తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవడానికి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు తమ ప్రాణాలనర్పించారు.
2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం శాంతియుతంగానే కొనసాగినా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా ఆవేశపూరితమైన యువతీయువకులు వందలాదిగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఉద్యమవీరుల ఆకాంక్షలను సాధించగలగడం గొప్ప నివాళి అయినా పదికాలాల పాటు వారిని ఈ రాష్ట్ర ప్రజలు స్మరించుకునేవిధంగా ప్రపంచంలోనే మరే పోరాటయోధులకు దక్కనంత గొప్ప స్మారక చిహ్నంగా ‘అమరజ్యోతి’ని కేసీఆర్ నిర్మించి ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు.
తెలంగాణ వైతాళికులు కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, బొజ్జా నర్సిములు, కేఆర్ ఆమోస్, కొలిశెట్టి రామదాసు, మల్లికార్జున్, మదన్మోహన్, నూకల రామచంద్రారెడ్డి, ఆచార్య జయశంకర్, ప్రొ.కేశవరావు జాదవ్ వంటి ఎందరో మహానుభావులు మూడు తరాలుగా సాగిన తెలంగాణ మహోద్యమంలో దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలకు సిద్ధమై తన పదవులను వదిలేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమకాడిని వదిలేది లేదని అనితర సాధ్యమైన శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని విజయతీరం వైపు నడిపించి కోట్లాది ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చగలిగారు.
ఇరువయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతం లో పలు జీవన్మరణ పోరాటాలు విఫలమైనా లేదా పరిమిత ప్రయోజనాలను మాత్రమే సాధించగలిగినా ఇరవై ఒకటవ శతాబ్ది తొలిరోజుల్లోనే మొదలైన మలిదశ ఉద్యమం గొప్ప విజయాన్ని అందించి ఈ ప్రాంత ప్రజల పోరాటాల చరిత్రను మలుపుతిప్పింది ‘నాన్ ముల్కీ-గోబ్యాక్’ నినాదంతో 1952లో వరంగల్లో విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం హైదరాబాద్ సిటీ కాలేజీ, అఫ్జల్గంజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వద్ద జరిగిన పోలీసు కాల్పులతో రక్తసిక్తమైంది. ఎనిమిది మంది యువకులు ప్రాణాలనర్పించి భవిష్యత్ తెలంగాణ ఉద్యమానికి దారిచూపే ధృవతారలైనారు.
1969 ప్రారంభం రోజుల్లోనే ఖమ్మం, వరంగల్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలైన చరిత్రాత్మక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పోలీసుల బుల్లెట్లకు వందలాది మంది నేలకొరిగారు. ఉద్యమకారుల అంచనాలను బట్టి 369 మంది ఈ ఉద్యమంలో మరణించారు. 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం శాంతియుతంగానే కొనసాగినా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా ఆవేశపూరితమైన యువతీయువకులు వందలాదిగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఉద్యమవీరుల ఆకాంక్షలను సాధించగలగడం గొప్ప నివాళి అయినా పదికాలాల పాటు వారిని ఈ రాష్ట్ర ప్రజలు స్మరించుకునేవిధంగా ప్రపంచంలోనే మరే పోరాటయోధులకు దక్కనంత గొప్ప స్మారక చిహ్నంగా ‘అమరజ్యోతి’ని కేసీఆర్ నిర్మించి ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు.
జలదృశ్యం స్థలంలోనే అమరజ్యోతి….
చరిత్రలో స్థలపురాణానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ‘అమరజ్యోతి’ స్థలం ఎంపిక యాదృచ్ఛికంగా జరిగింది కాదు. 2001 ఏప్రిల్ 27న ఈ స్థలం జలదృశ్యంలోనే కేసీఆర్ తొలిసారి టీఆర్ఎస్ పార్టీని ప్రకటించి గులాబీ జెండాను ఎగురవేశారు. అదే సంవత్సరం మే 17న ఈ జలదృశ్యం నుంచే కరీంనగర్ సింహగర్జన సభకు తరలివెళ్లారు. సుమారు పది నెలల పాటు ఈ స్థలంలోనే మేధోమథనం జరిగి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 2002 ఫిబ్రవరి 9న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందలాది మంది పోలీసులతో, మున్సిపల్ సిబ్బందితో చరిత్రాత్మకమైన జలదృశ్యాన్ని అక్రమంగా దౌర్జన్యంగా కూల్చివేసి తెలంగాణ ఉద్యమనేతల్లో ‘కసి’ని రగిలించారు. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అప్పుడు జలదృశ్యంలోనే ఉండేది.
తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని (1969లో) త్యాగం చేసిన బహుజనుల ప్రియతమ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నాలుగున్నర దశాబ్దాలు ఈ జలదృశ్యంలోనే నివసించా రు. అప్పటి తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ ప్రణాళికలు కూడా రూపొందింది ఈ జలదృశ్యంలోనే. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక మక్తాదార్కు ‘ఇనాం’గా ఇచ్చిన ‘జలదృశ్యం’లో హైదరాబాద్ శాసనసభను నిర్మించాలనుకున్నారు. మక్తాదారు సహకరించక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయన కల నెరవేరలేదు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నుంచి ఎన్టీఆర్ వరకు ఈ జలదృశ్యాన్ని సినిమా థియేటర్లు, విలాసవంతమైన హోటళ్ళు, పర్యాటక ప్రదేశంగా మార్చాలని ప్రయత్నించారు.
వారి ఆలోచనలను బాపూజీ అడ్డుకుంటూ సుదీర్ఘమైన న్యాయపోరాటాన్ని యాభై ఏండ్లు కొనసాగించారు. అప్పటి మక్తాదారు దగ్గర తొంభై తొమ్మిదేండ్లు లీజుకు కొండాలక్ష్మణ్ బాపూజీ చట్టబద్ధంగా తీసుకొని 1958లో ప్రభుత్వ అనుమతి, కోర్టు ఆదేశాలతో జలదృశ్యంలో తన నివాస భవనాన్ని నిర్మించుకొని దాన్ని కూల్చివేసే దాకా ఆయన ఇక్కడే నివసించారు.
1997లోనే జలదృశ్యంలోని గ్రౌండ్ ఫ్లోర్ను తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయ నిర్వహణ కోసం ఉచితంగా ఇచ్చారు. నేను, ప్రొ.జయశంకర్, ప్రొ.కేశవరావు జాదవ్, భూపతి కృష్ణమూర్తి, ప్రముఖ జర్నలిస్టులు ప్రతాప్కిశోర్, సంతపురి రఘువీర్రావు ఈ జలదృశ్యం నుంచే మూడేండ్ల పాటు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నిర్వహించాం. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం జలదృశ్యంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించడంతో నా కోర్కెను మన్నించి, సుద్దాల సుధాకర్ తేజ (వాస్తు సలహాదారు) సూచనలతో వాస్తు దోషాలను సరిదిద్ది టీఆర్ఎస్ను ఇక్కడే ప్రారంభించారు కేసీఆర్.
జలదృశ్యంలో ఏడెకరాల విశాలమైన మైదానం ఉండేది. వేలాది మందితో పార్టీలో చేరికలు జరిగేవి. ప్రతిరోజూ కేసీఆర్, జయశంకర్ ప్రసంగాలు వినడానికి ప్రజలు, కార్యకర్తలు, న్యాయవాదులు వందలాదిగా తరలివచ్చేవారు. పార్టీని ప్రారంభించిన రెండు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక మండల కేంద్రాలను అతి తక్కువ సమయంలో పర్యటించాల్సి రావడంతో కేసీఆర్ హెలికాప్టర్ను కిరాయికి తీసుకొని జలదృశ్యంలోనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేసుకున్నారు.
అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయల్దేరితే కేసీఆర్ తన కార్యాలయమైన జలదృశ్యం నుంచే హెలికాప్టర్ టేకాఫ్ కావడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. 2002 ఫిబ్రవరి 9, 10 తేదీల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నాయకత్వ శిక్షణా తరగతులలో మేమంతా నిమగ్నమై ఉన్న సందర్భం. కొండా లక్ష్మణ్ బాపూజీ ‘జలదృశ్యం’ కేసులో వాదించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో వృద్ధురాలైన ఆయన భార్యను బయటికి గెంటేసి, సామాన్లన్నీ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని సామగ్రిని, ఫర్నిచర్ను గోషామహల్ పోలీసు క్యాంపుకు తరలించి చట్టవిరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం జలదృశ్యాన్ని నేలమట్టం చేసి పర్యాటక శాఖకు ఈ స్థలాన్ని అప్పగించాడు.
జలదృశ్యం స్థలంలోనే 2013లో కేసీఆర్ చొరవ, ఉద్యమకారుల పట్టుదలతో కొండాలక్ష్మణ్ బాపూజీకి అంత్యక్రియలు నిర్వహించాం. కేసీఆర్ ఉద్యమస్ఫూర్తిని, ఆయనలోని కసిని, పట్టుదలను, నిశ్శబ్ద మౌనం వెనుక దాగిన కోపాన్ని, ఆవేశాన్ని ‘అమరజ్యోతి’ నిర్మాణం, ప్రక్కనే నిర్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నేపథ్యంలో చూడగలం.
-వి.ప్రకాశ్
95539 55304