తెలంగాణలో బీజేపీ, టీడీపీ అనుకూల వర్గాలు ఏవో, ఎవరి బలం ఎంతో స్థూలంగా తెలిసిందే. జనసేన గురించి ఇంకా స్పష్టత రావలసి ఉన్నది. వారు లోగడ పోటీ చేసింది ఒంటరిగా అయినందున, ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి అంచనాలు అవసరం. ఇప్పటి పరిస్థితులు అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్లోనే కావచ్చు గాని ఆయన ఇప్పుడు అధికారానికి రావటం. తను, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమి కావటం. ఆ కూటమి కేంద్రంలో పాలిస్తుండటం.
(నిన్నటి వ్యాసం తరువాయి)
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతులలో పవన్ కల్యాణ్ ప్రోబింగ్ కూడా పని చేయగలదన్నది ఆయనను ప్రయోగించిన వారి అంచనా అయి ఉండాలి. పైగా ఆయన హైదరాబాద్కు పరిమితం గాక జిల్లాల్లోనూ పర్యటిస్తానంటున్నారు.
అందువల్ల ఈ ప్రోబింగ్ డ్రోన్ రాగల కాలంలో బీజేపీ, టీడీపీల పనుపున దాడుల డ్రోన్గా కూడా మారగల ప్రమాదం పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. మొదట చెప్పుకొన్నట్టు తెలంగాణలో ఎందుకూ కొరగాని ఆయన విషయం మాట్లాడటం ఎందుకని ఆశ్చర్యపోతూ విస్మరించటం ఎంతమాత్రం సరికాదు.
ప్రమాదాలను సకాలంలో గుర్తించి చిత్తు చేయక తెలంగాణ ఇప్పటికే అనేక నష్టాలను ఎదుర్కొన్నది. కనుక, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలని పెద్దలు చెప్పిన జాగ్రత్తలను గుర్తు చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే చిన్న ఎలుకలు చేసిన రంధ్రంలోంచి పెద్ద ఎలుకలు, వాటి వెనుక పాములు చొరబడగల ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని, పునర్ వైభవం తెస్తామని చంద్రబాబు కొంతకాలంగా అంటూనే ఉన్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ సవాల్ చేస్తూనే ఉన్నారు. వారికి ఇక్కడ ఏ విషయంలో ఏ ఇబ్బంది కలిగినా బీజేపీ నాయకులు మద్దతుగా నిలువటాన్ని చూస్తూనే ఉన్నాము. దీనంతటి ఉద్దేశమేమిటో తెలంగాణ ప్రజలకు ఎవరూ వివరించనక్కర లేకుండానే అర్థమవుతున్నది. కనుక ఎందుకూ కొరగాని మనిషి విషయం పట్టించుకోవటం ఎందుకనే అమాయకత్వాన్ని, ఉపేక్షాభావాన్ని, తెలంగాణ ప్రజల స్వభావంలో భాగమైన ఉదారతను వదలుకోవలసిన సమయం వచ్చింది. పైన అనుకున్నట్టు, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టకతప్పదు.
తెలంగాణకు సంబంధించి పవన్ కల్యాణ్ సహా ఎవరి ఏ రాజకీయమైనా సాధారణ రీతిలో చేసుకోవచ్చు. కానీ ఈ నేలను, ప్రజలను, వారి ఆకాంక్షలను కించపరచటమనే దుర్మార్గం వల్ల సమస్య వస్తున్నది. ఇక్కడి ప్రజలు ఎటువంటి పరిస్థితుల కారణంగా తమ సొంత రాష్ర్టాన్ని, స్వపరిపాలనను కోరుకున్నారు? ఆ పరిస్థితులన్నవి ఒక కోణం కాగా, ఈ సువిశాలమైన వైవిధ్య దేశంలో వేర్వేరు ప్రాంతాలు, జాతులకు ఫెడరలిస్టు హక్కులు అవసరమనే గుర్తింపు రాజ్యాంగ నిర్మాతలకు కలగటమన్నది రెండవ కోణం. ఆ మేరకు మొదటి భాషా రాష్ర్టాలు ఏర్పడ్డాయి. మునుముందు మరిన్ని ఏర్పడవచ్చు. ఇవి ప్రపంచ వ్యాప్త పరిణామాలు కూడా.
ఇటువంటి అవగాహనలు గాని, కనీస జ్ఞానం గాని లేని పవన్ కల్యాణ్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరలిజాలు దేశ ఐక్యతకు భంగకరమని, వేర్పాటువాదమని, విచ్ఛిన్నవాదమని, ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని ప్రేలాపనలు చేస్తున్నారు. విచిత్రమేమంటే స్వయంగా తన పార్టీ, తాను అధికారం కోసం చేతులు కలిపిన టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీలే. వారిద్దరి అసలు బాధ తెలంగాణ తమ దోపిడీ హస్తాలలో ఎల్లకాలం చిక్కుకుపోకుండా విముక్తి చెందిందన్నదే. ఇప్పుడు తనను తాను పాలించుకుంటూ తన భవిష్యత్తును తాను స్వతంత్రంగా తీర్చిదిద్దుకుంటున్నదనేదే. అటువంటి తెలంగాణను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రధానంగా బీజేపీ, చంద్రబాబు ఎత్తుగడలు వేస్తుండగా, పవన్ కల్యాణ్ ఏవో చిల్లర లాభాల కోసం వారికి ఏజెంటుగా ముందుకు వస్తున్నారు. అది గ్రహించి ఒక విషపు మొక్కను మొగ్గలోనే తుంచివేయక తప్పదని తెలంగాణ ప్రజలు గుర్తించాలి.
-టంకశాల అశోక్