అపర భగీరథుని దీక్ష ఫలించింది. ఎవ్వరు ఎన్నితీర్ల ఆటంకాలు కల్పించాలని చూసినా ఆయన సంకల్పం ముందు కుట్రదారులు తలవంచక తప్పలేదు. దాని ఫలితంగానే కేసీఆర్ నాయకత్వం మరో అడుగు ముందుకేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు రూపుమాపేందుకు మార్గం సులువైంది.మేడిగడ్డతో గోదావరి జలాలను ఒడిసిపట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న తీరు ఇప్పటికే ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఇక దక్షిణ తెలంగాణ జల ప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి
ఉమ్మడి ఏపీలోని అతిపెద్ద జిల్లాల్లో రెండోది పాలమూరు జిల్లా. అప్పట్లో 64 మండలాలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ కోసం ఐదు జిల్లాలుగా విభజించి, కొన్ని కొత్త మండలాలను ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంపూర్ణంగా నీటి వసతి రాబోతున్నది.
తొమ్మిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. కేసీఆర్ పట్టువదలకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. ఇకనుంచి కరువు జిల్లాలో సిరుల వాన కురవనున్నది. వలసజీవుల కష్టాలకు, కడగండ్లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన ప్రభుత్వం ఆ పరంపరలో మరో ముందడుగు వేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కేసీఆర్ నాయకత్వంలోని తొలి ప్రభుత్వం ప్రాజెక్టులకు రీ ఇంజినీరింగ్, రీ డిజైన్లు చేసింది. మన అవసరాలకనుగుణంగా వాటిని తీర్చిదిద్దింది. అందులో భాగంగా తీసుకువచ్చిందే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.
2018, మార్చి 16న పలు పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న 70 మంది పాత్రికేయులతో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాం. అప్పుటికే ఎల్లూరు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కొంతమేర జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న పనుల తీరు చూస్తే నిజంగానే నీళ్లు వస్తాయా? సకాలంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా? పర్యావరణ అనుమతి లభిస్తుందా? దేశమంతా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన పాలమూరు జిల్లా ప్రజలు మాత్రం గుక్కెడు నీటికి నోచుకోక పడుతున్న ఇబ్బందుల గురించి ఈ సందర్శన సందర్భంగా మేము మాట్లాడుకున్నాం. అప్పటి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక నాయకులు కూడా కొందరు మాతో కలిశారు. గుడిపల్లి రిజర్వాయర్కు అప్పటికి కొద్దిరోజుల ముందు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లను చూసి ఓ పాలమూరు బిడ్డగా నేను, నాతో పాటు ఇదే జిల్లాకు చెందిన మరికొంతమంది జర్నలిస్టులం నిజంగానే పులకించిపోయాం. ఇక పాలమూరు రంగారెడ్డి పథకం కింద కూడా నీళ్లు వస్తే ఈ ప్రాంతం ఎంత సస్యశ్యామలం అవుతుందోనని ఊహించుకొని ఆనందపడ్డాం. కల్వకుర్తి ద్వారా కొన్ని నీళ్లు రావడంతోనే అక్కడి ప్రజల జీవితాల్లో చాలా స్పష్టమైన మార్పు వచ్చింది.
ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 12 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరందుతుంది. అంతే కాదు, నిరంతరాయంగా తాగునీరు అందుతుంది. మన ప్రభుత్వం కాబట్టే ఈ ప్రాజెక్టును ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని అప్పుడు మా మధ్య జరిగిన చర్చ. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అతి సమీపంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేయ తలపెట్టినప్పటికీ పర్యావరణ అనుమతి పేరుతో కేంద్రం ఇంతకాలం ఎందుకు సాగదీసిందో నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్నే. మేము పర్యటనకు వెళ్లి వచ్చి కూడా దాదాపు ఐదేండ్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి ఎట్టకేలకు కేంద్రం దిగిరావడం, పర్యావరణ అనుమతి ఇవ్వడం నిజంగా శుభపరిణామం. ఈ ప్రాజెక్టుకు ఎన్ని ఆటంకాలు కల్పించారో జాప్యాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిపైన 40కి పైగా కేసులు వేశారు. కోర్టుల ద్వారా ప్రాజెక్టు పనులు అడ్డుకోవాలని చూశారు. ఇదంతా కరువు జిల్లా ప్రజలపై దాడిగానే అర్థం చేసుకోవాలి. తొమ్మిదేండ్లుగా ఏపీ ప్రభుత్వం ఏదో రూపంలో ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నది. కేంద్రం అసలు పట్టించుకోలేదు. రాజకీయం కోసం పార్టీలు ఏమైనా చేసుకోవచ్చు కానీ, లక్షలాది ప్రజలపై ప్రభావం చూపించే… ఏండ్ల తరబడి నీళ్ల కోసం నిరీక్షించి నీల్గిన ప్రజలపై పగ తీర్చుకోవడం సరికాదు.
అయినా వీటన్నింటినీ తట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం చాలా ధైర్యంగా ముందుకుసాగింది. ఉద్యమ సమయంలో ప్రజలకు హామీనిచ్చినట్టుగా నీళ్లను అందిస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా పాలమూరు జిల్లా జీవితం కొంత మారింది. కల్వకుర్తి లిఫ్ట్ నీళ్ల ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూలు, జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రజల జీవితాల్లో కొంత మార్పు వచ్చింది. భూగర్భ జలమట్టం పెరిగింది. బావుల్లో ఊట మొదలైంది. వాగుల్లో జలసిరి పొంగుతూనే ఉన్నది. ఈ కొద్ది మార్పు కారణంగానే బొంబాయికి పొద్దు, మాపు వలస కూలీలను మోసుకెళ్లే బస్సులు నిలిచిపోయాయి. పాలమూరు జిల్లా పల్లెల్లో దుఃఖాన్ని మోసుకెళ్లే వలస కూలీల సర్వీసులు కన్పించడం లేదు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కండ్లముందు కనిపిస్తున్న గుణాత్మక మార్పు. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయి. కేసులు లేకుంటే ఇప్పటికే ప్రాజెక్టుల నీళ్లు పాలమూరు జిల్లాలోని అన్ని పల్లెల పొలాలను ముద్దాడేవి.
కృష్ణా నదిలో 70 ఏండ్ల తర్వాత మనకు రావాల్సిన వాటాను పూర్తిస్థాయిలో వాడుకునే సువర్ణావకాశం ఈ ప్రభుత్వం కల్పించబోతున్నది. పట్టు వదలకుండా ప్రభుత్వం తన ప్రయత్నాలు చేసిన ఫలితంగానే కరువు జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. మేడిగడ్డ నుంచి నడిగడ్డ వరకు కోస్తా జిల్లాలను తలదన్నే రీతిలో తెలంగాణ రూపు రేఖలు మారబోతున్నాయి. కాకతీయుల తర్వాత సాగునీటి రంగంపైనా, సరికొత్త అభివృద్ధి నమునాపైనా ఆచరణాత్మక అడుగులు పడుతున్నవి ఇప్పుడే. ఉమ్మడి పాలమూరు పల్లెలు జలసిరులకు ఆటపట్టు కాబోతున్నాయి. స్వయం పాలన మార్పు అంటే ఇదే. స్వయంపాలనకు ట్రేడ్ మార్కూ ఇదే.
(వ్యాసకర్త: టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి)
-అస్కాని మారుతీ సాగర్ 90107 56666