సరిగ్గా కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఓ రూపునిస్తున్న 2001లో.. నేను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన మొదటి బార్ అసోసియేషన్గా వరంగల్ నిలిచిన నేపథ్యంలో నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్తో నాకు పరిచయం ఏర్పడింది. సహచర న్యాయవాది, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ద్వారా కేసీఆర్ను కలుసుకున్నా.
మా స్వగ్రామం దామెర సర్పంచ్గా పని చేసిన నేను.. మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, ఆర్థిక నష్టాన్ని ప్రత్యక్షంగా చూశా. ఎదిరించిన యువకులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపడాన్ని చూసి చలించిపోయా. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ సమస్యలకు పరిషారమని భావిస్తున్న తరుణంలో.. తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాటాన్ని ప్రారంభించిన కేసీఆర్తో సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణ వెనుకబాటుకు గల కారణాలను విశ్లేషించడంలో, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో కేసీఆర్కు గల నేర్పును చూసిన తర్వాత నేనూ ఆయన అడుగులో అడుగేశాను. ఇప్పటికీ ఆయన చూపిన బాటలోనే ప్రయాణం కొనసాగిస్తున్నా.
ఆనాడు కరీంనగర్లో జరిగిన మొట్టమొదటి మీటింగ్లోనే టీఆర్ఎస్లో చేరా. ఆ సందర్భంగా ఒక ఇంగ్లిష్ పత్రికలో ‘కేసీఆర్ అమ్ములపొదిలో చేరిన మరో బాణం సహోదర్రెడ్డి’ అని వార్త వచ్చింది. దాన్ని నిజం చేసేలా రేయింబవళ్లు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యమ నిర్మాణంలో పాలుపంచుకున్నా. కేసీఆర్ మాటలకు ప్రభావితమై న్యాయవాద కార్యాలయాన్ని వరంగల్ జిల్లా పార్టీ ఆఫీసుగా మార్చేశా. పార్టీ ఏర్పాటైన తొలినాళ్లలోనే ఎదుర్కొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు కారు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. దీంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ న్యాయవాది సత్యంరెడ్డితో కలిసి పార్టీకి కారు గుర్తు దక్కేలా చేయడం కోసం కోర్టులో పోరాడాను. ఆ ఘటన నా జీవితంలో ఒక మధురానుభూతి.
నేను, దివంగత ప్రొఫెసర్ బియ్యల జనార్దన్రావు యువకులను వెదికివెదికి పార్టీలో చేర్పించేవాళ్లం. పెద్ది సుదర్శన్రెడ్డిని పార్టీలో చేర్పించింది మేమే. ఆనాటి సమైక్య పాలకుల కుట్రలను చేధించడం కోసం ఎందరెందరో తెలంగాణ అభిమానులు, మేధావుల సూచనలు, సలహాలను కేసీఆర్ స్వీకరించేవారు. ఆ క్రమంలోనే తెలంగాణ పట్ల అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డిలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఉద్యమ సమయంలో వారు చేసిన ప్రత్యక్ష, పరోక్ష సాయాన్ని తెలంగాణ సమాజం ఎన్నడూ మర్చిపోదు. అటువంటి పవిత్ర కార్యంలో నేనూ పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.
నా పట్ల అత్యంత ప్రేమ కలిగిన కేసీఆర్ పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించాలన్న నా సూచనను మన్నించారు. రూ.100 కోట్ల నిధిని సమకూర్చారు. ఆ ట్రస్టులో బాధ్యతలూ అప్పగించారు. నా కోరిక మేరకు మా స్వంత గ్రామం దామెరను మండలంగా ప్రకటించారు.
క్రమశిక్షణకు, పట్టుదలకు చిరునామా.. మిత్ర వాత్సల్యానికి పర్యాయపదంగా నిలిచే ఏకైక ప్రజా నాయకుడు కేసీఆర్. ఉద్యమం నాటి నుంచి నేటి ప్రతిపక్ష ప్రస్థానం వరకు అపజయాలకు కుంగిపోకుండా, విజయాలకు పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు కేసీఆర్. ఇప్పటికీ ఎకడ ఎదురైనా ‘సహోదరన్నా’ అని మనసారా నన్ను సంబోధించే కేసీఆర్ పలకరింపు నాకు ఒక పులకింత. ఒక గొప్ప అనుభూతి. కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
-ముద్దసాని సహోదర్రెడ్డి