Climate crisis | భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ.. వరికి సమస్యలు అధికమవుతున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది ఆహార అవసరాలకు, జీవనోపాధికి ముప్పు ఎదురవుతున్నది. పంటకు నీళ్లు అవసరమైనప్పుడు వానలు పడటం లేదు. అవసరం లేనప్పుడేమో విపరీతంగా పడుతున్నాయి. సముద్రం నీరు చొచ్చుకొచ్చి పంటలను పాడు చేస్తున్నది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు ఎక్కువై దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యలన్నీ, వరి ఉత్పత్తికి కొత్త విధానాలను కనుగొనటానికి మానవాళిని ముందుకు నెడుతున్నాయి.
ధాన్యం ఉత్పత్తిలో కీలకమైన వర్షపాతాన్ని, సీజన్లను వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదు బియ్యం గింజల్లోని పోషకాలను తగ్గిస్తున్నది. వాతావరణంలోకి విడుదలయ్యే మీథేన్లో 8 శాతం వరి నుంచే వస్తున్నది.
వరి రైతులు పంట కాలాల్ని మార్చుకుంటున్నారు. వేడి వాతావరణాన్ని, ఉప్పు నేలల్ని కూడా తట్టుకునే విత్తనాల తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగు నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి రైతులు కావాలనే తమ పొలాలను తాత్కాలికంగా ఎండబెడుతున్నారు. ఇది ఒకందుకు మేలే చేస్తున్నది. గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఒకటైన మీథేన్ వరి పొలాల నుంచి వెలువడుతుంది. పంట లేనప్పుడు, మీథేన్ విడుదలా ఉండదు కాబట్టి, ఆ మేరకు గ్రీన్హౌస్ ఉద్గారాల్లో కొంత కోత పడినట్లే.
చైనాలో గత 20 ఏండ్లలో విపరీతమైన వర్షపాతం కారణంగా ధాన్యం దిగుబడి తగ్గింది. భారత్ సొంత వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని, బియ్యం ఎగుమతులను తగ్గించింది. పాకిస్థాన్లో పెరిగిన ఉష్ణోగ్రతలు, వరదలు పంటలను ధ్వంసం చేశాయి. ఈ విధంగా వాతావరణంలో తీవ్రమైన మార్పుల కారణంగా ధాన్యం ఉత్పత్తి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోనుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. వియత్నాం ధాన్యాగారంగా పేరుగాంచిన మెకాంగ్ డెల్టాలో రెండున్నర లక్షల ఎకరాలను వరి ఉత్పత్తి నుంచి తప్పిస్తున్నది ఆ దేశ ప్రభుత్వం.
వ్యవసాయరంగం 50 ఏండ్ల కిందట ఎదుర్కొన్న సవాళ్లకు నేటి సవాళ్లు భిన్నం. నాడు ఆకలిని, కరువును ఎదుర్కోవటానికి ధాన్యం ఉత్పత్తిని విపరీతంగా పెంచాల్సిన అవసరం ముందుకొచ్చింది. అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలు, రసాయన ఎరువులు ఆ అవసరాన్ని తీర్చాయి.
మెకాంగ్ డెల్టాలో ఏటా మూడు పంటలు పండించి స్వదేశీ అవసరాలనేగాక, విదేశీ అవసరాలను కూడా తీర్చారు వియత్నాం రైతులు. అయితే, ఈ విపరీత ఉత్పత్తే నేడు సమస్యలను సృష్టించింది. ఎరువుల వాడకం వల్ల పంటభూముల నాణ్యత తగ్గిపోయింది. బియ్యం రకాలలో వైవిధ్యం లేకుండా పోయింది. పంటకోతల అనంతరం మిగిలే వ్యర్థాల కాల్చివేతతో వాయుకాలుష్యం పెరిగింది. అన్నింటికీ మించి వాతావరణ మార్పులు మొదలయ్యాయి. ధాన్యం ఉత్పత్తిలో ఎంతో కీలకమైన వర్షపాతాన్ని, సీజన్లను, కాలాల్ని వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ మో తాదు బియ్యం గింజల్లోని పోషకాలను కూడా తగ్గించి వేస్తున్నది. వాతావరణంలోకి విడుదలయ్యే మీథేన్లో 8 శాతం వరి నుంచే వస్తున్నది.
బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల నుంచి కూడా మీథేన్ విడుదలవుతున్నప్పటికీ, వాటికి ప్రత్యామ్నాయాల (పర్యావరణ అనుకూల ఇంధనాల) కోసం ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తున్నది. కానీ, వరికి ప్రత్యామ్నాయం లేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఆహారం ఇదే. ఈ నేపథ్యంలోనే, వాతావరణ మార్పులను తట్టుకునే వరి వంగడాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. వేడి వాతావరణంలో పెరిగే వాటి కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అర్జీలియాలోని లారెన్స్ ల్యాబొరేటరీలో 310 రకాల ప్రాచీన, ఆధునిక వరి వంగడాలను సేకరించి, వాటిపై జన్యు పరిశోధనలు జరిపి కొత్తవాటి కోసం ప్రయోగాలు చేస్తున్నారు. బహుళజాతి విత్తన కంపెనీలు ఈ పరిశోధనలపై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికాలోని క్రిస్పర్ అనే జీన్ఎడిటింగ్ కంపెనీ.. మీథేన్ను ఉత్పత్తి చేయని వరి వంగడాల కోసం పరిశోధనలు నిర్వహిస్తున్నది. వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త విత్తనాలను బంగ్లాదేశ్ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. కొన్ని రోజులు నీటమునిగినా కూడా పండే సామర్థ్యం గలవి వీటిలో ఉన్నాయి. ఉప్పు నేలల్లో పండేవి కొన్ని ఉన్నాయి.
వరి నుంచి మీథేన్ ఉత్పత్తిని తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని ఆర్కాన్సస్లో కొందరు రైతులు తమ వరి పొలాలను కొంత సమయం పాటు ఎండబెడుతున్నారు. ఆ తర్వాత నీళ్లు తోలుతున్నారు. ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనివల్ల మీథేన్ ఉత్పత్తి 60 శాతానికి పైగా తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
జొన్నకంకిలో విత్తులలాగా వరి నాట్లను వరుసగా వేసి, వాటి మధ్య ఖాళీలను నీటి కోసం వదలటం వల్ల నీటి వినియోగమేగాక మీథేన్ విడుదల కూడా తగ్గుతున్నట్లు వెల్లడైంది. వరి ప్రాధాన్యాన్ని, అవసరాన్ని గుర్తిస్తూనే దాని నుంచి పర్యావరణానికి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకునే ధోరణులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులకు నిలిచే వరి వంగడాల తయారీపైనా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(‘ది ఎకనామిక్ టైమ్స్’ సౌజన్యంతో..)