పుట్టినింటికి తిరిగొచ్చిన ఆనందాన్ని కేటీఆర్ వల్ల మా కుటుంబం మొత్తం పొందగలిగామని ఇటీవల పాలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ, అమర రాజా కంపెనీ ప్రారంభ కార్యక్రమంలో చెమర్చే కండ్లతో ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వెళ్లగొడితే తెలంగాణ మమ్మల్ని కడుపులో దాచుకున్నదని, జీవితాంతం ఈ నేలకు రుణపడి ఉంటామని భావోద్వేగంతో మాటిచ్చారు. ఇలా అమర రాజా కంపెనీ పాలమూరుకు, కిటెక్స్ కంపెనీ ఓరుగల్లుకు హెలికాప్టర్ వేగంతో తరలిరావడం వెనుక కేటీఆర్ పరిశ్రమ, తపన, నిరంతర అన్వేషణనే కారణం. పెట్టుబడుల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా, పారిశ్రామికవేత్తల మనసులను గెలిచి, మన రాష్ర్టానికి తరలివచ్చే వాతావరణాన్ని కేటీఆర్ కల్పించేశారు.
పోర్ట్ఫోలియోను నిర్వహించడం సహజమే కానీ, ప్రాణం పెట్టి పాత పద్ధతుల నెత్తిన నూతన పొద్దుపొడుపై నడిపించగలిగాడు కేటీఆర్. గల్లా అరుణ కండ్లు చెమర్చేలా, అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణ ప్రేమలో పడేలా కేటీఆర్ సానుకూలతకు జీవం పోశారు.
ఎదుటి వారి మనసును మలుపుకోవాలంటే భాష మీద పట్టు ఒక్కటే సరిపోదు. అందునా అనేక ప్రభుత్వాలు, దేశాధినేతల తీరును అనుభవంలో గమనించిన పెట్టుబడిదారుల ప్రేమను, చప్పట్ల ఆమోదాన్ని సంపాదించాలంటే ప్రాణం పరిచి మెప్పించే చొరవ, పనితీరే ప్రామాణికంగా నిలుస్తుంది. అదే నేడు కేటీఆర్ను దేశంలో సాటిలేని ఐటీ, పరిశ్రమల మంత్రిగా, పట్టణాభివృద్ధిలో పెట్టింది పేరుగా నిలబెట్టగలిగింది. 16 లక్షలకు పైగా ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర ప్రైవేటు రంగంలో రావడం వెనుక రాళ్లెత్తిన శ్రమజీవి రామన్న నూతన చరిత్రకు నాంది పలికారు. కేసీఆర్ ఆలోచనలను, పని ప్రామాణికత పరీక్షను, పర్యవేక్షణను, నిరంతర ఫలితాల సమీక్షను అందుకోవాలంటే ఆషామాషీతనం నిలబడదు. నిత్యం అలసట ఎరుగని పనిపరుగును అలవాటుగా కేటీఆర్ మార్చుకున్నారు కనుకే, పాలనలో కేటీఆర్ నూతన దృక్పథాన్ని సృష్టించగలిగారు. ఒకసారి అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లంచ్ టైం ముగిసిపోతుంటే, రామన్న భోజనం చేసి వెళ్తాడా మేడం అని అదే కార్యక్రమంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డిని నిర్వాహకులు అడిగారు. కేటీఆర్ లంచ్ కారులోనే నాలుగు పండ్లతో ముగుస్తుంది, ఇది షరామామూలే అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్తుంటే, కేటీఆర్ లాంటి నేతకు పదవి కిరీటం కాదు, సవాళ్ల సవారీ మాత్రమేనని అక్కడున్నవారంతా చర్చించుకోవడం గుర్తొచ్చింది.
నిన్న తల్లడిల్లుతున్న తెలంగాణలో తనూ భాగమై, గులాబీ జెండాను ప్రతి గడపకూ గొడుగుగా అందించడంలో పోరాట బొంగరమై, ఈ నేల నలుచెరుగులా ఆత్మీయులను సంపాదించుకున్నారు రామన్న. ఏందిరా బై.. ఊకే అని దగ్గరివారిని ఎవరినైనా అంటుంటే ఎంత మధురంగా ఉంటుందో! ముక్కుసూటి మాటల్లో కల్మషం లేనితనం, ప్రనిలో ప్రేమ, పనే ప్రేమగా ఆచరణను మలిచేసుకున్న నైజం కేటీఆర్కు భిన్నమైన జన ఆమోదాన్ని దక్కేలా చేసింది. పార్టీ, ప్రభుత్వం, పల్లెలు, పట్టణాలను సమన్వయం చేయడంలో కేటీఆర్ చూపుతున్న నేర్పు, తెలంగాణ రాష్ట్ర ప్రేమికులందరి మెప్పునకు కారణమైంది. ఇప్పుడు కేటీఆర్కు మించిన సెలబ్రిటీ ఏ రంగంలో, ఎవరూ లేరని సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా సీఎం కప్ నిర్వహణ సందర్భంగా నాతో అన్న మాటలు నిజమే కదా! సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలకు అర్థం మారిపోయింది. అప్పుడప్పుడు కనపడే సినీతారలు, క్రికెట్ ఆటగాళ్ల కంటే, ఆపదలో, సమాజాన్ని పురోగామి దిశగా నడిపించడంలో తోడుగా నడిచే నాయకుడే ప్రజల మనసు గెలిచిన నిజమైన సెలబ్రిటీగా గుర్తింపును గెలుచుకుంటున్నాడనేది సత్యం. ఆ సంగతి కేటీఆర్కు జనం గుండెల్లో దొరికిన చోటే చాటిచెప్తున్నది. ఎనిమిదేండ్ల కిందటి హైదరాబాద్కు, నేటి మన రాజధాని నగరానికి ఎంత వ్యత్యాసమో, ప్రతివారికి అనుభవంలోనే అర్థమవుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుడు వేలు చూపిన దారెంట గ్రేటర్ హైదరాబాద్ గతిని నూతన గమ్యానికి చేర్చారు కేటీఆర్. ఎల్బీనగర్ అండర్ పాస్ నుంచి దుర్గం చెరువు తీగల వంతెన దాక, ప్రతి అడుగులో, నగర నలుదిక్కుల్లో ప్రగతిరథం అందం సంతరించుకున్నది.
దోమల మందు కొట్టడానికో, నిర్మాణాల అనుమతికో, అక్కడక్కడ అరిగిన రోడ్లపై మొరం పోయడానికో పరిమితమైన, పైరవీకారుల నిలయమైన నిన్నటి పట్టణాభివృద్ధి శాఖకు, కొత్త అర్థం సమకూర్చారు కేటీఆర్. ఒక్క హైదరాబాదే కాదు ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్. రాష్ట్రంలో ఏ నగరానికైనా వెళ్లి చూడొచ్చు. ప్రతి మూలనా మారిపోయి, అభివృద్ధికి అద్దంలా తయారైపోయాయి. ఆ పట్టపగలు ప్రపంచం అంతటా ఆగిపోయిన కరోనా కాలాన్ని కరగదీసి, తెలంగాణ పట్టణ ప్రగతికి బాటగా పరిచిన శ్రామికుడు రామన్న. పుట్టినరోజున పొగడ్తల కోసం రాసిన రాతలని ఎవరైనా అనుకుంటే మీ ఖర్మ. నమ్మినదాన్ని మాత్రమే రాసే, ప్రజలకు మేలుచేసే నేతలను మాత్రమే ప్రేమించే నేపథ్యం నుంచి వచ్చిన నాలాంటి వాళ్లకు నిజాలు మాత్రమే రాసే అలవాటు. జరుగుతున్న మంచిని చూడలేని, ప్రజారాశుల మెరుగైన జీవితం కోసం శ్రమిస్తున్న వారిని మెచ్చుకోలేని మానసిక అంధత్వంతో బాధపడేవారిని మనమెలాగూ మార్చలేం. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రగతి విప్లవానికి తమ విలువైన కాలాన్ని, శ్రమను, మేధస్సును ధారపోస్తున్న నాయకులను మనసారా మెచ్చుకుందాం.
కేటీఆర్ గురించి నాలుగు మంచి మాటలు రాయడమంటే, రాజకీయాల్లో మంచిని పదిమందికీ పంచడమే మిత్రమా! భుజం మీద చెయ్యేసే నాథుడే లేని నలిగిన కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో మట్టి మనుషుల బిడ్డలకు భవితను వాగ్దానం చేసిన నేతలు కేసీఆర్, కేటీఆర్. సుమన్, కిషోర్, రాంమోహన్, ఎర్రోళ్ల, గెల్లు శ్రీనివాస్, బాబా ఫసియొద్దీన్, వాసుదేవరెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, దూదిమెట్ల, నాతో సహా ఇంకా ఎందరో పేద, మధ్య తరగతి యువతరానికి రాజకీయాల్లో రాష్ట్రస్థాయి అవకాశాలు కల్పిస్తూ, నడిపిస్తూ, నవతరాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు కేసీఆర్, కేటీఆర్లు. నిన్నటికి నిన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపుతో పాటు దివ్యాంగుల ఆసరా పింఛన్లను భారీగా పెంచడం ద్వారా ప్రజా ప్రభుత్వంగా కేసీఆర్ సర్కార్ మళ్లీ మానవతను చాటుకున్నది. రంగాలన్నింటిలో ప్రజల బంగారు భవితవ్యమే కొలమానంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
ఈ జన సర్కార్ జర్నీలో చెమటోడుస్తున్న, కేసీఆర్ కష్టాన్ని అర్థం చేసుకొని, అడుగులేస్తున్న కేటీఆర్తో సహా బీఆర్ఎస్ బలగానికంతా సెల్యూట్. గులాబీ బలగానికి వర్తమానం పట్ల దిగులు లేదు, భవిష్యత్ పట్ల బెంగన్నది లేనే లేదు. చీకటిలోంచి నడిచొచ్చి, వెలుగుల బాటలో నడకసాగిస్తున్నది గులాబీ దళం. వెలుగుల్లోంచి, వెలుగుల తొవ్వలోనే దివిటీల్లా బీఆర్ఎస్ శ్రేణుల లాంగ్ మార్చ్ సాగిపోతుంది. జనం గుండెలపై చెరిగిపోని సంతకమై, ఇలాగే కలకాలం వర్ధిల్లు కేటీఆర్. మీతో తెలంగాణ ప్రేమ పెనవేసుకొని ఉన్నది. మనసుగల్ల మాస్ లీడర్గా ఎదిగిన కేటీఆర్ ప్రయాణంలో ప్రగతి ప్రేమికులంతా, మన యోధుడు కేసీఆర్ అభిమాన జనమంతా, వెల్లువలా తోడుంటారు.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242