వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు.
ఉజ్వల పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారు, సాధారణ కనెక్షన్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ రావాలంటే
ఈ-కేవైసీ తప్పనిసరి. అయితే ఇది పూర్తి చేసేందుకు ఎటువంటి గడువు విధించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నియమ నిబంధనలు రూపొందించలేదు. ఎవరెవరు ఈ పథకానికి అర్హులు.. ఏ ప్రాతిపదికన అమలు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. కానీ, రూ.500కే గ్యాస్ రావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాలనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్నది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీలకు పెద్దఎత్తున తరలుతున్నారు. ఈ-కేవైసీలో భాగంగా కంటి స్కానింగ్ చేస్తుండగా.. దీనికి ఎక్కువ సమయం పడుతున్నది. ఒక్కొక్కరికి స్కానింగ్ చేసేందుకు 10 నుంచి 15 నిమిషాలు పడుతున్నది. దీంతో రోజంతా పనులు వదులుకొని గ్యాస్ ఏజెన్సీల వద్దనే వేచి ఉండాల్సి వస్తున్నది. రద్దీ దృష్ట్యా మీ సేవ కేంద్రాల్లోనూ ఈ- కేవైసీ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఈ-కేవైసీ పూర్తిచేసి ఏజెన్సీలు డబ్బులు తీసుకుంటున్నాయి. మీ సేవ కేంద్రాల్లోనూ ఈ విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. లేదంటే ఏజెన్సీలు తాత్కాలికంగా అదనపు సిబ్బందిని నియమించుకొని ప్రక్రియను వేగవంతం చేయాలి. తద్వారా సమయం ఆదా అవుతుంది. ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
– తలారి గణేష్