తెలుగు మన మాతృ భాష. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నది. కొన్ని కేంద్ర విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు తెలుగు చదవకుండానే పదో తరగతి పూర్తి చేసుకుంటున్నారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ ఇరు రాష్ర్టాలు ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ, అది అమలుకు నోచుకోవడం లేదు. మృత భాషల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మాతృభాష చేరబోతున్నట్టు ఐరాస హెచ్చరించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాల ప్రజలకు తమ మాతృభాషపై ఎక్కువ అభిమానం ఉంటుంది. వారు ప్రతి ఒక్కరితో మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ, మన దగ్గర అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది. ‘ఇద్దరు తెలుగువారు కలిస్తే తెలుగు తప్ప అన్ని భాషలు మాట్లాడుతారు’ అనే అపవాదు ఉన్నది. రష్యా, చైనా, జపాన్ తదితర దేశాలతో పాటు పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో మాతృభాషను నేర్చుకున్నవారికే ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు భాష కళతప్పుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషాభివృద్ధికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నడుం బిగించింది. ఏండ్లుగా ఆ దిశగా ఓయూ కృషి చేస్తున్నది. అందులో భాగంగానే తెలుగు సాహిత్య మహాసభ- 2024 పేరిట ఈ నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్యులు, ఉపన్యాసకులు, కళాశాలల్లోని బోధనా ఉపన్యాసకులు, పాఠశాలల్లోని తెలుగు పండితులు, తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్న కవులు, కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. చర్చలు, సమావేశాలు, పత్ర సమర్పణలు, కవి సమ్మేళనాలు నిర్వహించి తెలుగు భాషకు, తెలుగు పరిశోధనకు ఒక చక్కని దశను నిర్మించనున్నారు. ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రారంభమై వందేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న తెలుగు సాహిత్య మహాసభలకు ఎంతో ప్రాధాన్యమున్నది. పరిశోధన రంగంలో ఓయూ తెలుగు శాఖ అద్భుతంగా రాణిస్తున్నది. ఓయూ ఆచార్యులు పరిశోధన రంగంలో ప్రతిభను చూపుతూ దేశ, విదేశాల్లో పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు.
తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, సంఘాలు, విశ్వవిద్యాలయాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే తెలుగు సాహిత్య మహాసభల ప్రధాన ఉద్దేశం. తద్వారా తెలుగు పరిశోధనకు ఒక దశను నిర్దేశించాలన్నదే మహాసభ లక్ష్యం.
మనదేశంలోని 25 విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 150 మంది తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రొఫెసర్లు తెలుగు సాహిత్యంలోని కవిత, కథ, గేయం, పాట, పరిశోధన, విమర్శ, నవల, జానపద సాహిత్యం మొదలైన అనేక అంశాలపై పత్ర సమర్పణ చేస్తారు. ఆర్ట్స్ కళాశాల వేదికగా జరిగే ఈ మహాసభకు తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ సి.కాశీం కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రొఫెసర్లు ఎన్.గోపి, ఆర్.లింబాద్రి, డి.రవీందర్, తంగెడ కిషన్రావు తదితరులు పాల్గొంటున్నారు.
తెలుగు భాషలో చదివితే ఉద్యోగాలు రావనే భ్రమ ప్రజల్లో ఉన్నది. ఆ భ్రమ నుంచి ప్రజలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఆంగ్ల భాషపై అభిమానం ఉంటే తప్పు లేదు. కానీ, మాతృభాషపై మమకారం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలుగు భాషపై పట్టున్న వారు మీడియాలో రాణిస్తున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు పొందుతున్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి పోటీ పరీక్షల్లో గ్రేస్ మార్కులు కలపాలి. పేదలు లక్షలు పెట్టి ఆంగ్ల మాధ్యమంలో చదవలేరు, కాబట్టి వారికి జీవనోపాధి కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతూ ‘జీవనోపాధి భాష- తెలుగు’ అనే అంశంపై విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి.
అదే సమయంలో తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యక్షంగా కృషి చేస్తున్న భాషోపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పని చేస్తున్న భాషోపాధ్యాయులకు పదోన్నతులు లభించడం లేదు. తెలుగు భాషోపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరి భాషోపాధ్యాయులుగానే చాలామంది పదవీ విరమణ చేయాల్సి వస్తున్నది. ఇతర ఏ శాఖలోనూ ఈ పరిస్థితి లేదు. నూతనంగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు విద్యా శాఖను ఏ మంత్రికీ కేటాయించలేదు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతినిధులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులతో త్వరలో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనతో సమావేశం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. మార్చి నుంచి పదవీ విరమణలు ప్రారంభమవుతాయి. కాబట్టి సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలి. ఈ మేరకు ఓయూ తెలుగు సాహిత్య మహాసభ కూడా తీర్మానం చేయాలి. తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్న భాషోపాధ్యాయులకు తెలుగు సాహిత్య మహాసభ కూడా తోడ్పాటు అందిస్తుందనే ఆశిస్తున్నాం.
-డాక్టర్ ఎస్.విజయ భాస్కర్
92908 26988