదుర్గ దంటు
89772 43484