ఎన్నడూ వల్లించని పేర్లతో పాలకులు ఇప్పుడు కొంగ జపం మొదలుపెట్టారు. గాలివాటం చూసి గింజలు తూర్పారబట్టినట్టు ఎన్నికల ముందు ఓట్లు రాల్చే పేర్లను తెరపైకి తెస్తున్నారు. అవార్డులు, గౌరవాలు ఇస్తున్నవారి అంతరంగం ఏమిటో తెలిసినా.. ఇదే మహాభాగ్యమన్నట్టు కొందరు మేధావులు సైతం పాలకుల నిర్ణయాలకు జేజేలు పలుకుతున్నారు. ఈ అవార్డులతో బడుగుల బతుకులే మారిపోయినట్టు ఆయా కవి గాయక అభిమానులు సంబురపడిపోతున్నారు. ప్రత్యేక గౌరవాన్ని అందుకుంటున్న వారి ఆశయాలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టకుండా, వారి పేరిట అవార్డులు, విగ్రహాలు, గీతాల గుర్తింపులు ఇస్తూ.. తమ రక్తపు మరకల చేతుల్ని కడిగేసుకోవాలని, ఆయా వర్గాలకు దగ్గరవ్వాలని ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
మహాత్మాగాంధీ బొమ్మను గోడకు తగిలించి రోజూ దండం ఎందుకు పెడుతున్నావు అని ప్రశ్నిస్తే.. ‘మహాత్మా నీ బాటలో నడవడం మా వల్ల కాదు, మన్నించమని కోరడం కోసం’ అని అన్నాడట ఓ ప్రబుద్ధుడు. ఇప్పటి ప్రభుత్వాలు గొప్పవారి పేర్లు తలుచుకుంటే అది నిజమేననిపిస్తుంది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కంటే.. గత ప్రభుత్వ నిర్ణయాలను ‘మార్పు’ చేయాలనే దానిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నది. అవసరం ఉన్నా, లేకున్నా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నది. వాహనాల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర సంకేతంగా టీఎస్ అని ఉంటే మునిగేదేమీ లేదు. టీజీ అని మార్చడం వల్ల ఒరిగే ప్రయోజనమూ లేదు. ఈ నిర్ణయాలు చూస్తుంటే ‘నువ్వు ఎస్ అన్నవాటికి నేను నో అంటా’ అన్న చందంగా ఉంది.
ఈ మార్పుల జాబితాలో తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ లోగో కూడా ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. తల్లిని దైవ సమానంగా భావిస్తాం కాబట్టి ఆభరణాలు ఉండటం సబబేనన్న మాటలు అందరినీ సంతృప్తి పరిచాయి. ‘తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు, వడ్డాణాలు పెట్టుకోరని, ఈ నేల తల్లి చాకలి ఐలమ్మలా ఉండాలి’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. చరిత్ర తెలిసి దాన్ని మభ్యపెట్టే మాటలు అనడం ఈ మధ్య నాయకులకు అలవాటైపోయింది. చాకలి ఐలమ్మ చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రగతిశీలవాదులకు చెందుతుంది. చాకలి ఐలమ్మ కష్టాలకు కారణమెవరు? ఆమె మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులను కాల్చి చంపిందెవరు? తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసిన అధ్యాయాలు చరిత్ర పుస్తకాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ మరుగునపడేసి ముఖ్యమంత్రి నేడు నీతులు వల్లించడం అసహ్యంగా ఉంది. తెలంగాణ రాకుండా తాత్సారం చేసి, వందలాది బిడ్డల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అందెశ్రీ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇస్తామనడం ఈ నేల చేసుకున్న దౌర్భాగ్యం. అందెశ్రీ గీతానికి ఈ గౌరవం ఎన్నటికైనా దక్కాల్సిందే. అందెశ్రీ గీతాన్ని గౌరవించడమంటే రాష్ట్రం తనను తాను గౌరవించుకోవడమే.
గద్దర్ గొప్ప వాగ్గేయకారుడు, మేధావి. అయితే ఆయన ప్రాథమికంగా విప్లవవాది. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో ఆయన నిషిద్ధ సాయుధ పార్టీ మద్దతుదారు. గద్దర్ చనిపోయిన ఆరు నెలలకు ఆయన శవంపై రాజకీయాలు మొలుస్తున్నాయి. దళితుడైన ఆయన పేరును ఎంత తలిస్తే అంత లాభమనే పాచికని రేవంత్ వాడుతున్నారు. సినిమా వాళ్లకు ఇచ్చే నంది అవార్డులను గద్దర్ పేరిట ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. నిజానికి సినిమా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వడం పదేండ్ల కిందటే ఆగిపోయింది. నేడు మన మధ్యలేని గద్దర్ను గౌరవించడం వేరు, సినిమావాళ్లకు అవార్డులు ఇవ్వాలనుకోవడం వేరు. రెండింటి ముడివేతకే పొంతన కుదరడం లేదు. గద్దర్ను గౌరవించాలనుకుంటే.. ఆయన పేరిట స్మారక మందిరం కట్టొచ్చు, ఏదైనా నిర్మాణానికి ఆయన పేరు పెట్టవచ్చు. ఉత్తమ దళిత విద్యార్థులకు పతకాలు, పారితోషికాలు ఇవ్వవచ్చు. అసలు విషయానికొస్తే.. రేవంత్ నోట పదేపదే గద్దరన్న అని వినిపిస్తున్నది. ఆయన గద్దర్ను కలిసిన సందర్భాలెన్ని? గద్దర్పై బుల్లెట్ల దాడిని ఖండించారా? ఆపత్కాలంలో ఇంటికెళ్లి కలిశారా? అవేవీ లేనప్పుడు ఒక్కసారి ఇంత ప్రేమ కురిపించడమెందుకు?
ఎన్ని మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీయే. వెంగళరావు నుంచి వైఎస్ఆర్ దాకా పౌరహక్కులు కాలరాసిన పార్టీయే. పౌరహక్కుల కోసం ఉద్యమించిన కోదండరాం.. అదే కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ సాధన కోసం ఎవరిని నిందించారో.. వారితో చేతులు కలపడం వెనుక స్వీయ ప్రయోజనమే ఉంది. ఆయన పెట్టుకున్న పార్టీ మండలి రికార్డుల్లోకి ఎక్కుతుంది. అదో తృప్తి.
కోదండరాం ఎమ్మెల్సీ అయినా, విద్యామంత్రి అయినా ఆయన ప్రతీ నిర్ణయం ముఖ్యమంత్రి గీసిన గీత దాటదు. ఢిల్లీ గీసిన గీత ముఖ్యమంత్రి దాటరు. ఒక్క ఎమ్మెల్సీ వదులుకోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో వచ్చే లాభమెంత? అనే కోణం, అంచనా ప్రకారమే ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది.
ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతామని రేవంత్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆనాడు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామనడం మరింత విడ్డూరంగా ఉంది. ఆయన వ్యవహారం ‘తన్నినవాడే ఓదార్చినట్టు’గా ఉంది. 40 ఏండ్ల తర్వాత ఆ పార్టీకి బాధితుల కుటుంబాలు గుర్తుకొచ్చాయి. హామీలను నెరవేర్చడం కంటే.. దగ్గరి దారిలో ప్రజల మన్ననలు పొందాలని, ప్రజలు నిరాశకు లోనుకాకముందే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ఆలోచన రేవంత్రెడ్డి సర్కారులో స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలిస్తుందో వేచిచూడాలి.
బి.నర్సన్
94401 28169