పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో చక్కని పాత్ర పోషిస్తున్నాయి. ఇక మన తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో 5000 గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. చదువడం, రాయడంలో వెనకబడి ఉన్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి పఠనోత్సవం పేరుతో
గ్రంథాలయాలను విరివిగా వినియోగించే ఏర్పాటు చేస్తున్నది.
2020- 21, 2021-22 విద్యా సంవత్సరాలు కరోనా ఉపద్రవానికి బలయ్యాయి. దీంతో పెద్ద తరగతుల్లో ప్రవేశించిన అనేకమంది విద్యార్థులకు కనీసం చదవడం (రీడింగ్), రాయడం (రైటింగ్) కూడా రావడం లేదు. లెక్కలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయం. ఈ సమస్య ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఉండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమమైన గుణాత్మక, సృజనాత్మక విద్యనందించి, వారిని విజ్ఞానవంతులుగా, విచక్షణ, వివేచన, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎసర్, మార్గ్ సర్వే 2022 వెల్లడించిన అంశాలను బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ తరగతుల్లోకి వచ్చిన విద్యార్థులకు సైతం తెలుగు, ఆంగ్లం చదువడం, రాయడం రావడం లేదు. దీంతో వాటిని పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అదేవిధంగా ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, సామాన్య, మధ్యతరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యనందివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం గతేడాది నుంచి విద్యాశాఖ ‘మన ఊరు-మనబడి’, ‘మనబస్తీ-మనబడి’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులతో పాటు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా (గ్రంథాలయం, రక్షిత మంచినీరు, లాబొరేటరీ, చక్కటి ఫర్నిచర్, కంప్యూటర్లు, డిజిటల్ విద్యకు కావలసినటువంటి పరికరాలు) విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 5000 పాఠశాలల్లో రీడింగ్ రూమ్స్ ఏర్పాటుచేసి విద్యార్థులకు అకడమిక్ పుస్తకాలే కాకుండా జనరల్ పుస్తకాలు (బొమ్మల పుస్తకాలు, స్టోరీ బుక్స్, కామిక్ బుక్స్, చిన్న చిన్న డిక్షనరీలు) దినపత్రికలు అందించాలని నిర్ణయించింది. నేషనల్ బుక్ట్రస్ట్, చిల్డ్రన్ బుక్ట్రస్ట్ వారి సహకారంతో ప్రతి గ్రంథాలయానికి 200 పైచిలుకు పుస్తకాలు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు (రూమ్ టు రీడ్ రూరల్ లైబ్రరీ ఫౌండేషన్, బ్రెడ్ సొసైటీ, బాల చెలిమి గ్రంథాలయాలు) కూడా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు, కనీస వసతులు కల్పిస్తూ విద్యార్థులకు చదివే అలవాటును పాదుకొల్పే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరం ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే అంశంతో పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు, చదివే అలవాటు, గ్రంథాలయానికి వెళ్లే అలవాటు చేయాలని ఉద్దేశంతో తెలంగాణ విద్యాశాఖ సర్కారు పాఠశాలల్లో జూన్ 26 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
అదేవిధంగా పాఠశాల కాల పట్టికలో రోజూ ఒక పీరియడ్ (గ్రంథాలయానికి ఒక గంట సమయం) ప్రత్యేకంగా కేటాయింపు జరుగుతున్నది. విద్యార్థులకు గ్రంథాలయాల్లో అకడమిక్ పుస్తకాలే కాకుండా పిల్లలను ఆలోచింపజేసే పుస్తకాలను, సామాజిక స్పృహ కలిగిన పుస్తకాలను, పుస్తకాలను చదివేవిధంగా ప్రేరేపించే పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థి సొంతంగా తన అకడమిక్ వర్కును చేసుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వినూత్నంగా అభ్యసించడం, సంక్లిష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే మానసిక స్థయిర్యాన్ని అలవర్చుకోవడం జరుగుతుంది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పఠనోత్సవ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల్లో గ్రంథాలయ కమిటీని ఏర్పాటుచేసి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చదివిన పుస్తకాలు తీసుకునేలా విద్యార్థులకు బాధ్యతలను ఉపాధ్యాయులు అప్పగిస్తారు. ప్రధానంగా పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు, పాఠ్యేతర పుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తాపత్రికలు వంటివి ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ఈ పఠనోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పూర్వ ప్రాథమిక విద్యార్థులు వర్ణమాల అక్షరాలను గుర్తించడం, 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను, వాక్యాలను ధారాళంగా చదువగలగడం, 3 నుంచి ఆపై తరగతుల విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలతో పాటు వారి స్థాయికి తగిన బాల సాహిత్యాన్ని, వార్తా పత్రికలను ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వం రీడింగ్ క్యాంపెయిన్ను చేపట్టింది. రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా పాఠ్యాంశాలు బోధించి విద్యార్థులందరూ ధారాళంగా చదువగలిగేలా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి తెలంగాణ గ్రంథాలయ సంఘం)
– రవికుమార్ చెగోని 98669 28327