BJP | రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు తీరాలకు చేరి ఆరు రోజులు గడిచాయి. ఆయా రాష్ర్టాలతో పాటు ఎన్నికలు జరిగిన తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే ప్రభుత్వాలు కొలువుదీరాయి. కానీ బీజేపీ చేజిక్కించుకున్న మూడు రాష్ర్టాల్లో ఇప్పటికీ సీఎం ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల్లో గెలిచినంత సులువుగా ముఖ్యమంత్రుల ఎంపిక ఉండదని తెలుసుకున్న బీజేపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ప్రధాని మోదీ,కేంద్ర హోం మంత్రి షా ద్వయం తలలు పట్టుకుంటున్నది.
మూడు రాష్ర్టాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో కేంద్ర నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. రానున్న నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాల సీఎం ఎంపిక కత్తి మీద సాములా మారింది. కుల, ప్రాంత, వర్గ సమీకరణాలను బేరీజు వేసి ఎంపిక చేయాల్సి ఉండటంతో కేంద్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. మరోవైపు ఎన్నికల వేళ మూడు రాష్ర్టాల్లోనూ సీఎం అభ్యర్థులను బీజేపీ ముందుగానే ప్రకటించలేదు. అన్నిచోట్ల ప్రధాని మోదీ అన్నీ తానై ప్రచారాన్ని నడిపించారు. దీంతో స్థానిక నాయకత్వంపై కొంతమేరకు ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత మరుగున పడిపోయింది. అయితే ప్రచారం చేసినంత మాత్రాన ప్రధాని మోదీ, అన్ని రాష్ర్టాల్లోనూ ముఖ్యమంత్రిగా పాలన చేయలేరు కదా. అందుకే ప్రస్తుతం సీఎంలను ఎంపిక చేయక తప్పని పరిస్థితి. మరోవైపు ఆయా రాష్ర్టాల్లో సీనియర్, జూనియర్ పంచాయితీ కూడా నడుస్తున్నది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇద్దరికీ మించి పోటీలో ఉండటం తలనొప్పిగా మారింది. అదే సమయంలో స్థానిక నాయకత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కొంతమంది కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా అసెంబ్లీ బరిలో నిలిచారు. వారిలో దాదాపు అందరూ విజయం సాధించారు. దీంతో ఆయా రాష్ర్టాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.
మరోవైపు స్థానిక నేతలు రాష్ర్టాలపై పట్టు నిలుపుకోకుండా మోదీ, షా ద్వయం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతున్నది. రాష్ర్టాలపై తమ పట్టు సడలకుండా వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో ఎవరో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటం వారికి ఇష్టం లేనట్టు తెలుస్తున్నది. కర్ణాటకలో వయోభారంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై అతిగా ఆధారపడిన బీజేపీ అక్కడ చతికిలపడింది. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించిన తర్వాత అక్కడ బీజేపీ కోలుకోలేకపోయింది. ఆర్నెళ్ల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ చావుదెబ్బతిన్నది. ఆరు నెలల వరకు అక్కడ వర్గపోరు కారణంగా ప్రతిపక్ష నేతను కూడా నియమించకపోవడం గమనార్హం. బీజేపీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్, మాజీ సీఎం యడియూరప్ప మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ ఆలస్యం జరిగింది. వారిని కాదని ప్రధాని మోదీ ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. అందుకే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజేలను ఓ ప్రణాళిక ప్రకారం తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఆయా రాష్ర్టాల్లో వారే ప్రధాన నేతలుగా ఎదిగితే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత ఓట్లను టార్గెట్ చేసిన బీజేపీ యువ నేతలను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నది! ఈ కారణంగానే ఆయా రాష్ర్టాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజేలను సీఎం అభ్యర్థులుగా ప్రకటించలేదని అంటున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సరైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర బీజేపీ నాయకత్వం పరిశీలకుల చేతిలో పెట్టింది. తాజాగా మూడు రాష్ర్టాలకు పరిశీలకులను నియమించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, వినోద్ తవాడే, సరోజ్ పాండే రాజస్థాన్కు, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, కె.లక్ష్మణ్, ఆశా లక్రా మధ్యప్రదేశ్కు, కేంద్ర మంత్రి అర్జున్ముండా, శర్బానంద్ సోనోవాల్, దుశ్యంత్ గౌతమ్ ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి పరిశీలకులుగా నియమితులయ్యారు.
వీరు ఆయా రాష్ర్టాల్లో ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఆయా రాష్ర్టాల్లో వివిధ సమీకరణాలపై చర్చిస్తున్న పరిశీలకులు కేంద్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆశావహులతో సమావేశమవుతున్నారు.
బీజేపీ అంటేనే కేంద్ర నాయకత్వం కనుసన్నల్లోనే ఎంపికలుంటాయని అందరికీ తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీ అధిష్ఠానం సైతం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నది. బీజేపీ అంటే క్రమశిక్షణ.. క్రమశిక్షణ అంటేనే బీజేపీ అని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కనిపించే వర్గ, ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు బీజేపీలోనూ ఇప్పుడు కనిపిస్తున్నాయి.
ఆ కారణంగానే సీఎంల ఎంపిక ఆలస్యమవుతున్నదనేది జగమెరిగిన సత్యం. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య సీఎం కుర్చీలాటను చూసి ఎద్దేవా చేసిన బీజేపీ ఇప్పుడు అదే కుర్చీలాటలో మునిగిపోయింది. రెండు, మూడు రోజుల పాటు ఉత్కంఠ రేపిన తెలంగాణ సీఎం ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. ‘ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకముందే తెలంగాణ సీఎం ఎవరంటూ మీడియా, ప్రతిపక్షాలు కాంగ్రెస్ను ఎద్దేవా చేశాయి. మేం సీఎంను ప్రకటించేశాం. మరి మీ సీఎంలు ఎక్కడ? ఎందుకు ఆలస్యమవుతున్నది?’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో బీజేపీని వెక్కిరించారు.
ఇక రాష్ర్టాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధర రాజే, ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్లు ఆయా రాష్ర్టాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు. అయితే వారు కూడా తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్తో పాటు ఎంపీ రేణుకాసింగ్ కూడా పోటీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఆమె తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశమవడం గమనార్హం. వీరిద్దరితో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ విష్ణుదేవ్ సాయి కూడా సీఎం రేసులో ఉండటం పోటీని మరింత రసవత్తరంగా మార్చింది.
మధ్యప్రదేశ్లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఆయన కూడా సహచరుల నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఆయన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక ఎంపీ స్థానమైన చింద్వాడాలో పర్యటించి లాడ్లీ యోజనపై ప్రచారం చేశారు. అయితే ఆయనకు పోటీగా ఉన్న మరో నేత విజయ్వర్గీయ శివరాజ్సింగ్పై పరోక్షంగా విమర్శలు చేశారు. లాడ్లీ యోజన పథకం వల్ల మధ్యప్రదేశ్లో విజయం దక్కలేదని.. ప్రధాని మోదీ చరిష్మా కారణంగానే మూడు రాష్ర్టాల్లోనూ గెలుపు తీరాలకు చేరామని చెబుతూ మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
రాజస్థాన్ విషయానికి వస్తే.. మాజీ సీఎం వసుంధర రాజే రిసార్టు రాజకీయాలకు తెరతీశారు. 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టిన ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం గమనార్హం. నడ్డాతో వసుంధర సమావేశాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి కొట్టిపడేశారు. ఆమె సమావేశం సాధారణమేనని అంటూ రాజే అభ్యర్థిత్వం ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు. ఈ రాష్ట్రంలోనూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాజస్థాన్ యోగిగా పేరొందిన బాబా బాలక్నాథ్, దియా కుమారి నుంచి రాజే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. అయితే రిసార్టు రాజకీయాలకు తెరలేపిన వసుంధర రాజే రేసులో కాస్త ముందున్నట్టు తెలుస్తున్నది.
ఊహకందని నిర్ణయాలు తీసుకునే మోదీ, షా ద్వయం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను సీఎం చేసినట్టుగానే అనూహ్యంగా కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
-ఎడిటోరియల్ డెస్క్