ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు.. ఉద్యమ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు..రాష్ట్ర మంత్రి.. అయినా అతనిలో ఈసమంతా గర్వం కన్పించదు. మాటిస్తే చాలు, ఆచరించి చూపెడతారు. ఆవేదన చెందుతున్న గుండెలకు ఆయన ఒక దివ్య ఔషధం. సరస్వతీ బిడ్డలకు కొండంత అండగా మారి పెద్ద సదువులకు ప్రోత్సాహాన్నిచ్చే అన్నగా తోడుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించే సక్కని గుణమున్న నాయకుడు. ప్రజా సేవనే అతనిని నేడు ప్రభావశీలిగా నిలబెట్టింది. ప్రపంచంలోనే భారతదేశం నుంచి ప్రభావశీలిగా కేటీఆర్ మొదటిస్థానంలో, ప్రపంచంలో 12వ స్థానం సంపాదించడం యావత్ తెలంగాణ జాతి గర్వించదగిన విషయం. ఒక ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే నిత్యం ప్రజాసేవ కోసం తపించే కేటీఆర్ లాంటి లీడర్ తెలంగాణలో ఉండటం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విద్యావ్యవస్థలో తీవ్రమైన వివక్ష ఉండేది. దీంతో ఎంతోమంది ప్రతిభావంతులు అధఃపాతాళానికి తొక్కివేయబడినారు. దీంతో పేద బిడ్డలు పెద్ద సదువులకు దూరమయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యావ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తున్నది. నేడు గురుకులాల ద్వారా అనేకమంది విద్యార్థులు జేఈఈ, ఎంబీబీఎస్, నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోనే అత్యధికంగా వైద్య, ఇంజినీరింగ్ నిపుణులను అందించడంలో తెలంగాణ ముందువరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు.
తెలంగాణలో ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ఒక భరోసా. ట్విటర్, పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే చాలు నేనున్నానంటూ వారికి అండగా నిలబడుతున్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగింది. అంతే, అక్కడి వాస్తవ పరిస్థితులను నేరుగా పరిశీలించి ‘మూడు నెలల్లో మళ్లీ వస్తా.. నేనొచ్చే లోపు మీ సమస్యలు లేకుండా చేస్తా’ అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అమలుచేసి చూపించారు. ఇలాంటి పనులే ఆయనకు అంతులేని అభిమానాన్ని సంపాదించి పెడుతున్నాయి. హైదరాబాద్ను, ఐటీని నేనే అభివృద్ధి చేశానంటూ ఇప్పటికీ చెప్పుకొని తిరిగే నాయకులున్నారు. కానీ, స్వరాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో నవ, యువ నాయకుడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజయవంతమయ్యారు. అయినా ఏ ఒక్కరోజూ తన గొప్పతనాన్ని తాను చెప్పుకోలేదు. ఆయనకు అంతర్జాతీయంగా పిలుపులు వస్తున్నాయంటే ఎంత నమ్మకం ఉంటే అలాంటి అత్యున్నత విదేశీ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయనేది అర్థం చేసుకోవాలి. పరిశ్రమల రంగంలో గుణాత్మకమైన మార్పునకు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో కేటీఆర్ విజయవంతమయ్యారు.
తెలంగాణ అంటే నాడు వెనుకబడ్డ ప్రాంతం. అందుకే బడా పరిశ్రమలు బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలకు తరలివెళ్లాయి. కానీ, ఇప్పుడు బడా, విదేశీ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో తమకు చోటు కావాలంటూ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, గూగుల్ లాంటి అత్యున్నతమైన సంస్థలకు హైదరాబాద్ ప్రధాన వేదికగా మారింది. దీనివెనుక ఉన్న మంత్రి కేటీఆర్ అవిరళ కృషిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఖండాంతరాలు దాటి, పలుదేశాల బడా పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నాయంటే మామూలు విషయం కాదు. అంతర్జాతీయ వేదికల సదస్సులో కేటీఆర్ మాట్లాడిన తీరే విదేశీ పెట్టుబడుదారులు ముందుకురావడానికి కారణమవుతున్నాయి.
గతంలో ‘ప్లగ్ అండ్ ప్లే’ ఫ్రాన్స్ పెట్టుబడి సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం గొప్ప విషయం. స్వయంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించి పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయ న పనితనానికి, నిబద్ధతకు నిదర్శనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ తదిర లక్ష్యాలతో పరిశ్రమల కారిడార్గా హైదరాబాద్ను కేటీఆర్ విశ్వవ్యాప్తం చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు.
నాడు ఆకలి, అణచివేత, ఆత్మగౌరవ పోరాటం నుంచి.. నేడు ప్రపంచదేశాల చూపును తెలంగాణ వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. తెలంగాణ సబ్బండ వర్ణాలు సంబురపడేలా నేడు ప్రపంచ స్థాయిలో దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. దీనివెనుక మంత్రి కేటీఆర్ కృషి ఉన్నదని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
ప్రత్యేక పోరాటంలోనైనా, స్వరాష్ట్ర అభివృద్ధిలోనైనా సవాళ్లను స్వీకరిస్తూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ఆధునికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ‘కేటీఆర్’.. దేశ యువతకు ఒక రోల్ మాడల్. హైదరాబాద్ను పరిశ్రమలకు కేరాఫ్ చేశారు. ఇటీవల జరిగిన లైఫ్సైన్స్ కార్యక్రమంలో పలుదేశాల ప్రముఖులు ‘తెలంగాణ ది గ్రేట్’ అన్నారంటే కేటీఆర్ గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
(వ్యాసకర్త:దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు సంపత్ గడ్డం, 78933 03516)