మహాత్మా బసవేశ్వరుడు సర్వ సమానత్వమే శాంతికి మూలమని తెలిపిన మహనీయుడు. ఆధునికయుగంలోని భారత చట్టసభల్లో స్త్రీలకు, బీసీలకు రిజర్వేషన్ లేదు. కానీ, 12 శతాబ్దంలోనే మహిళా సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం, బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యతా నివారణ కోసం, మత ఛాందసవాదులను వ్యతిరేకించిన బసవేశ్వరుడు సమసమాజ స్థాపన కోసం కృషిచేశారు.
వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప భక్తుడు బసవేశ్వరుడు. లింగాయత్ ధర్మ సృష్టికర్త. విశ్వగురువు, మహా మానవతావాది, సంఘసంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణవ్యవస్థను రూపుమాపడానికి పూనుకున్న సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. క్రీ.శ.113 4లో ఆనందానామ సంవత్సరంలో నేటి కర్ణాటక బీజాపూర్ జిల్లా బాగేవాడిలో జన్మించారు. దురాచారాలు, స్వార్థపరుల సృష్టి వంటి వాటిపై సమరభేరి మోగించిన సాంఘిక విప్లవకారుడు బసవణ్ణ సర్వసమానత్వమే శాంతికి మూలమని ఉపదేశించారు.
జాతి, వర్గభేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చునని చెప్పిందే లింగాయత్ ధర్మం. బూజుపట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మొదటి సంఘ సేవకుడు బసవేశ్వరుడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీలి, మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త. తనకాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన చింతకుడు బసవణ్ణ, జగమెరిగిన శ్రేష్ఠ దార్శనికుడు, ముక్త సమాజపు వైతాళికుడు, సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని కాంక్షించారు. కష్టపడి పనిచేయాలని, నిరాడంబర జీవితం గడపాలని ఉపదేశించారు. వ్యక్తుల జీవితాలను సమాజ గమనాన్ని ప్రభావితం చేసేవిధంగా బసవన్న తన సొంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారు. అదే లింగాయత్ ధర్మం. సమాజ నిర్మాణంలో బసవేశ్వరుడి నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా స్ఫూర్తినిస్తూనే ఉన్నది. పరమ శివునికి ప్రతిరూపమైన ఇష్ట లింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని కులవ్యవస్థను అంతమొందించారు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్ట లింగాదరణ, ఇష్టలింగ పూజ. ఇదే బసవణ్ణ సూచించిన భక్తి మార్గం.
బసవేశ్వరుడి ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బసవేశ్వర జయంతిని అధికారికంగా ఏటా నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కోకాపేటలో బసవ భవన్ ఏర్పాటుకు రూ.10 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమకూర్చడం ముదావహం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లింగాయత్లను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నది. లింగాయత్లను ఓబీసీ జాబితాలో చేర్చకపోవటం అత్యంత బాధకరం. లింగాయత్లను కేంద్ర ఓబిసీ జాబితాలో చేర్చమని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేకసార్లు ప్రతిపాదనలు చేశారు.
ఆయన ఆదేశానుసారం లింగాయత్లతో పాటు 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నేను కేంద్ర బీసీ కమిషన్కు నివేదించాను. లింగాయత్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం గురించి మొరపెట్టుకున్నాను. ఓబీసీలో చేర్చడానికి అన్ని అర్హతలు లింగాయత్ సమాజానికి ఉన్నాయి. ఓబీసీ జాబితాలో లింగాయత్లను చేర్చకపోవటం వల్ల జాతీయస్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు.
బసవేశ్వరుడు తన ప్రవచనాలతో సనాతన ధర్మాన్ని బోధించారు. మనుషులందరూ ఒక్క టే, కుల, ఉపకులాల్లేవన్న బసవేశ్వరుని ఉపదేశాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. అప్పటికాలంలో బసవేశ్వరుడు ప్రజల వైపు నిలిచి, వారి అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు. నేటితరం రాజకీయ నేతలందరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడువాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
– శుభప్రద్ పటేల్ నూలీ 97010 69698