Rahul Gandhi | ఉద్యమ సమయంలో ఒక సందర్భంలో తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ జయశంకర్ కాంగ్రెస్ నాయకుల గురించి ఒక మాట అన్నారు. ‘1969లో ఉద్యమం తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులను చూసి భయపడ్డ ఆంధ్రా నాయకులు వారి పద్ధతి మార్చేశారు. ఎన్నికలలో టిక్కెట్లు కాంగ్రెస్, టీడీపీలలో తెలంగాణలో ఎందుకూ పనికిరానివాళ్లను ఏరి మరీ ఇచ్చారు. తమ ఆలోచనలు లేకుండా ఎస్ బాస్ అనే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తయారయ్యారు. అందుకే ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా, తమకేమీ పట్టనట్టు తమ పార్టీ అధినాయకులకు అనుగుణంగా, ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు’.
ఈ మాటలు కాంగ్రెస్ నాయకులు గత 40 ఏండ్లుగా నిజం చేస్తున్నారు. ప్రజల ఆశలు పట్టించుకోకుండా, వారిని అణచివేసే పద్ధతులు చేయటమే కాకుండా, ఇతర విషయాల్లో కూడా తమ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు. నిన్న ములుగు సభలో ఇద్దరు ముఖ్య నాయకులు- ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీ- మాట్లాడవలసి ఉన్నప్పుడు, ఇద్దరికీ విషయాల గురించి ఒకేలా రాసి ఇచ్చారు. సరే, ఉత్తర భారతదేశ నాయకులకు దక్షిణాన ఉన్న రాష్ర్టాల గురించి, ఇక్కడి రాజకీయ, సామాజిక విషయాల గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండదు. ఈ రాష్ర్టాల నుంచి వచ్చే ఆదాయం, ఎన్నికలప్పుడు వీరి ఓట్లు మాత్రమే వారికి ముఖ్యం. అటువంటప్పుడు వారు ప్రసంగించాల్సి వచ్చినప్పుడు వారికి ఏ విషయాలు మాట్లాడాలో చెప్పే, లేక రాసేవారికి కొద్దిగా తెలివితేటలు ఉండాలి. అట్లాకాకుండా ఇద్దరూ ఒక్కటే మాట్లాడారు నిన్న ములుగు సభలో. అది రానురాను పేలవంగా అనిపించింది. ఇంక రాహుల్గాంధీ- ముప్ఫై ఏండ్ల శిక్షణ తర్వాతైనా రాజకీయాల గురించి ఆ మాత్రం మాట్లాడగలిగారని సంతోషమేసింది.
ఇక ప్రసంగం! చెల్లెలు లాగే రామప్ప గుడిని పొగిడారు. అజ్ఞానానికి బాధేసినా మన దేవాలయం కాబట్టి ఆనందమేసింది. ఈ ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. దేశంలో నెహ్రూ వారసుల కంటే దొరల లాగ బతుకుతున్న వాళ్లెవరైనా ఉన్నారా? ప్రియాంక అత్తగారి కుటుంబంతో సహా గన్మెన్లు ఉండగా ఇంకెవరు దొరలు? కాంగ్రెస్ పార్టీ దొరలు దేశం డబ్బు పోగేసుకుంటే, దొరల కుటుంబానికి చెందిన కేసీఆర్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతున్నారు. కొనుగోలు శక్తి పెంచుతున్నారు. నగరాలలో హైదరాబాద్ ప్రజల ఆదాయం మిగతా నగరాలలో ఉన్నవారి కంటే ఎక్కువ ఉంటే, రాష్ట్రంలో మిగతా రాష్ర్టాల కంటే ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉంది. ఇదీ నిజమైన మానవీయ దొర సాధించిన విజయం!
‘తెలంగాణ ఇస్తామన్న మాట నిలుపుకొని రాష్ట్రం ప్రసాదించాం’ అన్నారు. మాట ఇచ్చిందెప్పుడు? రాష్ట్రం వచ్చిందెప్పుడు? 4 దశాబ్దాలు ఉద్యమం నడిచిన తర్వాత ఒక్కమాట నిలుపుకోవటానికి దశాబ్దకాలం కావాలా? ఆ పదేండ్లలో తెలంగాణ అన్నిరంగాల్లోనూ, నీళ్లు నిధులు, నియామకాల్లోనూ ప్రాణనష్టం జరిగి ఎంత నరకం అనుభవించిందో ఈ కాంగ్రెస్ దొరకు తెలుసా? అదీ ప్రజల ఆకాంక్షలు తీర్చటానికి రాష్ట్రం ఇవ్వలేదు. 2014 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చారన్నది అందరికీ తెలుసు. 2004 నుంచీ రాష్ట్ర విభజనకు అడ్డం పొడుగు అడ్డుగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి పోయాక అయినా 2009లో మీరు రాష్ట్రం ఇచ్చినట్టయితే ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఉండేవారేమో! 2004లో 6 వారాలలో ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా, కనీసం ఆరేండ్లకైనా ఇచ్చారని మంచి మనసున్న తెలంగాణ ప్రజలు మీ పక్షాన ఉండేవారేమో! కానీ మీరు ఆ అభిమానం నిలబెట్టుకోలేదు. కేవలం రాజకీయ అవసరం నెత్తిమీద పడ్డాకే ఇచ్చారని ప్రజలు అర్థం చేసుకొని, మిమ్మల్ని విసర్జించారు. అదీ మీ పార్టీ ఘోర పరాజయానికి కారణం. రాష్ర్టాన్ని మీరివ్వలేదు, త్యాగాలు, బలిదానాలు చేసి ప్రజలు సాధించుకున్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాల బాధ, చీకటైనవారి ఇండ్లు ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతాయి.
రాష్ట్ర విభజన అయిన వెంటనే ఉద్యోగాల భర్తీ చెయ్యలేదన్నారు. కేంద్రం దానికి సహకరించిందా? కమిటీల మీద కమిటీలు వేసిన తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులను విభజించటానికి మనసొప్పలేదు మోదీకి. మరి ఉద్యోగాలెన్నో, ఎలా భర్తీ చేయాలో అప్పటిదాకా అధికారంలో ఉన్న తెలివైన కాంగ్రెస్ నాయకులూ సూచించలేదు! ఇదికాక ఆంధ్రలో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు దాష్టీకాల వల్ల కరెంటు కష్టాలు, అది చూపించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, విభజించని హైకోర్టు… ఇలా అన్నిరకాల సమస్యలు ధీరుడిలా ఎదుర్కొని పరిష్కరించిన దొర, మా నాయకుడు, అమిత ప్రజ్ఞావంతుడు ఈ విషయాలన్నీ మీ శిష్యులు మీకు చెప్పకపోయినా, ప్రజలకు తెలుసు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అన్నారు. ఆ ప్రాజెక్టు కట్టడానికే 80 వేల కోట్లయితే, అదనంగా ఎక్కడినుంచి తెచ్చారు కేసీఆర్ తన అవినీతి కోసం? చెప్పేవాడికి తెలివి లేకపోతే, ప్రజల ముందు ప్రసంగించేవాడైనా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి కదా? మీ రాష్ట్ర పార్టీ నాయకులు ఏది చెప్తే అది వల్లిస్తే పోయేది మీ పరువే కదా!
ధరణి పోర్టల్తో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని మీరు ఎత్తేస్తామంటే మీకు ఎన్ని ఓట్లు పడతాయో ఆలోచించుకోండి. మిమ్మల్ని, మీ పార్టీనే ఎత్తిపడేసే ప్రమాదం లేదా? ఇక డబుల్ బెడ్రూం ఇండ్లు. మీరు ఒక రాష్ర్టానికి వెళ్లినప్పుడు కనీసం ఆ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మీ పార్టీ వాళ్లను కాకుండా జర్నలిస్టులను అడిగితెలుసుకోండి. ఇక్కడ చాలామందికి ఇండ్లే కాదు, ఇంటి స్థలాలున్న వాళ్లకు గృహలక్ష్మి పథకం కింద తలకు 3 లక్షల రూపాయల గ్రాంట్లు కూడా ఇచ్చారు. కర్ణాటకలో మీ పథకం గృహలక్ష్మి చీకటిలోకి వెళ్లింది, కానీ, ఇక్కడ ఇంకా అమలవుతోంది.
అయిదు గ్యారెంటీల గురించి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మొదటిరోజే ప్రారంభించారన్నారు. నిజమే! యువనిధి తప్ప అన్నీ ప్రారంభించారు. ఒకటి, రెండోరోజు, ఇంకొకటి రెండో నెల, మిగతా రెండు ఈ నాలుగు నెలలోనూ ఆగిపోయాయి. మీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నేతలు మీకు చెప్పలేదా? వాళ్లు కూడా మా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లాంటి వారేనా?
ట్రైబల్ బిల్లు, ఇంకెన్నో బిల్లులు తెచ్చాం అన్నారు. 60 ఏండ్ల పాలనలో ఒక దేశంలో ఎన్ని బిల్లులు పెట్టవచ్చు, ఎంత మార్పు తేవచ్చు? మన దేశ చరిత్ర కాకపోయినా, కనీసం మలేషియా, సింగపూర్ దేశాల గురించి, ఆ నాయకుల గురించి తెలుసుకోండి. 30 ఏండ్లలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడేటట్టు చేశారు వారి దేశాలని. పైగా అక్కడ భారతదేశంలో లాగా సహజ వనరులూ లేవు! వెయ్యేండ్ల నుంచి నిర్వహించబడుతున్న మా సమ్మక్క, సారలమ్మ జాతర జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తామన్నారు. 1956లో తెలంగాణలో కలిసిన ఆంధ్రా వారు, వారి రాజకీయ నాయకులు ఇక్కడి శాసనసభ్యుల బలవంతం మీద 22 ఏండ్ల తర్వాత 1978లో దయతో ఆ ప్రదేశానికి బస్సులు వేశారు. అది మీ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే! మరి మాట ఇచ్చిన పదేండ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చినవారు, ఈ గుర్తింపు ఎన్నేండ్ల తర్వాత ఇస్తారో! మోదీ గారి మహిళా బిల్లు లాగే ఉంది ఇది! అయినా మా దొర ఆ జాతరను స్పెషల్ గ్రాంట్ ఇచ్చి రాష్ట్ర పరిధిలో గుర్తించి, అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.
2014 నుంచీ, మీ పథకాలు ప్రకటించినా అమలుకావు, అమలైనా త్వరగానే ఆగిపోతాయి. అంత శ్రమ పడకండి! బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఉన్నాయన్నారు. అంత సీనే ఉంటే మాకు ప్రాజెక్టులు, వాటికి గుర్తింపు, ఏదైనా మొదలుపెట్టడానికి అనుమతులు అమాంతంగా రావడం, లక్షల కోట్ల డబ్బు గుజరాత్ లాగ కేంద్రం నుంచి రావటం జరిగేది. విద్యాలయాలు ఎన్నో వచ్చేవి కదా! అంతమాత్రం తెలుసుకోలేరా మీరు? ఎంఐఎం కలిసి ఉంది అన్నారు. ఆ విషయం ఆనందంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే మా దొరకు మానవీయత తప్ప ఇంకే కొలమానమూ లేదు. మనుషులందరూ సమానం. మతం, జాతి, కులం లాంటి విభజనలు ఇక్కడ లేవు. నీతి, ధర్మం మాత్రమే పాటిస్తారు. ఇది మీ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా మీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదు, అర్థం కాదు. ఆయనకు కులం, డబ్బు ముఖ్యం. కాబట్టి ఈ సంస్కారమేమిటో ఇంకెవరినైనా అడిగి తెలుసుకోండి. మీకు తేలికగా అర్థమవుతుంది, మీ కుటుంబంలో ఆ సంస్కారం ఉంది గనుక.
అయితే చివరలో రాహుల్గాంధీ ఒక్క నిజం మాట్లాడారు. ఆయన చెప్పిన కారణమేదైనా కార్యం మాత్రం నిజం. కేసీఆర్ మీద ఐటీ, సీబీఐ, ఈడీకి సంబంధించిన ఒక్క కేసూ లేదు. ఆయన ఆదాయం వ్యవసాయం నుంచి వచ్చింది. అవినీతి, అక్రమాలు లేకపోతే సీబీఐ దగ్గరికి రాదు. మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిలాగా మనీ లాండరింగ్లో శిక్షణ తీసుకోలేదు. కనుక ఈడీ రాదు. ఎంత ద్వేషమున్నా మోదీ ఏం చేస్తాడాయనని? మిగతా రాష్ర్టాలలో మీ గెలుపు అక్కడ బీఆర్ఎస్ లాంటిది లేదు గనుక సాధ్యపడింది. బీహార్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కేరళలో సింగిల్ పార్టీగా గెలవండి, చూద్దాం!
ఇక ఇక్కడ మీ గాలివాటు పథకాలు మాకొద్దు. అంతకంటే మంచివి ఆరు కాదు, అరవై ఉన్నాయి ఇక్కడ. అందుకని, ఎక్కువ శ్రమపడి ప్రసంగాలు చేసేటప్పుడు, మీ రాష్ట్ర నాయకులను నమ్ముకొని అభాసుపాలవకండి. ఉత్తర భారతదేశంలో, ప్రాంతీయ పార్టీలు లేనిచోట మీ విశ్వరూపం చూపండి.
ఇంకొక చిన్న సలహా- మీ చెల్లికి కూడా చెప్పండి. మీరిద్దరూ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడితే బాగుండదు. ముప్ఫై ఏండ్లయినా మీరు ప్రధానమంత్రి కాలేదంటే కారణం, వారసత్వంతో రాజకీయ ప్రవేశం సులువవుతుంది. కానీ, రాజకీయ నిచ్చెన ఎక్కాలంటే ఇంకా చాలా లక్షణాలుండాలి. మా కేటీఆర్, హరీశ్రావులను గమనించండి.
-కనకదుర్గ దంటు
89772 43484