తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇరవై నాలుగు స్థానాల్లో పదహారు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం విశేషం. మిగిలిన ఏడు స్థానాల్లో ఎంఐఎం పార్టీ, ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నా, గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ కృషిని ప్రధానంగా చెప్పుకోవాలి.
ఏపీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో జరిగిన నిరసనలపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ రక్షణ విషయంలో కేటీఆర్ వ్యవహరించిన తీరును సమర్థిస్తూ కుల, మత, ప్రాంతాలకతీతంగా నగరవాసులంతా ఏకమయ్యారు. నగరంలో కండ్ల ముందు జరిగిన అభివృద్ధివైపు మొగ్గు చూపి బీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు ఇచ్చారు.
హైదరాబాద్ను ప్రపంచ ప్రసిద్ధ్ది చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ విశేష కృషిచేశారు. నగరంలో వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఫ్లై ఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు ప్రజలకు సౌకర్యవంతంగా మారాయి. దుర్గం చెరువు వద్ద రూ.185 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వాహనదారులకు అత్యంత ఉపయోగకరంగా మారడంతో పాటూ నగర సౌందర్యానికే తలమానికంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో లక్షలాది మొక్కలు నాటడం జరిగింది. హైదరాబాద్ నగరంలో విస్తరించిన పచ్చదనానికి అనేక ప్రపంచ అవార్డులు వరించాయి. నగరంలో దెబ్బతింటున్న పర్యావరణానికి హరితహారం రక్షణ వలయం ఏర్పరచి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడే పరిస్థితులు కల్పించింది. ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా హైదరాబాద్ నగరంలో ఈ తొమ్మిదిన్నరేండ్లలో విద్యుదీకరణ జరిగింది. హైదరాబాద్లో ఇటీవల నిర్మించిన నూతన సచివాలయ భవనంతో పాటూ చారిత్రక చిహ్నాలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణాలు హైదరాబాద్ నగర సౌందర్యానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. వీటన్నింటి వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరాలకు దీటుగా తయారైంది. ఈ విషయాన్ని అనేక మంది దేశ,అంతర్జాతీయ ప్రముఖులు హైదరాబాద్ పర్యటనల సందర్భంలో వెల్లడించారు.
నగర సౌందర్యంతో పాటూ మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ లాంటి ప్రభుత్వ, ఆటో, క్యాబ్ లాంటి ప్రైవేటు రవాణా వ్యవస్థ హైదరాబాద్ నగరంలో చాలా పటిష్టంగా రూపుదిద్దుకున్నది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు అనువుగా ఉండే అనేక సరళీకృత విధానాలు కేటీఆర్ తీసుకువచ్చారు. పర్యవసానంగా హైదరాబాద్లో ప్రముఖ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా వేల సంఖ్యలో స్టార్టప్లు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నగర ఆదాయమే తెలంగాణ రాష్ర్టాభివృద్ధ్దికి కీలకం.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు పరిశ్రమల్లో ఇటీవల సుమారు ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి దొరికింది. కేటీఆర్ కృషి వల్ల హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ నాలుగు వందల శాతం అభివృద్ధి చెందింది. హైదరాబాద్లోని ఐటీ పరిశ్రమ ద్వారా సుమారు ఏడు లక్షల మంది ఉపాధి పొందారు. కేటీఆర్ ఐటీ పరిశ్రమకు ఆయువుపట్టుగా మారారు.
మహానగరంలో ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వారిలో దినసరి కూలీలు, చిన్నపాటి ఉద్యోగులు అధికంగా ఉంటారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా పట్టించుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలంతా గంపగుత్తగా బీఆర్ఎస్కు ఓటేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్లో మహిళలకు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మహిళల రక్షణకు నగరంలో ఏర్పరచిన పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ దానికి ప్రధాన కారణమని భావించవచ్చు. అశేష మహానగర ప్రజాభిమానం పొందిన కేటీఆర్ అభినందనీయులు.
-కైలసాని శివప్రసాద్
94402 03999