తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అనతికాలంలోనే కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, సాధించిన బహుముఖాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి ప్రపంచాన్ని ఆకర్షించాయి. విధానాల రూపకల్పనలో కేసీఆర్ ప్రత్యేక పంథాను అనుసరించడం వల్ల కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిలోనే పలు విదేశీ సంస్థలు తెలంగాణవైపు చూశాయి. అనేక దేశాలు, అంతర్జాతీయ వేదికల నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు ఆహ్వానాలు అందాయి. ప్రపంచ ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసే స్విట్జర్లాండ్లోని ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వాటిలో ఒకటి.
KCR | తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా విస్పష్టంగా చెప్పారు. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు అయోమయంలో, ద్రవ్యోల్బణం దిశగా పయనిస్తూ, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం అలా లేదని, నిలకడైన ఆర్థికాభివృద్ధితో దూసుకుపోతున్నదని సగర్వంగా ప్రకటించారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కూడా అత్యద్భుతంగా వివరించారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది.
‘భారతదేశంలో రాష్ర్టాలది కీలక పాత్ర. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు చాలా విధులు, నిధులు, అధికారాలు, బాధ్యతలు అప్పగించింది. గతంలో ఉండే ప్రణాళికా సంఘం స్థానంలో రాష్ర్టాలకు ఎక్కువ భాగస్వామ్యం కలిగిస్తూ నీతి ఆయోగ్ అనే వ్యవస్థ ఏర్పాటైంది. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండే నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రులందరూ సభ్యులు. దీన్ని మేము ‘టీమ్ ఇండియా’గా పిలుస్తున్నాం. నీతి ఆయోగ్ వేదికగా మేమంతా దేశ స్థూలాభివృద్ధికి, రాష్ర్టాల పురోగతికి కావాల్సిన కార్యాచరణను రూపొందిస్తాం. సమాఖ్య వ్యవస్థ కలిగిన భారతదేశం లాంటి దేశాల్లో రాష్ర్టాలది చాలా ముఖ్యమైన పాత్ర. మా రాష్ట్రం విషయాన్నే తీసుకుంటే, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇటీవలే ఏర్పడింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ మేము అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం.
దీనికోసం రాష్ట్ర శాసనసభలో చట్టం చేశాం. రెండు వారాల్లోనే పరిశ్రమలకు అనుమతులిచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. పెట్టుబడిదారులు పారిశ్రామిక అనుమతులు పొందడం మా రాష్ట్రంలో ఓ హక్కు. ఇప్పటికే ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలోనే 56 కంపెనీలకు అనుమతులిచ్చాం. వీటి ద్వారా దాదాపు రూ.12,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇది దేశాభివృద్ధికి దోహదపడే అంశం. రాష్ర్టాలు ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే దేశం ముందుకుపోతుంది. ఇది ప్రపంచానికి భారతదేశ వైఖరిని వెల్లడిస్తున్నది. భారతదేశం పెద్ద సంఖ్యలో వినియోగదారులున్న దేశం మాత్రమే కాదు, ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న దేశమని నేను కచ్చితంగా చెప్పగలను. మా దేశం చాలా నిలకడగా పురోగమిస్తున్నది. ఈ పయనం కచ్చితంగా ఇలాగే సాగుతుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్ను అభివృద్ధి పథంలో నడిపిన సంస్కరణాభిలాషి అయిన ప్రధానమంత్రి మాకున్నారు’ అని తన ప్రసంగంలో తెలిపారు.
1500 మంది ప్రతినిధుల సమక్షంలో, అతి తక్కువ సమయంలో, చాలా సూటిగా భారతదేశ ప్రగతిపథాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఎదుగుతున్న తీరును వివరించారు. తాను తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ పొరుగు దేశం వెళ్లినప్పుడు భారతీయ పౌరుడిలాగానే మెలగాలని నిర్ణయించుకుని, అందుకు తగ్గట్టుగా ఆయన వ్యవహరించారు. మన దేశం, తెలంగాణ గురించి మాత్రమే కాదు.. చైనా నుంచి మొదలుకుని ప్రపంచ దేశాల ఆర్థిక గమనం గురించి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తన ప్రసంగంలో భారతదేశ గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యాన్ని, పురోగతిని వివరించిన కేసీఆర్.. మంచి ఎక్కడున్నా స్వీకరించే గుణం తమకున్నదని చాటిచెప్పారు. చైనా నుంచి కూడా నేర్చుకుంటామనే సంకేతాలిచ్చారు. దేశంపై, ప్రపంచంపై తనకున్న అభిప్రాయాలను చెప్పే క్రమంలో కేసీఆర్ ఎక్కడా తొట్రుపాటుకు కానీ, మొహమాటానికి కానీ పోలేదు. ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
‘హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పిస్తున్నాం. అత్యుత్తమ పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నాం. అందుకు చాలా నిధులు ఖర్చు చేస్తున్నాం. భారత్ పెట్టుబడులకు అనువైన దేశం. మా దేశంలో ఎక్కడైనా, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ర్టానికి రావాలని కోరుతున్నాను. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన, అందుకు సరిపడా భూమి మా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నది. మా రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాన్ని మించినది ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పగలను. ప్రపంచంలో చాలా చోట్ల సింగిల్ విండో విధానాలు ఉన్నప్పటికీ, మా రాష్ట్రంలో వాటన్నిటికీ భిన్నంగా ఊచలు లేని (వితౌట్ గ్రిల్స్) ఏక గవాక్ష విధానం అమల్లో ఉన్నది. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతుల మంజూరులో జాప్యం జరిగితే సంబంధిత అధికారిదే బాధ్యత. వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. అనుమతులు పొందడం పారిశ్రామికవేత్తల హక్కుగా విధానాన్ని రూపొందించాం. నిర్దేశిత గడువులోగా కారణం చెప్పకుండా అనుమతులు ఇవ్వని పక్షంలో సంబంధిత పారిశ్రామికవేత్త అనుమతి లభించినట్టే భావించి ముందుకు సాగవచ్చు. భారత దేశానికి, తెలంగాణ రాష్ర్టానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాను. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని తన ప్రసంగాన్ని కేసీఆర్ ముగించారు.
దేశం అభివృద్ధి చెందడమంటే, ఆ దేశంలోని పేదల స్థితిగతుల్లో మార్పులు రావడం అని కేసీఆర్ ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సాక్షిగా తేల్చిచెప్పారు. ఆయిల్ ధరల్లో తగ్గుదల వచ్చినందున ఆ అవకాశాన్ని పేదల కోసం ఉపయోగించుకోవాలనే సందేశాన్ని కూడా కేసీఆర్ భారత ప్రభుత్వానికి పంపినట్టయింది. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే అభివృద్ధి లక్ష్యంగా మారాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పేద ప్రజల సంక్షేమం గురించి తెలంగాణ ఆలోచిస్తున్నదని, ప్రపంచం కూడా అలాగే ఆలోచించాలని కేసీఆర్ తేల్చిచెప్పారు.
(2015లో దాలియాన్ నగరంలో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్’ అంశంపై రాజనీతిజ్ఞతతో కూడిన కేసీఆర్ ప్రసంగం)
-వనం జ్వాలా నరసింహారావు
80081 37012