మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచించారో లేదో తెలియదు. ఒకవేళ చేయనట్లయితే ఇప్పటికైనా ఆ పని జరగటం అవసరం. వాస్తవానికి ఆ ప్రశ్నలలో మంత్రి ప్రస్తావించిన అంశాలు మీడియా వారు స్వయంగా ఊహించలేనివేమీ కావు. అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్ల తర్వాత కూడా ఇవి చర్చించవలసినవిగా మిగిలిపోవటం విచారకరం.
కేటీఆర్ ప్రసంగ సారాంశాన్ని నాలుగు మాటలలో చెప్పాలంటే, మీడియా వారు మంచిని వివరించి చెప్పాలి, చెడును ఎత్తిచూపాలి, తమ వృత్తి విలువలు కాపాడుకోవాలి, అందు కు విరుద్ధమైన ధోరణులను విడనాడాలి. ఈ విషయాలను ఆయన వేర్వేరు మాటలలో, ఆయా సందర్భాలకు అన్వయిస్తూ చెప్పి ఉండవచ్చు గాక. కానీ సారాంశం అదే. అట్లాగే, ఆయన రాష్ట్ర ప్రభుత్వం లో మంత్రి అయినందున, తను ఎత్తిచూపిన మీడియా తీరుతెన్ను లు ప్రత్యేకంగా అనుచితంగా తోచి ఉండవచ్చు గాక. కానీ, ఇటువంటి తర్కాన్ని పక్కన ఉంచి ఆయన ప్రసంగ సారాంశాన్ని సీరియస్గా ఆలోచించేవారు ఎవరూ కూడా అందులోని విలువను, ఆలోచనీయతను కాదనలేరు. తను చెప్పిన విషయాలు పత్రికలలో వచ్చినవే గనుక ఇక్కడ మళ్లీ రాయటం లేదు.
ఎవరూ ప్రత్యేకంగా ఎత్తిచూపనక్కర లేకుండానే, మంచిని మంచిగా, చెడును చెడుగా రాయటం, వృత్తి విలువలను కాపాడుకోవటం, అందుకు విరుద్ధమైన ధోరణులను విడనాడటం, ఈ క్రమంలో తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటం అన్నవి మీడియా రంగానికి మౌలిక సూత్రాలు. కానీ ఇందుకు భంగకరంగా జరుగుతుండటంపై చర్చ ఎప్పటినుంచో సాగుతున్నది. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎందుకు మారటం లేదు? అన్నది మొదటి ప్రశ్న. మారాలంటే ఏమి జరగాలి? అన్నది రెండవ ప్రశ్న. అందుకు మీడియా వారు ఏమి చేయాలి? అన్నది మూడవ ప్రశ్న. ఇవి కేటీఆర్ వేసిన ప్రశ్నలు కాకపోవచ్చు. కానీ తను వేసిన ప్రశ్నలను, లేవనెత్తిన సందేహాలను, చేసిన సూచనలను శోధిస్తూ పోతే, వాటి మూలాల్లోంచి ఉత్పన్నమయ్యేవే ఈ తరహా ప్రశ్నలు.
కేటీఆర్ అభ్యంతరం చెప్పిన ధోరణులు మీడియాలో ఉన్నాయన్నది నేటుగానో, చాటుగానో స్వయంగా మీడియా వారు సైతం అంగీకరించే వాస్తవం. అయితే ఆ అవాంఛనీయ స్థితి, తక్కిన సమాజంతో పాటు మీడియా వారు కూడా పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఎందుకు కొనసాగుతున్నది? పలువురిని వేధిస్తున్న ఈ ప్రశ్న మంత్రిని కూడా బాధిస్తున్నదన్నమాట. అందుకే ఆయన ఆ రోజున ‘మీడియా ఇన్ తెలంగాణ’ సెమినార్లో ఆవేదనతో, ఎటువంటి అరమరికలు లేకుండా ఆ మాటలన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో పోషించిన ధీరోదాత్తమైన పాత్రను తిరిగి పోషించాల’ని జర్నలిస్టులకు సూచించారు.
ఇందులో కీ వర్డ్ ‘తిరిగి పోషించాలి’ అన్నది. అందులో అం తరార్థం ఈ ఎనిమిదేండ్లుగా పోషించటం లేదని. తెలంగాణ మీడియా వారు తమ 2014 కన్న ముందటి పాత్రను విడనాడారని. దానిని తిరిగి ఆవాహన చేసుకోవాలని. ఆ పని ఎవరి కోసమో కాదు, తమ తెలంగాణ కోసం, తమ కోసం. తెలంగాణలో మీడియా వారు, లేదా తెలంగాణ మీడియా పరిస్థితి 2014కు ముందు ఏ విధంగా ఉండేది, తర్వాత ఎనిమిదేండ్లలో ఏ విధంగా ఉంది అనేవి విస్తృతంగా, భిన్నమైన కోణాల నుంచి చర్చించుకోవల్సిన కీలకమైన విషయాలు. ఈ కాలంలో వచ్చిన మార్పులేమిటి, రానివేమిటి? మెరుగుదల, క్షీణత, యథాతథ స్థితి ఏమిటి? దేనికైనా కారణాలేమిటి? సమస్యలకు పరిష్కారాలేమిటి? స్వయంగా మీడియా మనుషుల వైపు నుంచి, ఇతరత్రా జరగవలసిన కృషి ఏమిటి? ఈ సమగ్రమైన చిత్రంలో కేటీఆర్ ప్రశ్నలు, ఆవేదన ఇమిడి ఉంటాయి.
తెలంగాణ మీడియా తన ‘ధీరోదాత్తమైన పాత్రను తిరిగి పోషించటం’ సాధ్యం కానిదా? కానిదని ఎవరూ అనలేరు. అందుకోసం మొదట చేయవలసింది 20 14కు ముందటి పాత్రను ఆ తర్వా త కోల్పోయింది ఎందుకో గుర్తించుకోవటం. ఆ కారణాలను స్పష్టం గా విశ్లేషించుకొని, అందులో ఎవ రి బాధ్యత ఏమిటో అంతే స్పష్టం గా అర్థం చేసుకొని, వాటిని అధిగమించే మార్గాలను వెతకటం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం సీమాంధ్ర మీడియాను నిం దించటం చెల్లుబడి అయింది. అప్పు డు మీడియా ఇతరులది అయినప్పటికీ తెలంగాణ జర్నలిస్టులు కేటీఆర్ అన్నట్లు ‘ధీరోదాత్తమైన పాత్ర’ను పోషించగలిగారు. అటువంటప్పుడు అదే పని 2014 తర్వాత ఎందుకు చేయలేరు? ఎక్కడో ఏదో లంకె ఎందువల్లనో తెగింది. దానిని మళ్లీ అతికించుకోవటం తెలంగాణ జర్నలిస్టులకు, జర్నలిజానికి, తెలంగాణ రాష్ర్టానికి అవసరం. ఆ పని జరగనట్లయితే ఈ ఎనిమిదేండ్ల నష్టం ఇదేవిధంగా కొనసాగి, 2014 కన్న ముందటి ‘ధీరోదాత్తత’ అంతటితోనే ఒక ముగిసిన అధ్యాయంగా మిగిలిపోతుంది. వాస్తవానికి, కేటీఆర్ ఉద్దేశించిన ‘ధీరోదాత్తత’ ఉద్యమ సమయంలో కన్న తెలంగాణ భవిష్యత్తు నిర్మాణ క్రమంలో ఇంకా ఎక్కువ అవసరం.
-టంకశాల అశోక్