నేడు యువజన దినోత్సవం
స్వామి వివేకానందుడు ఒక హిందూ తత్త్వవేత్త మాత్రమే కాదు. సామాన్య జనంతో మమేకమై ఒంటిపూట
అరకొర తిండితో, చాలీచాలని వస్ర్తాలతో పదేండ్ల పాటు యావత్ భారతదేశంలో పర్యటించారు. దేశంలో
నెలకొన్న నైరాశ్యాన్ని, పేదరికాన్ని, విదేశీ పాలనా దౌష్ట్యాన్ని, మూఢ నమ్మకాలను, అస్పృశ్యత పాటించే
అమానుష కులవ్యవస్థను అర్థం చేసుకొని భారత యువతను మేల్కొలపడానికి నూతన తాత్విక శంఖారావాన్ని
పూరించారు. తన అనుభవాలను చెప్తూ ‘ముప్పై రోజుల వరకు నిల్వ ఉన్న ఎండు రొట్టెలను భిక్షగా స్వీకరించేవాడినని, వాటిని తినేటప్పుడు నోట నెత్తురు కారేదని’ చెప్పుకొన్నారు.
వివేకానందుడు కలకత్తాలో 1863, జనవరి 12 నాడు జన్మించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వ మత సమ్మేళనంలో అన్ని మతాల సత్యం ఒక్కటే, కానీ, పండితులు పలురకాలుగా వర్ణిస్తారనే ఉపనిషద్ వాణిని వినిపించి జగత్ విఖ్యాతి చెందారు. అయితే, అతను ఛాందసవాది కాదు. నా మటుకు నేను వేదాలలో హేతువాదంతో సరిపడే భాగాలను మాత్రమే అంగీకరిస్తాను. దేవుని గురించిన జ్ఞానమంతా వేదాల్లోనే కలదనడం కుతర్కం. వేదాల్లో హేతువాదంతో సరిపడే భాగాలు మాత్రమే అసలు వేదాలని, తక్కినవేవీ వేదాలు కావనీ మనువు ఒకచోట చెప్పాడు.
ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నింటిలో వేదాలు మాత్రమే ‘వేదాధ్యయనం సైతం అప్రధానం’ అంటున్నాయని వివేకానంద స్పష్టం చేశారు (శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం-8వ సంపుటం). ఆధ్యాత్మిక బోధనల కన్నా దేశభక్తే ఉన్నతమైనదని చెప్తూ నాకిప్పుడుండే కోరిక ఒక్కటే! ఈ దేశాన్ని మేల్కొలపాలి. ముక్తి, మొదలైనవన్నీ నాకు నిరర్ధకాలుగా కనిపిస్తున్నాయన్నారు. శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని పండిత వర్గాల్లో ప్రతిష్ఠిస్తే తాను సాంసారిక జీవితంలో, సమాజంలో వెదజల్లడానికి పుట్టానని చెప్పుకొన్నారు. (శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం-8వ సంపుటం)
అమెరికాలో మత మార్పిడులపై మాట్లాడుతూ ‘నేను మిమ్మల్ని ఒక కొత్త మతంలోకి మార్చడానికి రాలేదు. నిజమైన క్రైస్తవుడు అసలైన హిందువే. అసలైన హిందువు నిజమైన క్రైస్తవుడే’ అని హిందూ మతంలోని ఆధ్యాత్మికతను క్రిస్టియన్ మిషనరీల మధ్య తేడాను వివరించారు. (శ్రీ వివేకానంద జీవితచరిత్ర-శ్రీ చిరంతానంద స్వామి)
హిందూ మతంలో పాతుకుపోయిన కులతత్వాన్ని, అస్పృశ్య ఆచారాలను నిలదీస్తూ ‘నేటి భారతీయులు హిందువులు కారు; వేదాంతులు కారు. వారు ‘నన్ను ముట్టుకోకు’ అనే మతస్థులు. వంటిల్లే వారి దేవాలయం. వంట కుండలే వారి దేవతలు. ఈ స్థితి శీఘ్రంగా తొలగిపోవాలి. ఇక అస్పృశ్యులు అనబడు మాల మాదిగలు, పాకివాళ్లు తదితరుల దగ్గరికి పోయి చెప్పండి’ మీరే భారత జాతి ప్రాణం. మీయందే ప్రపంచ పరివర్తనం కలిగించే శక్తి కలదు. లేవండి. బంధ విముక్తులు కండి. (శ్రీవివేకానంద జీవిత చరిత్ర- శ్రీ చిరంతానంద స్వామి)
మత విశ్వాసాల కన్నా ఆత్మ విశ్వాసమే మిన్న అని చాటిచెప్తూ ప్రపంచంలోని చాలా మతాలు మనిషికి వెలుపల ఉండే వ్యక్తిగత దేవుడిని నమ్మనివాణ్ని నాస్తికుడని నిందిస్తాయి. కానీ, తనపై తనకు విశ్వాసం లేనివాడు నాస్తికుడని వేదాంతం చెప్తుందని వివేకానందుడు కొత్త నిర్వచనం ఇచ్చాడు. అంతేకాదు, వేదాంతం ‘పాపం’ అనే భావనను గుర్తించదు. కేవలం ‘పొరపాటును’ మాత్రమే గుర్తిస్తుంది. అన్నింటికన్నా మహా పొరపాటు ఏమంటే నీవు బలహీనుడవు, పాపాత్ముడవు, నికృష్టుడవు అనుకోవడం అని వేదాంతం చెప్తుందని ఆచరణాత్మక ఆధ్యాత్మికతను స్పష్టం చేశాడు. ఊహాజనిత కాల్పనిక ఆదర్శాలను వెక్కిరిస్తూ తన స్వార్థాన్ని, స్వసుఖానుభవాన్ని వదిలి ఉన్నతాదర్శాలను పాటించాలని ఎవరైనా చెప్తే, అది ఆచరణ సాధ్యం కాదు. నా స్వార్థంతో సమన్వయం చేయగల ఆదర్శాలంటే నేను ఎగిరి గంతేస్తాను అన్నారు. (అనుష్ఠాన వేదాంతం)
విశ్వం, మనిషి ఏకత్వాన్ని, మానవత్వాన్ని తాత్త్వికంగా ప్రతిపాదిస్తూ కేవలం ఒకే జీవితం, ఒకే ప్రపంచం, ఒకే అస్తిత్వం ఉంది. ఉన్నదొక్కటే. గుణాత్మకంగా వేరే అయినా అన్నింటి స్వభావం ఒక్కటే అని చాటాడు. మానవత్వమే అన్ని మతాలకు మూలమని వివరిస్తూ దేవుడు తన ప్రతిరూపంగా మనిషిని సృష్టించలేదు. మనిషే దేవుళ్లని సృష్టించాడు. మనమే దేవుళ్ల మూల రూపాలం. మనిషే వాస్తవంగా పూజనీయమైన ఏకైక దేవుడని ఆచరణాత్మక వేదాంతం చెప్తుందని వివేకానందుడు పేర్కొన్నారు. సనాతన హిందూ మతాన్ని ఆధునిక శాస్త్రీయ, హేతువాద దృక్పథంతో, మానవతావాదంతో సమన్వయం చేసి యువతను మేలుకొల్పిన ఏకైక తాత్త్వికుడు వివేకానందుడు.
ఆనందేశి నాగరాజు