ఆరున్నర దశాబ్ధాల అణచివేత మూలంగా తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడి, అసమానతలకు గురైన సంగతి తెలిసిందే. సమైక్య పాలనలో అంతులేని నిర్లక్ష్యం వల్ల అనేక మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు బడులకు, చదువులకు దూరమయ్యారు. ఫలితంగా విద్య విషయంలో బాగుపడ్డది కేవలం ఆంధ్రప్రాంతంవారే. వనరులే కాదు… తెలంగాణ సమాజానికి విజ్ఞానాన్ని పంచడంలో నాటి సమైక్య పాలకుల వివక్ష పెను శాపమై తీవ్రమైన నిరుద్యోగానికి దారి తీసింది.
ఇంటి పెద్ద దిక్కు ఉపాధి లేక ఊరిడిసి ఎడారి బాట పడితే బిడ్డలకు అన్నం మెతుకులు పెట్టలేని దుస్థితిలో నాడు సాంఘీక సంక్షేమ హాస్టళ్లు దిక్కయ్యాయి. నీళ్లచారు.. దొడ్డు బియ్యంతో బతుకులను వెళ్లదీశారు. కానీ స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమ రథసారధి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అనేక సంస్కరణలతో ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లికి భారమైన వారికి నాడు సాంఘిక సంక్షేమ హాస్టైళ్లెనా, వసతి గృహాలైనా అరకొర వసతులతో ఆశ్రయమిచ్చాయి. కానీ, నాణ్యమైన విద్య మాత్రం అందిన దాఖలాలు లేవు. ఒక్కో ఉపాధ్యాయుడు రెండు, మూడు సబ్జెక్టులు చెప్పడం వల్ల విద్య అంతంత మాత్రంగానే ఉండేది. నాటి తెలంగాణలో విద్య ప్రమాణాలు, వసతుల కల్పనలో సమైక్య పాలకుల వివక్ష వల్ల అనేక మంది డిగ్రీ పట్టాలు పొందినప్పటికీ ఉపాధి అవకాశాలు మాత్రం పొందలేకపోయారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రతి శాఖపై పటిష్ఠమైన ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. తొలి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే గురుకులాలను కార్పొరేట్ స్థాయికి పెంచారు. మౌలిక వసతులు, విద్యాబోధన, శాస్త్రీయ విద్యా విధానంతో గురుకులాలు ఆదర్శంగా నిలిచాయి. కేవలం వంద లోపు ఉన్న గురుకుల పాఠశాలలు నేడు సుమారు 600కు చేరాయి. గురుకులాల ద్వారా ఆంగ్ల మాద్యమం విద్యనందిస్తూ గురుకులాల ప్రాధాన్యతను పెంచారు. కార్పొరేట్కు దీటుగా గురుకులాలు పని చేయడంతో ప్రవేశాలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా గురుకులాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రపంచ స్థాయిలో తెలంగాణ గడ్డ ఖ్యాతిని, గౌరవాన్ని చాటుతున్నారు.
పాఠశాల అభివృద్ధి అంటే కేవలం పాత గోడలకు కొత్త రంగులు పూసినట్లు కాకుండా… క్షేత్రస్థాయి నుంచి గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ శ్రమిస్తున్నారు. అందులో భాగంగా దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న చందంగా పల్లెల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి పారిశుద్ధ్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఇలా గ్రామ స్థాయి నుంచి పటిష్ఠమైన చర్యలు చేపట్టి తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఉద్యమ నాయకునిగా ప్రతి సామాజిక వర్గానికి చెందిన సమస్యలు చూసి, గ్రామీణ నేపథ్యం కలిగిన సీఎం కేసీఆర్ పరిపాలనలో పల్లెలు పచ్చదనంతో ఆహ్లదకరంగా మారుతున్నాయి. పల్లెల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విధంగా పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేసి…అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
పోటీ ప్రపంచంలో కార్పొరేట్ ఆంగ్ల విద్య పేద, బడుగు, బలహీన వర్గాలకు అందని ద్రాక్షలా మారింది. ఫలితంగా సంపన్న వర్గం, ఉద్యోగ వర్గం పిల్లలు కార్పొరేట్లో ఆంగ్ల చదువులు చదవడం వల్ల ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టిన
నూటికి నూరు శాతం పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేలా ఉంటాయి. అటువంటి అనేక పథకాలు తెలంగాణలో అమలవుతున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్యను ప్రవేశపెడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల దళిత, బడుగు బలహీన వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న ఆధునిక యుగంలో ఆంగ్లం రాక గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందని పరిస్థితి. అటువంటి ఆధునాతన టెక్నాలజీతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా .. కార్పొరేట్ శక్తులను ఢీకొట్టేలా మన ఊరి బడుల్లోనే ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టడం గొప్ప శుభపరిణామం.
నేడు గ్రామీణ స్థాయి నుంచే ఆంగ్ల బోధన వల్ల మారుతున్న డిజిటల్ ప్రపంచీకరణలో విద్యార్థులు ఎక్కడైనా …ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని సర్కా రు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించడం … ప్రభుత్వ బడులను బలోపేతం చేసే చర్యల వల్ల గ్రామీణ విద్యార్థి కార్పొరేట్లో సత్తా చాటే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్య మ నాయకుడు, సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కచ్చితంగా అమలు చేసి చూపడంలోనూ అంతే కఠినంగా ఉంటారు. ఇప్పటికే కండ్ల ముందు కనిపిస్తున్న అనేక పథకాలు అందుకు సాక్ష్యం. ఆంగ్లవిద్య అమలుకు తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తు విద్యార్థి తరాలు కార్పొరేట్ స్థాయిలో సత్తా చాటడమే కాకుండా తెలంగాణను ప్రపంచ దేశాల సరసన నిలుపుతారనటంలో ఎటువంటి సందేహం లేదు. మన ఊరు మన బడి పథకం చరిత్రలో నిలవడం ఖాయం.
(వ్యాసకర్త : బీఆర్ఎస్వీ, దళిత విద్యార్థి నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516