చందమెఱిగి మాట జక్కగా చెప్పిన నెవ్వడైన మాఱి కేల పలుకు?చందమెఱిగి యుండు సందర్భమెఱుగుము
విశ్వదాభిరామ వినుర వేమ!
Telangana | ‘చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు. అంతేకాదు, ఒక వ్యక్తి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పొందగలుగుతాడు. పై పద్యంలో శతకకర్త వేమన సమస్త లోకానికి ఇదే చాటారు. ‘మాట’కున్న గౌరవమర్యాదలు అలాంటివి మరి.
ఏండ్ల తరబడి కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిపై పరుష పదాలను ప్రయోగిస్తూ దూషించడం అత్యంత ఖండనీయమే కాదు, హేయనీయం కూడా. అసలు ఆ పదానికి అర్థం తెలుసా రేవంత్రెడ్డికి అంటే తెలియకుండా ఆయన ఆ పదాన్ని వాడారని నేనైతే అనుకోవడం లేదు.
‘మాట’ ఒక సంపద వంటిది. భవిష్యత్తులో మనం ఒకవేళ కాలం చేస్తే.. మనం సృష్టించుకున్న సంపద వెంట రాకున్నా.. మనం మనుషులతో వ్యవహరించిన తీరు, మెదిలిన విధానం నలుగురిని పోగు చేస్తుంది. ఆ నలుగురే ‘శెభాష్’ అనేలా చేస్తుంది. సామాన్యుడి నుంచి మొదలు దేశంలోని అత్యున్నతమైన అధ్యక్ష పదవి అధిష్ఠించిన వ్యక్తులకూ ఇదే వర్తిస్తుంది.
ఒక వ్యక్తి ఎలాంటివాడైనా, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదైనా, గతం ఎంత క్రూరంగా, నీచంగా ఉన్నా, చుట్టూ ఎంతమంది మూర్ఖులున్నా… రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ప్రజలు ఆ వ్యక్తికి ఏదైనా ఒక ‘పదవి’ని అప్పగిస్తే ఆ ‘పదవి’ ఆయనకు వన్నె తెస్తుంది. బంగారు తాపడం అల్లుతుంది. ఆయన గతాన్ని చెరిపివేసి గొప్పగా, ఉన్నతంగా, హుందాగా సమాజానికి చూపెడుతుంది. తనకున్న విలువను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి చూపెడుతుంది. కానీ, ఆ వ్యక్తి వల్ల ఆ ‘పదవి’కే కళంకం వస్తే… పదవి కూడా సదరు మనిషిని ఛీత్కరిస్తుంది, ఛీ కొడుతుంది.
అందుకే అత్యున్నత పదవుల్లో ఆశీనులైన చాలామంది వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకులు ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడుతారు, హుందాగా వ్యవహరిస్తారు. ప్రజలు అప్పజెప్పిన పదవిని పరాచికం చేయరు, ఆ పదవిని అభాసుపాలు అంతకంటే చేయరు. అన్నింటికీ మించి ప్రజలను, తోటి నాయకులను పరుష పదజాలంతో దూషించరు, సాటి నాయకులుగా గౌరవిస్తారు. అలా వ్యవహరించని నాయకులు ఎంతటి పెద్ద పదవుల్లో ఉన్నా కాలగర్భంలో కలిసిపోతారు. అలా కలిసిపోయిన నాయకులను ఎంతో మందిని గతంలో చూశాం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే… ప్రపంచంలోని ఎన్నో పత్రికలు ‘ట్రంప్.. కంపు’ అనే హెడ్డింగ్ను లెక్కలేనన్ని సార్లు వాడాయి. అందుకే అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుడినే తమ దేశాధ్యక్షుడిగా ఒక్కసారికే పరిమితం చేశారు. ఇలా ఒక్కరిద్దరు కాదు, తన మాట దురుసుతనం, నోటిదూల వల్ల అధఃపాతాళానికి పడిపోయిన నాయకులు మన దేశ చరిత్రలో చాలామంది ఉన్నారు. మన దేశం చాలా గొప్పది. ఈ దేశంలో కేవలం ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడున్నాడు, ఏండ్ల తరబడి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులున్నారు.
‘మాట’ అధఃపాతాళానికి పడవేయడమే కాదు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షనూ నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దానికి ప్రత్యేక ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలంలో రథసారథి, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇచ్చిన ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అనే మాట (నినాదం) యావత్ రాష్ట్ర ప్రజలను కదిలించింది. ఢిల్లీ పెద్దల మెడలను వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసింది. విషయం లేని నాయకులు విష ప్రచారమే చేస్తారనడంలో అనుమానం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ కోవకు చెందినవారే. కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిని ‘రండ’ అని సంబోధించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నా.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని అంటారు మన పెద్దలు. ఈ ‘మాట’ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ‘మాట’ మనిషికున్న గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచుతుందనే తత్తం మన రేవంత్రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి దాదాపు రెండు నెలలు పూర్తికావస్తున్నా ఇంకా బోధపడకపోవడం బాధాకరం. తనను మాటలే ముఖ్యమంత్రిని చేశాయని భ్రమ పడుతున్న రేవంత్రెడ్డి ఆ మాట(పరుష పదజాలం)లే అధఃపాతాళంలో కూరుకుపోయేలా చేస్తాయనే విషయం తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏండ్ల తరబడి కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిపై పరుష పదాలను ప్రయోగిస్తూ దూషించడం అత్యంత ఖండనీయమే కాదు, హేయనీయం కూడా. అసలు ఆ పదానికి అర్థం తెలుసా రేవంత్రెడ్డికి అంటే తెలియకుండా ఆయన ఆ పదాన్ని వాడారని నేనైతే అనుకోవడం లేదు.
ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను నోటికి ఎంతవస్తే అంత, ఇష్టానుసారంగా పరుష పదాలతో దూషిస్తూ రాష్ట్రంలో రేవంత్రెడ్డి విళయతాండవం సృష్టిస్తుంటే, ‘రైతుబంధు’ ఇంకా పడలేదని ప్రశ్నిస్తున్న రైతులను చెప్పులతో కొడతామంటున్నారు తన మంత్రివర్గంలోని మంత్రులు. ఇదెంతటి విషాదం? వీళ్ల మాటలు వింటున్న రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే ఈసడించుకోవటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకుల నోళ్లకు ముకుతాడు వేసే సమయం ఆసన్నమైందని ఒక నిర్ధారణకు వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఒకటి. అలాంటి దేశంలో పూర్వీకులు మనకు ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థను అప్పగించారు. అది అలాగే మన భవిష్యత్తు తరాలకు అందించాలే కానీ, దాన్ని కలుషితం చేస్తూ, మలినం చేసి అప్పగిస్తే మన దేశం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. దీనిద్వారా మన యువతకు ఏం సందేశం ఇస్తున్నామో తెలుసుకోవాలి.
వాచాలత ప్రజలను చలింపజేస్తుంది. దురుసుతనాన్ని సమాజం దూరం కొడుతుంది. అందుకేనేమో నోటిదూల దుల్దుమ్మతో సమానం అంటారు పెద్దలు. నోరుంది కదా నేను ఎంతయినా మాట్లాడుతానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాగాడంబర ఆడంబరానికి స్వస్తి చెప్తారు. ఆ పరిస్థితిని కోరి తెచ్చుకోకుండా హుందాగా వ్యవహరిస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంచిది. లేకుంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: మాజీ పార్లమెంట్ సభ్యులు,రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు)
-బోయినపల్లి వినోద్కుమార్