తెలంగాణను 60 ఏండ్ల పాటు అధోగతి పాలు చేసినవాళ్లు, పదేండ్లుగా పగ సాధిస్తున్నవాళ్లు చీకట్లో చేతులు కలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనేందుకు కుట్రవాదులంతా మూకుమ్మడిగా తెలంగాణపై దండయాత్ర మొదలుపెట్టారు. మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను ఏమార్చటంలో సాటిలేని కాంగ్రెస్, బీజేపీకి ఇప్పుడు ఉమ్మడి లక్ష్యం ముఖ్యమంత్రి కేసీఆరే. అందుకే మిడతల దండులా దేశం నలుమూలల నుంచి ఆ రెండు పార్టీల నేతలు తెలంగాణ గల్లీగల్లీకి వచ్చి పడుతున్నారు.
సవ్యసాచిలా రెండు జాతీయ పార్టీలను నిలువరిస్తున్న కేసీఆర్ను ఎలాగైనా దెబ్బతీయాలని కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యర్థి ఒక్కరే. ఆయనే కేసీఆర్. అందుకే ఆయనను తెలంగాణలోనే కట్టడి చేసేందుకు ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ముందు గంభీరమైన ఓ ప్రశ్న నిలిచి ఉన్నది. స్వయంపాలన వైపు తలెత్తుకొని ఉండటమా? మళ్లీ ఢిల్లీకి గులాములుగా మారిపోవటమా?
ఒక్కడే వటవృక్షమై..: తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ బయల్దేరినప్పుడు ఆయన ఒక్కడే. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా లెక్కచేయకుండా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ముందుకుసాగారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేశారు. సాధించుకున్న రాష్ట్రం సగర్వంగా తలెత్తుకొని నిలబడాలన్నా, సురక్షితంగా మనుగడ సాగించాలన్నా కేసీఆర్తోనే సాధ్యమని నమ్మిన ప్రజలు 2014లో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారు.
అయినా ఆగని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వంటి కుట్రలకు పాల్పడ్డాయి. వాటిని ఓ కంట కనిపెడుతూనే ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తన దక్షతను చాటుకున్నారు. కొత్త రాష్ట్రం కేసీఆర్ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని ప్రజల్లో ప్రబలమైన నమ్మకం పాదుకొన్నది. తెలంగాణ ఏ రంగాల్లో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైందో లోతుగా అధ్యయనం చేసి ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. వారి నమ్మకానికి సాక్షిగా ప్రజలు రెండోసారి బీఆర్ఎస్కు మరింత మెజారిటీతో బ్రహ్మరథం పట్టారు.
గత తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లో తాము కేసీఆర్ వెంటే ఉన్నామని ప్రజలు నిరూపిస్తూ వచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు ఇప్పటికీ కోరుకుంటున్నారు. దీంతో కేసీఆర్ మూడోసారి కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. దశాబ్దకాలంగా తెలంగాణలో తమకు తావులేకుండా చేసిన సీఎం కేసీఆర్ అంటే కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ కంటగింపుగా మారింది. ఈ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ వాటికి కేసీఆరే లక్ష్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ఇప్పుడు ఏ గట్టున నిలబడుతుందనే ప్రశ్న తలెత్తింది. ఢిల్లీకి గులాంగిరీ చేసే కాంగ్రెస్, బీజేపీ గట్టున ఉందామా? లేక కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న తెలంగాణ స్వీయ పాలన గట్టున ఉందామా? అది తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఇది.
ఏకమైన జాతీయ పార్టీలు: సీఎం కేసీఆర్ దశాబ్దకాలంగా కాంగ్రెస్, బీజేపీకి కొరకరాని కొయ్యగా తయ్యారయ్యారు. కేసీఆర్ మూడోసారి గెలిచి అధికారంలోకి వస్తే లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారన్న భయం ఈ పార్టీలకు పట్టుకున్నది. అందుకే కేసీఆర్ను ఈసారి ఎలాగైనా ఓడించి కట్టడి చేయడానికి ఆ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ పార్టీలు వేర్వేరుగా కూటములు కట్టినప్పటికీ, కేసీఆర్ను ఎదుర్కోవడంలో మాత్రం ఏకాభిప్రాయంతో ముందుకుసాగుతున్నాయి. అందుకే బీజేపీకి ‘బీ’ టీం అని కాంగ్రెస్, కాంగ్రెస్కు ‘బీ’ టీం అని బీజేపీ బద్నాం చేస్తున్నాయి.
బీజేపీ మరో అడుగుముందుకేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఉదంతంలో ప్రజాక్షేత్రంలో బీజేపీని దోషిగా కేసీఆర్ నిలబెట్టడంతో అప్పటి నుంచి కేంద్రం మరింత కక్ష పెంచుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలువాలన్న పట్టుదల కంటే, కేసీఆర్ను ఓడించాలన్న లక్ష్యంతోనే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఏడాది కాలంగా తెలంగాణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ అయితే గుజరాత్ ఎన్నికలను కూడా లైట్ తీసుకొని తెలంగాణపై ఫోకస్ పెట్టింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ గత ఆరు నెలలుగా తెలంగాణ చుట్టే తిరుగుతున్నారు.
కేసీఆర్ను ఎదుర్కోవడానికి పార్టీతో సంబంధం లేకపోయినా డబ్బులు ఖర్చుపెట్టే వారికే టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దించింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అధికారంలోకి రావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ఆ పార్టీ అధిష్ఠానం కర్ణాటక ప్రభుత్వ అధినేతల భుజాన మోపింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఆ బాధ్యతలను అప్పగించింది. దీంతో కర్ణాటకలో మంత్రులు, కాంట్రాక్టర్లు, రెవెన్యూ రాబడి అధికంగా ఉండే అధికారులకు ఆయన లక్ష్యం పెట్టి నిధులు సమీకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా సమీకరించిన డబ్బే రూ.100 కోట్లు నెల రోజుల కిందట బెంగళూరులో ఐటీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
ఒక్కటైన వ్యతిరేక శక్తులు: జాతీయపార్టీల కుట్రలు ఢిల్లీలో కొనసాగుతుండగా, హైదరాబాద్లో మరో రకమైన కుట్రలకు అంకురార్పణ జరిగి.. అమలు కూడా మొదలైంది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక గత రెండు పర్యాయాలు చతికిలపడిన తెలంగాణ వ్యతిరేకశక్తులు, తమ బుద్ధి మార్చుకోకుండా మూడోసారి కూడా కుట్రలకు తెరలేపాయి. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని ప్రశ్నించిన వైఎస్ కూతురు షర్మిల, తాను తెలంగాణ బిడ్డనేనంటూ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉన్నట్టుండి రోడ్లపైకి వచ్చారు. అయితే, ఆమె సొంత పార్టీ పెట్టి కాలికి బలపం కట్టుకొని తిరిగినా తెలంగాణ సమాజం కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆమె కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రత్యేకంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)ను ఏర్పాటుచేశారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడానికి తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి కూడా వెనుకాడలేదు. ఈ కపట బుద్ధిని గుర్తించిన ప్రజలు ఆయన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు. దీంతో కేసీఆర్ను ఓడించేందుకు ఈసారి పోటీకి దిగకుండా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునుంచి ఎనిమిదేండ్లు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు.
ఆయన కూడా కేసీఆర్ను ఓడించడం ఒక్కటే తన లక్ష్యంగా ప్రకటించారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సీఎం కేసీఆర్పై బురద జల్లడమే పనిగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రియ శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా విదేశాలకు పారిపోయిన కిషన్రెడ్డి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు.
ఒక ప్రాంతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంతటి ఆదరణ లభించడం బీజేపీకి మింగుడుపడని అంశం. అందుకే తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిని ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలని శాసనసభలో తీర్మానం చేసి పంపినా పక్కన పడేసింది. రాష్ట్రంలో ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బండి సంజయ్కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టి ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు అప్పగించింది. పార్టీలకతీతంగా తెలంగాణ వ్యతిరేకశక్తులు ఏకమై కేసీఆర్ను ఓడించే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. రేవంత్రెడ్డి, కోదండరాం, కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పవన్కల్యాణ్, విజయశాంతి, షర్మిల, కేఏ పాల్ తదితరులంతా పరస్పర అవగాహనతోనే ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారు.
కాంగ్రెస్కు కక్ష ఎందుకు?: కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరిట జతకట్టాయి. దీనికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ కూటమి కట్టడానికి ముందే కేంద్రంలో బీజేపీ సర్కార్ వైఫల్యాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎండగడుతూ వచ్చారు. ప్రధాని మోదీ హయాంలో దేశం ఏ విధంగా అధోగతి పాలైందో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఒక దశలో బీజేపీని ఎండగట్టడంలో కేసీఆర్కు మించిన నాయకుడు లేడన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోకి కేసీఆర్ను చేర్చుకుంటే బీజేపీ పట్ల మెతక వైఖరితో ఉన్న కాంగ్రెస్ పప్పులుడకవని భయపడింది. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీతో పోరాడుతున్న కేసీఆర్ పట్ల ఈ కూటమిలోని కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. ఇది కూడా కాంగ్రెస్కు మింగుడుపడని అంశం. పైగా ఈ కూటమి ఏర్పడకముందే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించారు. దీంతో జాతీయస్థాయిలో ప్రతిపక్ష కూటమికి పెద్దన్న పాత్ర పోషించే తమకు భవిష్యత్తులో కేసీఆర్ ప్రతిబంధకంగా మారుతారని కాంగ్రెస్ భయపడింది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమిలోకి కేసీఆర్ను ఆహ్వానిస్తే మేము రాబోమని తేల్చిచెప్పినట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా వెల్లడించారు.
బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్ కంటే ముందున్న కేసీఆర్ లేకుండా ఏర్పడే కూటమికి అర్థం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వంటి ముఖ్యులు బాహాటంగానే ప్రకటించారు. ఉత్తర, దక్షిణాదిలో ఎక్కడా బలంగా లేని కాంగ్రెస్కు ఇటీవల కర్ణాటకలో అధికారం దక్కడంతో ఆశలు చిగురించాయి. తమిళనాడులో ఎలాగూ తమ మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉన్నది. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం కూడా ఇండియా కూటమిలో ఉన్నది. ఇక లేనిదల్లా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. అందుకే ఎలాగైనా తెలంగాణలో పాగా వేయలన్నది కాంగ్రెస్ లక్ష్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోనూ గెలిస్తే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉన్నట్టు సంకేతాలు పంపవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం.
తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికలకు ఇక్కడినుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించవచ్చన్నది ఆ పార్టీ మరో ఆలోచనగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీకి సూట్కేసులు తరలించడమే ప్రభుత్వ అధినేతల పనిగా సాగింది. ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం బంగారు గుడ్లు పెట్టే బాతుగా భావిస్తున్నది.
బీజేపీకి టార్గెట్ ఎందుకు?: తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకొని జాతీయపార్టీగా అవతరించింది. ఇక్కడ పదేండ్ల పాలనలో దేశానికే రోల్ మాడల్గా మారింది. కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ర్టాలు పేర్లు మార్చి అమలుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేనన్ని అవార్డులను ప్రకటించి ప్రశంసించింది. కేంద్రం కూడా తెలంగాణ పథకాలను కాపీ కొట్టింది.
ఒక ప్రాంతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంతటి ఆదరణ లభించడం బీజేపీకి మింగుడుపడని అంశం. అందుకే తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిని ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలని శాసనసభలో తీర్మానం చేసి పంపినా పక్కన పడేసింది. రాష్ట్రంలో ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టింది. ఇక లాభం లేదనుకొని కాళేశ్వరం ప్రాజెక్టును సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకున్నది.
ఇది కేంద్రానికి మరింత కంటగింపుగా మారడంతో ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ గల్లీ లీడర్ల వరకు పెద్ద ఎత్తున బురద జల్లడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ను కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చి ఉత్తరాదిపై దృష్టి సారించటంతో మహారాష్ట్రలో కేసీఆర్కు మంచి ఆదరణ లభించింది. ఇది బీజేపీకి మింగుడుపడటం లేదు. కేసీఆర్ ఉత్తరాది రాజకీయాల్లోకి వస్తే తమకు ఇబ్బందికరమని భయపడింది.
ఈ క్రమంలో కేసీఆర్ను లక్ష్యంగా చేస్తూ గతేడాది జూలైలో బీజేపీ హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. ప్రధాని మోదీ తన కేంద్ర మంత్రివర్గంతోపాటు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల సీఎంలు హైదరాబాద్లో బలప్రదర్శన చేసి వెళ్లారు. అయితే, ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీని సీఎం కేసీఆర్ రెడ్హ్యాడెండ్గా పట్టుకోవటంతో ఆత్మరక్షణలో పడిన ఆ పార్టీ, కేసీఆర్ను ఏమీ చేయలేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట కొత్త నాటకానికి తెరతీసి అందులో ఎమ్మెల్సీ కవితను ఇరికించింది.
వెల్జాల చంద్రశేఖర్
98499 98092