కేటీఆర్ అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక ఫైర్ బ్రాండ్. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన దార్శనికత కలిగిన నాయకుడిగా ఎదిగారు. పురపాలక, పంచాయతీ వ్యవస్థ పాలనను గాడిన పెట్టి సమర్థత కలిగిన పరిపాలకుడిగా నిరూపించుకున్నారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి మూలమని రుజువు చేశారు. న భూతో న భవిష్యత్ అన్న చందాన ఐటీ, ఇతర రంగాల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేసి తెలంగాణను పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దారు. పురపాలక శాఖ మంత్రిగా పట్టణాలు, నగరాల రూపు రేఖలను సమూలంగా మార్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ వ్యక్తి కాదు.. వ్యవస్థ! సమకాలీన రాజకీయాల్లో తెలంగాణకు ఆశా దీపం. ఆ మాటకొస్తే ఆయన దేశానికే ఒక ధృవ తారగా వెలగగలిగే నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎన్నో పోరాటాలు, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని యువతలో ధైర్యాన్ని నింపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన అనుమతులను జాప్యం లేకుండా సింగిల్ విండో ద్వారా 30 రోజుల్లో మంజూరు చేసే విధానాన్ని కేటీఆర్ అమలు చేశారు. టీఎస్-ఐపాస్ చట్టం ద్వారా పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారు. సమగ్రమైన ఐటీ విధానాన్ని తీసుకొచ్చి పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు. ఆయన రూపొందించిన టీఎస్-ఐపాస్ వల్ల గత 9 ఏండ్లలో 23,486 పరిశ్రమలు సులువుగా అనుమతులు పొందాయి. వీటిలో తయారీ రంగానికి చెందిన 21,210 పరిశ్రమలు, సేవా రంగానికి చెందిన 2,275 పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం రూ.2.65 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా 17,85,530 మందికి ఉపాధి లభించింది.
రాష్ట్ర మంత్రి హోదాలో ఆపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ సహా 30 ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపి రాష్ట్రంలో ఐటీ ఇతర రంగాల పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు తోడ్పడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న సానుకూలతలను కేటీఆర్ వివరించే తీరుపై దేశ వ్యాప్తంగా ప్రసార, సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం సిస్కో, ఒరాకిల్, కేపీఎంజీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, రిలయన్స్, అడోబ్ తదితర దిగ్గజ సంస్థల అధిపతులను కేటీఆర్ కలిసి సంప్రదింపులు జరపడం.. ఆయా కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలను, యూనిట్లను నెలకొల్పడం కేటీఆర్ కార్యదక్షతకు తార్కాణం. ఇలా సాఫ్ట్వేర్, బయో టెక్నాలజీ తదితర రంగాల కంపెనీలకు అవసరమైన స్థలాలు ఇతర సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రపంచ టెక్నాలజీ చిత్రపటంలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించింది.
రాష్ట్రంలో ఐటీ రంగ ఎగుమతులు 2014లో రూ.57,258 కోట్లు ఉండగా.. కేటీఆర్ కృషి వల్ల 2023 నాటికి 31.44 శాతం వృద్ధితో రూ.2.41 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఐటీ పరిశ్రమల వృద్ధి రేటు 9.36 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో 44 వేల మంది ఉద్యోగులు ఉండగా నేడు వారి సంఖ్య 9,05,715కు చేరింది. 2026 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు పైగా చేరుకొని రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు సాధించే సానుకూల ధోరణి
కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్రంలో మాత్రం ఈ పరిశ్రమ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంకు విస్తరించింది. తద్వారా ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీతో పాటు బల్క్ డ్రగ్స్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు, కంపెనీల యజమానులతో కేటీఆర్ పలు దఫాలు జరిపిన చర్చల ఫలితంగా ఔషధాల ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నది. రాష్ట్రంలోని జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్ విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించారు.
ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుండే తెలంగాణ యువతకు తగిన ఉపాధి కల్పించాలని, వారిని పారిశ్రామిక వేత్తలను చేయాలని కేటీఆర్ పరితపించేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన ఆలోచనలతో ‘టీ హబ్’ ఏర్పాటు చేసి స్టార్టప్ల స్థాపనను ప్రోత్సహించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యక్తిగత చొరవ తీసుకొని టీ హబ్ ద్వారా యువ, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఫలితంగా స్టార్టప్(అంకుర) కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. దేశీయ స్టార్టప్లను టీ హబ్ ముందుకు తీసుకెళుతుందని.. దాని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సందేశం ఇవ్వడం కేటీఆర్ కృషికి ఇచ్చిన చక్కని కితాబు. టాస్క్, సాఫ్ట్నెట్, ఫైబర్ గ్రిడ్, టి-యాప్ ఫోలియో, వీ హబ్, టీఎస్ఐసీ, టీ-వర్క్స్, టీ వ్యాలెట్, హై ఫై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియా 2020, తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్, మెడికల్ డివైసెస్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్-వరంగల్.. ఇలా రాష్ట్ర సాంకేతిక ప్రగతికి, ఉద్యోగవకాశాలకు చేయూతను ఇస్తున్న ఎన్నో పథకాలు, కార్యక్రమాలు కేటీఆర్ మానస పుత్రికలే. సీఎం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ పాలసీలను కేటీఆర్ చిత్తశుద్ధితో అమలు చేయడంతో 2014లో రూ.1.12 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2023 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగింది. జీఎస్డీపీ 5 శాతం నుంచి 13.27 శాతానికి చేరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 72 పురపాలక సంఘాలు ఉండగా వాటి సంఖ్యను కేటీఆర్ 141కి పెంచారు. హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించి పచ్చదనం పెంపొందించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో అద్భుతమైన ప్రగతి సాధించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. పట్టణాభివృద్ధి శాఖ 142 పుర పాలికల్లో గత తొమ్మిదేండ్లలో రూ.1.21 లక్షల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో కేంద్రం కేవలం 8.2 శాతం నిధులను ఇవ్వగా మిగతా నిధులను సీఏం కేసీఆర్ను ఒప్పించి కేటీఆర్ మంజూరు చేయించుకొన్నవి. ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఫ్లై ఓవర్లు, రోడ్లు, పార్కులు, దవాఖానలు నిర్మిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.7335 కోట్లతో 2 దశల్లో 744 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. 24 గంటల నీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల అభివృద్ధికి గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ) యస్.యన్.డి.పి(స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్) తదితర పథకాలు రూపొందించి సమర్థంగా అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వ శాఖలకు, నీతి ఆయోగ్కు వివరించి తగిన నిధులు ఇవ్వాలని కేటీఆర్ తరచూ విజ్ఞప్తి చేశారు.
నాయకత్వం, అంకిత భావం, పట్టుదల, కృషి వంటి విషయాల్లో తన తండ్రి కేసీఆర్కు కేటీఆర్ సరి తూగుతారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అగ్రనేతగా పార్టీ నిర్మాణంలో, పనితీరులో కేటీఆర్ ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో పర్యటించి 100 సభల్లో పాల్గొని అద్భుతమైన ప్రసంగాలు చేసి ఒంటి చేతితో పార్టీకి విజయాన్ని అందించారు. 2018 శాసన సభ ఎన్నికల్లో ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, ఆయన రచించిన వ్యూహాలు, ప్రచార ప్రసంగాలు పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయన చేసిన ప్రసంగాలు, నిరసనలు యువతలో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిల్చాయి. 2014 నుంచి నేటి వరకు రాష్ట్ర మంత్రిగా శాసనసభలో వివిధ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, ప్రశ్నోత్తరాల సమయంలో, జీరో అవర్లో జరిగిన చర్చల్లో ఆయన చూపిన వాక్పటిమ, ప్రసంగించే సరళి, ప్రతిపక్షాల విమర్శలకు ఇచ్చే ఘాటైన సమాధానాలు ఆయనను ఒక అనువజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా నిలబెట్టాయి.
కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్లో తమ ఆధిపత్యం కోసం డి లిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ర్టాలలో ఎంపీ సీట్లు తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకొనేందుకు జరుగుతున్న పోరాటానికి కేటీఆర్ నాయకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిధుల కేటాయింపులో గుజరాత్ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాల పట్ల కేంద్రం పక్షపాతం చూపడాన్ని మరింత గట్టిగా ప్రశ్నించాలి. మత రాజకీయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పార్టీలకు బుద్ధి చెప్పి దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. ఆనాడే నిజమైన ఫెడరలిజం వస్తుందన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన కోసం కేటీఆర్ తన వంతు కృషి చేయాలి. దేశ రాజకీయాల్లో సమూల మార్పులపైనా దృష్టి సారించాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఇనగంటి రవికుమార్
94400 53047