కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించి రెండు వారాలు దాటింది. భారీ ఖర్చు దృష్ట్యా దాని అమలు అసాధ్యమని భావించిన నిపుణులు, అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఈ పథకాలకు అయ్యే ఖర్చెంత? అనే లెక్కలు ప్రకటించాల్సిందిగా పదే పదే కోరారు. కానీ కాంగ్రెస్ నుంచి ఈ రోజు వరకు స్పందన లేదు. అమలు చేసి తీరుతామని మాటలు చెప్పడం తప్ప లెక్కలేవీ చెప్పనప్పుడు వారిని విశ్వసించటం ఎట్లా? అందుకే ప్రజల్లో మొదటనే తలెత్తిన అనుమానాలు క్రమంగా మరింత బలపడుతున్నాయి.
రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు కాగా, కొన్ని అంచనాల ప్రకారం కేవలం ఆరు గ్యారెంటీలకే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చవుతాయి. ఈ ఆరు కాకుండా కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 నాటి సభకు ముందే కొన్ని డిక్లరేషన్లు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్తున్నది. వీటన్నింటికి కలిపి దాదాపు రూ.5 లక్షల కోట్లు కావొచ్చు. కాదంటే కాంగ్రెస్ పార్టీ తన లెక్కలేమిటో చెప్పాలి. బాధ్యత గల ఏ పార్టీ అయినా చేయాల్సిందేమిటి? ఆరు గ్యారెంటీలకే రూ.2.9 లక్షల కోట్లవుతుందని, ఆ మొత్తం రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువని నిపుణులు అంచనా వేసినప్పుడు, గ్యారెంటీల అమలు సాధ్యం కాదని ప్రజల్లో అనుమానాలు కూడా మొదలైనప్పుడు వెంటనే జాగ్రత్తపడి తన లెక్కలేమిటో ప్రకటించాలి. ఆ పని చేయనట్లయితే అనుమానాలు బలపడి మొదటికే మోసం వస్తుందని గ్రహించాలి. హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు పోయాయని అర్థం చేసుకోవాలి.
కానీ, అధికారం కోసం పదేండ్లుగా మొహం వాచి ఉన్న కాంగ్రెస్ ఈ విచక్షణనంతా మరిచిపోయింది. తెలంగాణ ప్రజల దృష్టిలో విశ్వసనీయతను కోల్పోయినందువల్లనే వరుసగా రెండుసార్లు చిత్తుగా ఓడామని, ఆ విశ్వసనీయతను తిరిగి కొంతైనా సంపాదించుకొంటే మరొక నాలుగు సీట్లయినా వస్తాయని అర్థం చేసుకోకుండా, అమలుకు సాధ్యం కాని హామీలను వినేందుకే కండ్లు తిరిగిపోయేటట్టు ఇస్తున్నది. ప్రజలకు పరిస్థితి అర్థమవుతున్నందున, ఈ తరహా హామీలతో వారిలో విశ్వసనీయత కోల్పోయినప్పుడు, సీట్లు పెరగడం మాట అటుంచి పరిస్థితి ఎదురు తిరగగలదు. ఈ విషయమై ప్రశ్నలు నిరంతరం కావటంతో ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ నాయకుల నుంచి తాము హామీలను అమలు చేసి చూపగలమనే వాదనే తప్ప లెక్కలేవీ చెప్పలేకపోవడం ఒకటైతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు పరుస్తున్నామనే ప్రకటనలు రెండవది అవుతున్నది. కానీ వారి దురదృష్టవశాత్తు, తమ రాష్ర్టాల్లో అమలు చాలా లోపభూయిష్ఠంగా ఉందనే వివరాలు వెలికివస్తున్నాయి. కొన్ని అసలు అమలు కావడం లేదు. ఇది కూడా నరేంద్ర మోదీ హోరెత్తించిన ‘గుజరాత్ మాడల్’ వంటిదేనని ప్రజలకు క్రమంగా తెలియవస్తున్నది. వారి తాజా ‘మాడల్’ అయిన కర్ణాటకలో అప్పుడే కరెంట్ కోతలు, రైతుల ఆందోళనలు, పారిశ్రామిక రంగంలో బంద్లు, అనునిత్యం అవినీతి ఆరోపణలు, బియ్యం కొరతల వంటివి సర్వసాధారణంగా మారుతున్నాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నోరు మెదపడం లేదు.
దీనంతటికీ భిన్నంగా తెలంగాణలో పరిపాలన ఏవిధంగా ఉందో, దాని సానుకూల ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో, ఆ దృష్ట్యా తమ విజయావకాశాలు ఏమిటో, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు తెలియదో లేక తెలిసినా దాచిపెడుతున్నారో గాని, స్వయంగా రాహుల్ గాంధీకి మాత్రం సరైన అంచనాలే ఉన్నట్టున్నాయి. గత నెల 24న ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో తప్పక(సర్టెయిన్లీ) గెలుస్తామని, తెలంగాణలో ‘బహుశా(ప్రాబబుల్)’ గెలవవచ్చని అన్నారు.
కాంగ్రెస్ అంటున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసి ఉంటే, రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం ఎంతమాత్రం లేకపోతే, అంతా అవినీతి-దోపిడీమయంగా మారి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లయితే, అదే విధంగా తమ గ్యారెంటీలపై అంతటి నమ్మకముంటే, తెలంగాణలోనూ ‘తప్పక(సర్టెయిన్లీ)’ గెలవగలమని రాహుల్ ధీమాగా ప్రకటించి ఉండాల్సింది. అంతకన్నా ముందు, తమ విమర్శల్లో నిజం ఉందని నమ్మినట్లయితే అసలు ఇటువంటి అలవికాని గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?
ఇవన్నీ చాలవన్నట్లు, ‘తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ’ అంటూ మరోమారు గుర్తు చేయటం ఎందుకు? ఈ మాటలు ఎంత గుర్తు చేసినా 2014, 2018లో ఫలితం లేకపోయింది గదా? ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎన్ని కపటపు వేషాలు వేసినా, స్వయంగా రాహుల్తో సహా ఢిల్లీలో ఎవరెంత వ్యతిరేకించినా, సోనియాగాంధీ తన నైతిక దృఢత్వం వల్ల ప్రత్యేక రాష్ర్టాన్ని అనుకూలించటం ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ మాటను కేసీర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడమేగాక, సకుటుంబంగా ఢిల్లీ వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరేమిటన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు గనుకనే తాము కూడా వ్యక్తిగతంగా సోనియాగాంధీ పట్ల కృతజ్ఞతగా ఉంటూనే, తెలంగాణకు 1956 నుంచి 2014 వరకు అడుగడుగునా ద్రోహం చేసిన ఇక్కడి కాంగ్రెస్వాదులకు మాత్రం రాజకీయంగా గుణపాఠం చెప్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించి కూడా తమ ద్రోహాలను సోనియా కొంగుచాటున కప్పిపుచ్చుకొని, ఆమె పేరిట ప్రజలను ఏమార్చి అధికారం సంపాదించగలమని 2014, 2018 తర్వాత ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్ నేతలు భ్రమపడుతున్నారు లేదా ఆత్మవంచన చేసుకొంటున్నారు. ప్రజలకు ఇవన్నీ తెలుసు.
రానున్న ఎన్నికల్లో అన్నింటికన్నా పెద్ద ప్రశ్న విశ్వసనీయతది. గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోలు ఎవరేమి ప్రకటించినా, ప్రజలు దేని వెనక ఉన్నది ఎవరు? ఎవరి విశ్వసనీయత ఏమిటి? అనేది చూస్తారు. వారికి తమ అనుభవం, ఇంగితం చెప్పే విషయమది. ఆ విధంగా విచారించినప్పుడు ఒకవైపు కేసీఆర్కు, మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్వాదులకు తమ విశ్వసనీయతలు లేదా అవిశ్వసనీయతలు రెండు దశలుగా ఏర్పడుతూ వచ్చాయి. మొదటి దశ 2014కు ముందటిది కాగా, రెండవ దశ ఆ తర్వాతది. ముందుగా కాంగ్రెస్ను చూస్తే, తెలంగాణ విషయంలో1956 నుంచి 2014 వరకు వారి వైఖరులు, వ్యవహరణలు, ద్రోహాలు ఏమిటో మళ్లీ చెప్పనక్కరలేదు. అదే విధంగా 2014 నుంచి చూస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఇక్కడ, ఢిల్లీలో చేసిన ఘనమైన కృషి ఏమిటో ప్రజలకు తెలుసు. ఆ విధంగా ప్రజల దృష్టిలో వారి విశ్వసనీయతకు 2014 కన్నా ముందు దశలో పునాది పడలేదు. ఆ తర్వాతి దశలో నిర్మాణమూ జరగలేదు. కేసీఆర్కు సంబంధించి 2014 కన్నా ముందు బలమైన పునాది పడగా, ఆ తర్వాత ఆయన పరిపాలనను బట్టి అంతే బలమైన నిర్మాణం జరిగింది. ఇంకా జరుగుతున్నది. ఏదైనా ఒకసారి అన్నాడంటే చేస్తడు అనే పేరు కేసీఆర్కు వచ్చింది. ప్రజలకు ఇదంతా వందేండ్ల కిందటి చరిత్రేమీ కాదు. 1956 మొదలుకొని ఇప్పటివరకు ఇంకా జీవించి ఉన్న మూడు తరాలకు కూడా ఇదంతా జ్ఞాపకాల్లోని విషయమే. అందువల్ల వారికి ఎవరి విశ్వసనీయత ఏమిటో ఎవరూ చెప్పనక్కరలేదు. ఇటువంటి విశ్వసనీయతే అతి పెద్ద మేనిఫెస్టో అయినందునే గత రెండు ఎన్నికల ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి.
-టంకశాల అశోక్