Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన నాటి నుంచి భారీ వసూళ్లను నమోదు చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ రన్లో ఈ చిత్రం రూ.500 కోట్ల మార్క్ను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాపై కొనసాగుతున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లు, మల్టీప్లెక్స్ సంస్థలు ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ తాజాగా ‘పెద్ది’ టికెట్లపై “Buy 1 Get 1 Free” ఆఫర్ను ప్రకటించింది. పీవీఆర్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది.
అయితే ఈ ఆఫర్పై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రకటన చూసి టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించిన పలువురు ప్రేక్షకులు, బుకింగ్ చివరి దశలో అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అని ప్రచారం చేస్తున్నప్పటికీ, చెక్అవుట్ సమయంలో రెండు టికెట్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని నెటిజన్లు స్క్రీన్షాట్లతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ లేదా ఇతర చెల్లింపు పద్ధతుల వద్ద ఎలాంటి డిస్కౌంట్ కనిపించడం లేదని, పూర్తి టికెట్ ధరనే వసూలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఒకవేళ చెల్లింపు పూర్తయ్యాక ఒక టికెట్ మొత్తాన్ని రిఫండ్ చేస్తారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది.
దీంతో పీవీఆర్ ప్రకటించిన ఆఫర్ నిజంగానే అమలవుతోందా? లేక ఇది కేవలం మార్కెటింగ్ వ్యూహమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ఈ తరహా ప్రచారాలను మోసపూరిత ప్రకటనలుగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తొందరపడి బుకింగ్ చేయకుండా నిబంధనలు పూర్తిగా చదివిన తర్వాతే టికెట్లు కొనుగోలు చేయాలని ఇతర ప్రేక్షకులకు సూచిస్తున్నారు. మరోవైపు, కొన్ని టికెటింగ్ ప్లాట్ఫామ్లు మాత్రం పారదర్శకంగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా రెండు టికెట్లు బుక్ చేస్తే రూ.100 తగ్గింపు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రేక్షకులు ఏ ఆఫర్ నిజంగా లాభదాయకమో పరిశీలించి బుకింగ్ చేసుకుంటున్నారు.