రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖాధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా మారింది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా ‘నిమిషం నిబంధన’ను ఇంటర్ అధికారులు అమలుచేయడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకవుతున్నది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో లోపాలను పరిష్కరించవలసిన అధికారులు, ప్రైవేటు సంస్థల దూకుడును అడ్డుకోవడంలో విఫలమయ్యారు. పాలకులు కూడా తాము సైతం ఏదో గొప్ప పని చేస్తున్నామనే అభిప్రాయం కలిగించడానికి ఈ నిబంధన విధిస్తున్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ పట్ల సమాజంలో విశ్వాసం కలిగించేలా వ్యవహరించాల్సిన వారే అందుకు భిన్నమైన వైఖరి అవలంబించడం నిజంగా సిగ్గుచేటు.
పరీక్షలు లక్ష్యాత్మక సోపానాలు. విద్యావ్యవస్థలో అంతర్భాగంగా గుర్తింపు పొందిన పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. విజ్ఞానాన్ని వెలికి తీయాల్సిన పరీక్షలు విద్యార్థుల ముందడుగుకు అడ్డు కాకూడదు. గతంలో లేనంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల బోధన, అభ్యసన ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవాలి. అభ్యసన సులభ సాధ్యం కావాలి.
కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు విద్యావ్యవస్థకు నూతనోత్తేజం కలిగించాలి. కానీ, ప్రస్తుతం ఇంటర్ విద్యావ్యవస్థలో కనీస వసతుల లోటు, సామర్థ్యం పటిమ నిండిన బోధకుల కొరత, యాంత్రికమైన బోధనా విధానాలు మొత్తం వ్యవస్థను నీరుగారుస్తున్నాయి. ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి అధికారులు పరీక్షల కాలంలో విద్యార్థులను అనుక్షణం భయభ్రాంతులకు గురిచేసే ‘నిమిషం నిబంధన’ రుద్దుతున్నారు. ఇదే విషయాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చామని గర్వపడుతున్నారు. ఈ నిబంధన కారణంగా పలువురు విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్న వాస్తవాన్ని వారు ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,521 పరీక్ష కేంద్రాల్లో 9,80,978 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నేటినుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్చి 19న పూర్తవుతాయి. గత ఇంటర్ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో 10 మంది విద్యార్థులు, వేములవాడలో 2 విద్యార్థులు నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమయ్యారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం నగరానికి పరీక్ష రాయడానికి వచ్చిన భూక్య దేవి అనే విద్యార్థినికి సమయానికి బస్సు దొరుకక 10 నిమిషాలు ఆలస్యంతో ఇంటర్ పరీక్ష రాయలేక పోయింది.
ఈ విధంగా ‘నిమిషం నిబంధన’ చాలామంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నది. పరీక్షలకు ఎంత ముందుగా బయల్దేరినా కొత్త చోటు, దూరం, రవాణా సౌకర్యాల కొరత వంటి సమస్యలు విద్యార్థుల ఆలస్యానికి కారణమవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య, నడిరోడ్డు మీద ఊరేగింపులు, ధర్నాల వల్ల ఎదురయ్యే అవరోధాలు విద్యార్థులకు సవాళ్లు విసురుతున్నాయి. పరీక్ష హాల్టికెట్ పత్రాల్లో కేంద్రం పేరు ఒకదానికి బదులు మరొకటి ఉండటం, చేతితో రాసిన పరీక్షా పత్రాలు పెట్టడం వంటి తప్పిదాలు సరిచేసుకోవడానికి అధికారులు ప్రయత్నించాలి. కానీ, అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దు. కాబట్టి ఇంటర్ పరీక్షల విషయంలో భవిష్యత్తులో నిమిషం నిబంధనను బేషరతుగా ఎత్తివేయడం ఉత్తమం.
సభావట్ కళ్యాణ్
90143 22572