ఆయన ఒక విజ్ఞాన సముద్రం! జ్ఞాన భాండాగారం!! భారతీయతకు నిలువెత్తు సాక్ష్యం!!! జాతిపిత మహాత్మా గాంధీపైన, భారతీయ మూలాలపైనా ఎన్నో గ్రంథాలు రాసిన మేధావి ధరమ్పాల్ (వార్ధా ఆశ్రమం) తర్వాత దేశంలో అంతటి గౌరవాన్ని పొందిన మహోన్నత వ్యక్తి. ఆయనే కీర్తిశేషులు, గురూజీ రవీందర్ శర్మ. బ్యూరోక్రాట్ల నుంచి టెక్నోక్రాట్ల వరకు, నాయకుల నుంచి మేధావుల వరకు దేశంలో వేలాది మంది ఆయనకు శిష్యులు!
దాన్ అనే ఆర్థిక సూత్రం ప్రకారం సర్ప్లస్ టు డెఫిసిట్ అంటే సమాజంలో తెలిసో తెలియకో కూడబెట్టిన ధనం ఆ సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకే చెందాలి. అంటే సమాజంలోని భిన్న వర్గాలు కూడబెట్టిన ధనాన్ని ఏటా వివిధ పండుగల సందర్భంగా, మత నియమాల పరంగా బడుగు, బలహీన వర్గాలకు దాన రూపంలో చెల్లించాలి. ఇది ఏ భారతీయుడైనా మతాలకతీతంగా జీవన విధానంలో పాటించే జీవన నియమావళి.
గురూజీ మన తెలంగాణ వాసి. అందుకు మనం గర్వపడాలి. ఆదిలాబాద్ పట్టణంలో కళాశ్రమం స్థాపించిన ఆయన యావత్ భారతంలోని మేధావులకు దిక్సూచి. ఐఏఎస్ల నుంచి ఐఐటీల వరకు ఎంతోమంది ఆయనకు శిష్యరికం చేశారు. నేటి బీజేపీ విధానాలు నచ్చక దూరంగా ఉంటున్న ఒకనాటి ఆ పార్టీ సిద్ధాంతకర్త గోవిందాచార్య లాంటి వారు కూడా గురూజీ విశ్లేషణలకు ఎంతో విలువనిచ్చే వారు. అద్వైతం అంటే దైవత్వం మాత్రమే కాదని అంటూ, భగవత్ తత్వానికి భిన్నంగా జీవన విధానంలోని సామాజిక సూత్రాలు, ప్రాకృతిక నియమాలు, ఆదివాసుల ఔచిత్యం, పంచాయతీ రాజ్ మూలాలు, గ్రామ స్వరాజ్ అన్వయింపులను గురూజీ విడమర్చి చెబుతారు. ఏ విశ్వవిద్యాలయం చెప్పని వేలాది అంశాలను ఆయన చెబుతుండేవారు.
అపర చాణక్యుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజనీతిజ్ఞతతో తీసుకున్న పరిపాలనాపరమైన విధానాలను ఈ సందర్భంగా గురూజీ దృక్పథంతో పరిశీలించాలి. ముఖ్యంగా శాసన విధానం, జీవన విధానం మన దేశంలో ద్వైతభావనలో కొనసాగుతున్నాయని, ఈ దేశ రాజకీయ, ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలు ఇంకా పరిపక్వత చెందలేదని గురూజీ విశ్లేషించేవారు. మన దేశంలో ఒక వ్యవస్థ మనుషుల్ని బతుకనివ్వడం లేదని, మరో వ్యవస్థ ప్రజలను చావనివ్వడం లేదనేది గురూజీ ప్రధాన ఆరోపణ. రాజకీయ వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మనుషులను చావకుండా మాత్రమే కాపాడుతున్నదని, మరో వ్యవస్థ అయిన కార్పొరేట్ ఆర్థిక వాణిజ్య వ్యవస్థ సమాజంలోని వివిధ కులవృత్తులను ధ్వంసం చేసి, బతుకుతెరువును నాశనం చేసిందని ఎన్నో ఉదాహరణలతో ఆయన విడమర్చి చెప్పేవారు.
ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సీఎం కేసీఆర్ సమాజంలోకి పంపించిన రూ.65 వేల కోట్ల సంపద 70 లక్షల రైతు కుటుంబాలకు చేరుతుంది. దీని వల్ల ఆయా కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగి సమాజంలో నగదు చెలామణి జరుగుతుంది. తద్వారా మిగతా ఉత్పత్తి వర్గాల సరుకులకు డిమాండ్ ఏర్పడటంతోపాటు జీఎస్డీపీకి ఉత్ప్రేరకంగా మారుతుంది. గణిత సూత్రాల ప్రకారం రైతుబంధు పథకం ఒక సూపర్ సెట్. రైతు బంధు పథకాన్ని గురూజీ కోణంలో దేశ బంధుగా భావించవచ్చు.
ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్టు ఫరీద్ జకారియా మాటల్లో చెప్పాలంటే- ప్రస్తుత ప్రాపంచిక విశ్వవ్యాప్త ఆర్థిక సూత్రాల ప్రకారం ‘సోషలైజ్ ది లాస్, ప్రైవెటైజ్ ది ప్రాఫిట్’ అనేది ఆధునిక అభివృద్ధికి నమూనా సూత్రం. ఇంతటి దుర్మార్గమైన విశ్వనమూనా ఆర్థిక జీవన విధానంలో మెజార్టీ ప్రజలు నష్టపోతుంటే, కొంతమంది మేలు కోసమే ప్రస్తుత వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆయన విశ్లేషిస్తారు. ఇక్కడే సీఎం కేసీఆర్ ఈ ప్రాపంచిక విశ్వజనీన ఆర్థిక సూత్రానికి భిన్నంగా తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు.
ఇది ఎన్నో విశ్వవిద్యాలయాలకు అధ్యయన అంశంగా మారాలి. అదే రైతు బంధు పథకం. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం ఈ పథకాన్ని కేసీఆర్ తీసుకువచ్చారని తెలిసిందే. యావత్ భారతంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని మహోన్నత మానవతా నిర్ణయం ఇది.
తెలంగాణలో 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు సుమారు 70 లక్షలకు పైగా రైతులకు చెందిన ఒక కోటి 53 లక్షల ఎకరాలకు 65 వేల కోట్ల రూపాయలకు పైగా నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం అంటే రాజనీతిజ్ఞతలో కేసీఆర్ ఒక రాజర్షి, బ్రహ్మర్షి, మహర్షి, దేవర్షి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో రైతుల కోసం ఒకే ఒక పథకం యూపీఏ హయాంలో వచ్చింది. అదే రుణమాఫీ పథకం.
అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశంలోని రైతులకు రూ.69 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసింది. ఇది బ్యాంకు ఖాతా పుస్తకాల్లో జరిగిన సర్దుబాటు మాత్రమే. ఎప్పుడో తీసుకొని ఖర్చు చేసిన అప్పును రద్దయినట్లుగా ప్రకటించారు. అంతేగాని, రైతులకు నికరంగా డబ్బులు వచ్చింది లేదు. ఈ రూ.69వేల కోట్లు కూడా అన్ని రాష్ర్టాలకూ కలిపి ఇచ్చిన మొత్తం. కానీ రైతుబంధు ద్వారా ఒక్క తెలంగాణలోనే రైతులకు రూ.65 వేల కోట్లకు పైగా నిధులు లభించాయి. అవి కూడా వారి ఖాతాల్లో నగదు రూపంలో వచ్చి పడ్డాయి.
మన దేశంలో పాలకులుగా ఉండిన రాజులతోపాటు ప్రజల మనస్సును, స్వభావాన్ని బ్రిటిష్ వారు తమ స్వార్థం కోసం విషపూరితం చేశారనేది గురూజీ రవీందర్ శర్మ భావన. భారతీయ సంప్రదాయ కుటుంబ విధానాన్ని ధ్వంసం చేసి, దానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక సూత్రాలతో కూడిన దుర్మార్గమైన నీతిని తయారు చేశారు. దాన్, దావత్ సంప్రదాయ అలవాట్లు మన జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో గురూజీ విడమరిచి చెప్పేవారు. దాన్ అనే ఆర్థిక సూత్రం ప్రకారం సర్ప్లస్ టు డెఫిసిట్ అంటే సమాజంలో తెలిసో తెలియకో కూడబెట్టిన ధనం ఆ సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకే చెందాలి. అంటే సమాజంలోని భిన్న వర్గాలు కూడబెట్టిన ధనాన్ని ఏటా వివిధ పండుగల సందర్భంగా, మత నియమాల పరంగా బడుగు, బలహీన వర్గాలకు దాన రూపంలో చెల్లించాలి. ఇది ఏ భారతీయుడైనా మతాలకతీతంగా జీవన విధానంలో పాటించే జీవన నియమావళి.
కానీ బ్రిటీషర్లు మన మస్తిష్కాన్ని, నీతిని, జీవన విధానాన్ని విషపూరితం చేశారనేది ఆయన విశ్లేషణ. బ్రిటిషర్లు విందు వినోదాల కార్యక్రమాలతో రాజులను కలుషితం చేశారు. దావత్ ఆర్థిక సూత్రం ప్రకారం సర్ప్లస్ టు సర్ప్లస్ మాత్రమే జరుగుతుంది అనేది గురూజీ తాత్విక విశ్లేషణ. ఈ పద్ధతిలో ఒక ధనవంతుడు ఇంకొక ధనవంతుడిని ఆకర్షించడానికి, వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం దావత్లు జరుగుతాయని, దీనివల్ల బడుగు బలహీన వర్గాలు పరోక్షంగా బహిష్కరణకు గురై అన్యాయమవుతాయని చెప్పేవారు. దాన్ పద్ధతిలో సంపద సర్ ప్లస్ టు డెఫిసిట్ -ఉన్న వారి నుంచి లేని వారికి – చేరడం వల్ల సమాజంలో సుఖ శాంతులు వర్థిల్లుతాయని అనేవారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సమాజంలోకి పంపించిన ఈ రూ.65 వేల కోట్ల సంపద 70 లక్షల రైతు కుటుంబాలకు చేరుతుంది. దీని వల్ల ఆయా కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగి సమాజంలో నగదు చలామణి జరుగుతుంది. తద్వారా మిగతా ఉత్పత్తి వర్గాల సరుకులకు డిమాండ్ ఏర్పడటంతోపాటు జీఎస్డీపీకి ఉత్ప్రేరకంగా మారుతుంది. గణిత సూత్రాల ప్రకారం రైతుబంధు పథకం ఒక సూపర్ సెట్. అంటే దీనిలో ఎన్నో ఉప సమితులు ఉన్నాయి. ఈ పథకాన్ని ఇప్పటి వరకు పెట్టుబడి పథకంగానే చర్చించారు. కానీ భారతీయ ప్రభుత్వ పరిపాలన పద్ధతిలో ఇప్పటి వరకూ అమలవుతున్న, అమలుకాని ఎన్నో సంక్షేమ పథకాల సమాహారంగా దీనిని చర్చించలేదు.
భారతీయ వ్యవసాయ పద్ధతిలో అంతర పంటలు వేయడం సహజం. కాబట్టి దీనిని ఒక అంతర పంట లాభంగా కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా ధరల స్థిరీకరణ నిధి అనేది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకాని ఆలోచన. రైతుబంధును ఆ కోణంలోనూ పరిగణించవచ్చు. భారతీయతలో గురుదక్షిణ ఒక సంప్రదాయం. ప్రభుత్వపరంగా రైతులకు గురుదక్షిణగా కూడా రైతుబంధును చూడవచ్చు. గిట్టుబాటు ధర రైతులకు ఇంకా ఎండమావిగానే మిగిలింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనేక ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. ఈ నేపథ్యంలో రైతుబంధు రైతులకు గిట్టుబాటు పథకంగా మారుతుందనవచ్చు. మన దేశంలో పంట నష్ట పరిహారం కూడా అందని ద్రాక్షపండే. రైతుబంధు పథకం పరోక్షంగా రైతులకు నష్టపరిహారంగా కూడా పనికొస్తున్నది. వృద్ధ రైతులకు పెన్షన్ పథకం అమలు చేయాలనేది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. రైతుబంధును రైతులకు ఒక పెన్షన్గా కూడా అన్వయించుకోవచ్చు. కూలీలకు ఉపాధి హామీలాగా రైతులకు ఇదొక ప్రభుత్వ హామీ పథకం.
ఇన్ని కోణాలున్న బహుముఖ, బహుళతత్వ, సామాజిక, సంక్షేమ పథకం కేసీఆర్ మదిలో రావడం అంటే ఆయనొక కర్మయోగి, దేవర్షి, రాజర్షి, మహర్షి. ఒకనాటి కౌటిల్యుడి ఆర్థిక సూత్రాలకు ఆధునిక భాష్యం చెప్పినట్లయింది. ఆధునిక ఆడంస్మిత్గా కేసీఆర్ను పేర్కొన్నా ఆశ్చర్యం లేదు. నేటి ప్రధాన స్రవంతిలో ఉన్న ఆర్థిక సూత్రం ‘ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్’ అనేది రైతుబంధు ముందు తెల్లబోయింది. రాజనీతిశాస్త్రం ప్రకారం ఇదొక కొత్త స్టేట్ సోషలిజం. అందుకే ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. అంతర్జాతీయ వేదికలపై ఈ పథకాన్ని చర్చించాలని ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ సూచించింది. రైతు బంధు పథకాన్ని గురూజీ కోణంలో దేశ బంధుగా భావించవచ్చు. ఇప్పటికే ఈ పథకం ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకమైంది. కేంద్రప్రభుత్వం కూడా ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి’ పేరిట రైతుబంధును అమలు చేస్తున్నది. ఎకరాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం స్ఫూర్తితో రైతు భరోసా అనే విధానాన్ని తీసుకువచ్చి ఎకరాకి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నది. ఒడిశా ప్రభుత్వం కలియ అనే పేరుతో నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నది. అలాగే జార్ఖండ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కిషోర్ ఆశీర్వాద్ యోజన’ ద్వారా ఏడాదికి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నది. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం కృషిబంధు ద్వారా ఐదు వేలు మాత్రమే ఇస్తున్నది.
ఇతర రాష్ర్టాలు తెలంగాణలాగా కాకుండా కొన్ని పరిమితులతో రైతుబంధు తరహా పథ కాలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, రైతుబంధు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల పథకాలకు స్ఫూర్తిదాయకం అయ్యారు. అందుకే ఆయనను దేశ్ కీ నేత అని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని జాతీయ రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. అన్ని రాష్ర్టాలలోని రైతు సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. యూపీఏ హయాంలో విదర్భ ప్యాకేజీ కోసం అవిరళ కృషి చేసిన రైతు నాయకుడు విజయ్ జావండియా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నడువటానికి ముందుకు రావటం గమనార్హం.
గురూజీ రవీందర్ శర్మ ఈ దేశ అభివృద్ధి నమూనా కోసం డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్లో చేసిన టీవీ షోలను పరిశీలించాలని చెబుతుండేవారు. దేశంలో మానవ వనరులను, సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై ఆయన ఎన్నో ఆలోచనలు పంచుకునేవారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నో అంశాలను దేశం ముందు విడమర్చి చెప్పారు.
నీటి వనరుల వినియోగం, ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలు, దళితబంధు వంటి పథకాల అమలుతో మహోజ్వల భారత్ కోసం ఏ విధంగా నడుం బిగించాలో విశ్లేషణాత్మకంగా వివరించారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఏ స్థాయికి చేరుకోవాలో ఆ స్థాయికి చేరలేదనేది కేసీఆర్ విశ్లేషణ. 1980 వరకు పొరుగు దేశమైన చైనా ఏ విధంగా వెనునుకబడి ఉండేదో వివరించారు. రాజకీయాలంటే త్యాగమని కానీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎన్నికల్లో గెలుపుగా మారిందని, దీనివల్లే నాయకులు గెలుస్తూ ప్రజలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యసిద్ధి, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధి సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మహాపురుషుడు, కీర్తిశేషులు గురూజీ రవీందర్ శర్మ ఆలోచనలను దాటి సీఎం కేసీఆర్ చేస్తున్న రాజనీతి ప్రయోగం దేశానికి కొత్త దశ దిశను తీసుకొస్తాయి. కేసీఆర్ను అందరం బలపరచాలి. వివిధ రాష్ర్టాల మేధావులను, ప్రజాసంఘాలను, రైతు నాయకులను, అభ్యుదయ వాదులను సమన్వయపరుచాలి. అవసరమైతే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం కోసం ఒక్కో స్టార్టప్ కంపెనీని తయారు చేయాలి.
ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే హైదరాబాద్ ఒక స్టార్టప్ హబ్గా మారినందున, ఇక్కడి అపార మానవ సాంకేతిక వనరులతో ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ స్థానానికి దిశానిర్దేశనం చేయవచ్చు. కరోనా అనంతర ప్రపంచానికి భారతదేశం తన సాంస్కృతిక పునాదులతో కొత్త అభివృద్ధి నమూనా ఇవ్వాలి. గురూజీ రవీందర్ శర్మ లాంటి ఎందరో మహాపురుషుల జ్ఞాన సంపదను తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలను బలపరచాలి. ప్రతి తెలంగాణవాసి ఉడతా భక్తిని చాటుకోవాలి.
(వ్యాసకర్త: రైతు నాయకులు, ఎండీ, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ)
ఢిల్లీ వసంత్
81424 44345