ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయగా ఇద్దరు ఎంపీలు, ఎనిమిది మంది శాసనసభ్యులు ఓటమి పాలైనారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎంతో మహా కూటమిని ఏర్పరిచి పోటీచేయగా కేవలం ఇద్దరు ఎంపీలు, పది మంది శాసనసభ్యులే గెలిచారు. కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ ఉద్యమకారులలో నైరాశ్యానికి కారణమైనాయి. కేసీఆర్, టీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంత ఆందోళనకు గురై దీర్ఘకాలిక ప్రయాణానికి, పార్టీ పటిష్ఠతకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది.
సరిగ్గా అదే సమయంలో మరో రెండు పరిణామాలు సంభవించాయి. అప్పటి సీఎం వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్లో చేపట్టే పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 (ఎఫ్) సక్రమమేనని కోర్టు తీర్పునివ్వడం తెలంగాణ ప్రాంత ఉద్యోగులను ఉద్యమబాట పట్టేలా చేసింది. ఈ రెండు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం సరికొత్త ఎత్తుగడలను రూపొందించారు. ఆనాటికే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పరుచుకొని సంఘటితశక్తిగా ముందుకొచ్చిన ఉద్యోగులనే.. లక్ష్యసాధన కోసం సాగుతున్న సమరంలో ‘పాశుపతాస్త్రం’గా భావించారు. వారితో అవసరమైన సంప్రదింపులు జరిపి సిద్దిపేటలో ఉద్యోగగర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. 2009 అక్టోబర్ 10న జరిగిన ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యోగులు భార్యాపిల్లలతో సహా తరలివచ్చారు. ఉత్తేజపూరిత వాతావరణంలో ఉద్విగ్నంగా జరిగిన ఈ సభలో కేసీఆర్ పాటు స్వామి అగ్నివేశ్, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అని ఈ సభలోనే కేసీఆర్ ప్రకటించారు. వేదికపై ఉన్న స్వామిగౌడ్, సి.విఠల్, దేవీప్రసాద్, శ్రీనివాస్గౌడ్ తదితర ఉద్యోగ సంఘాల నేతలకు ఆ రోజే అర్థమైంది. ఇక ఆఖరి పోరుకు సిద్ధపడాలని!
ఈ సభ ఊహించిన దానికన్నా ఎక్కువగా విజయవంతమైంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ‘ఆమరణ నిరాహార దీక్ష’కు సంసిద్ధమైనారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోకి పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులను సమీకరించాలని నిర్ణయించారు. అప్పటికి అన్నిజిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులను దశలవారీగా తెలంగాణ భవన్కు రప్పించి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని వారిలో కలిగించారు. 2007 ఆగస్టు 11 నుంచి ప్రారంభమైన విద్యార్థుల శిక్షణా తరగతులు డిసెంబర్ 29న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట నిర్వహించిన ‘విద్యార్థి గర్జన’ సభతో ముగిశాయి. వేలాదిమంది విద్యార్థుల్లో కలిగిన తెలంగాణ సోయి ఉద్యమ జ్వాలలై రగిలి ఆకసానికి ఎగిసే విధంగా కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేశారు. రోజుల తరబడి విద్యార్థులతో చర్చించారు. తన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ రంగాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఎవరెవరు ఏమేం చేయాలో కొన్ని వారాల ముందే ఆచరణాత్మక ప్రణాళిక సిద్ధమైంది. నవంబర్ 21వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. తెలంగాణకు గుండెకాయ వంటి సిద్దిపేటలో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు ముహూర్తం నిర్ణయించబడింది. సరిగ్గా నెల కిందట సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో కేసీఆర్ యథాలాపంగా అన్నారో, స్థిర చిత్తంతో ప్రకటించారోగానీ చావునోట్లో తలపెట్టడానికే ఆయన సిద్ధపడ్డారు. ముందురోజు నవంబర్ 28న కరీంనగర్ చేరుకున్న కేసీఆర్ ఆచార్య జయశంకర్తో కలిసి నవంబర్ 29 ఉదయం సిద్దిపేటకు కారులో బయల్దేరారు. వందలాదిగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ను అనుసరించారు.
కేసీఆర్ కారు అల్గునూర్ చేరగానే పెద్ద సంఖ్యలో పోలీసులు అడ్డుగా వచ్చి కాన్వాయ్ని ఆపి దౌర్జన్యంగా కేసీఆర్ను కారులో నుంచి బయటికి లాగి పోలీసు వాహనంలో కూర్చోబెట్టారు. ఆచార్య జయశంకర్ను అక్కడే దించేసి కారులో ఉన్న ఇతర నేతలు, మాజీ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జి.విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తదితరులను హుజూరాబాద్ మీదుగా ఖమ్మంకు తరలించారు.
కేసీఆర్పై పోలీసుల దౌర్జన్యాన్ని, ఆయన అరెస్టును తెలంగాణ విద్యార్థి లోకం, ప్రజానీకం ఏ మాత్రం సహించలేదు. ఉస్మానియా విద్యార్థులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కళాశాలల్లోంచి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఆవేశంతో రగిలిపోతూ కేసీఆర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి కార్యాలయాల్లోంచి బయటికివచ్చారు. ఆర్ట్స్ కళాశాల ముందు బాల్క సుమన్తో పాటు పలువురు విద్యార్థి నేతలపై లాఠీలు విరిగాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ చల్లుకొని నిప్పంటించుకొని సజీవంగా దహనమవుతూ ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. టెలివిజన్ ఛానెళ్ళలో ఈ దృశ్యాలను చూసిన తెలంగాణ ప్రజలు కోపంతో రగిలిపోయారు. శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని రోశయ్య ప్రభుత్వం పథకం వేసుకున్నదని టీఆర్ఎస్ నాయకులకు అర్థమైంది. ఒంటి మీద లాఠీలు విరుగుతున్నా బాల్క సుమన్, లింగస్వామి, మంగేష్ వంటి విద్యార్థి నాయకులు ఎంతో ఓపికతో ఆ బాధను భరించారే తప్ప పోలీసులపై తిరగబడలేదు. తనపైనే పెట్రోల్ చల్లుకొని శ్రీకాంతాచారి ఆత్మాహుతికి తలపడ్డాడే తప్ప ఏ ప్రభుత్వ వాహనాన్ని కాల్చడానికి ప్రయత్నించలేదు. కేసీఆర్ను వరంగల్ మీదుగా ఖమ్మంకు తరలించినప్పుడు దారి పొడవునా ప్రజలు ఎంతో సంయమనం పాటించారు. ఖమ్మంలో కేసీఆర్ విడుదల కోసం డిమాండ్ చేస్తూ ప్రజలు ముఖ్యంగా న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేస్తూ రోడ్డుపై కూర్చున్నారే తప్ప హింసకు దిగలేదు. 2001లో టీఆర్ఎస్ స్థాపన నాటి నుంచి కేసీఆర్ ఉద్యమాన్ని గాంధీజీ బాటలో అహింసాయుతం గా ముందుకు నడిపించాలని సంకల్పించారు. ఇదే రీతి లో.. ఆయన అరెస్టు సందర్భంగా తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తినా కొన్ని సంఘటనలు తప్ప ఎక్కడా ఉద్యమకారులు ‘అహింసా’ మార్గాన్ని వీడలేదు.
కేసీఆర్తోపాటు పది మంది టీఆర్ఎస్ నేతలను ఖమ్మం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి 14 రోజుల జ్యుడిషల్ రిమాండ్కు తరలించారు. కేసీఆర్ జైలులోనే ఆమరణదీక్షను కొనసాగించారు. ఆయన ఆహారం ముట్టకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించిన అధికారులు.. కేసీఆర్ను 24 గంటలు ప్రత్యే క వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలని నిర్ణయించారు. అప్పటికి జైలులో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోని హాస్పిటల్ బ్లాక్కు కేసీఆర్ను తరలించారు. ఇతర నాయకులను మరో బ్లాకులో ఉంచారు.
తెలంగాణవ్యాప్తంగా కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా పలు ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షా శిబిరాలు మొదలైనాయి. సెల్ టవర్లపైకి మహిళలు ఎక్కి కేసీఆర్ అరెస్టు పట్ల తమన నిరసనను తెలిపారు. హోటళ్లు, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఉద్యోగులు ‘పెన్డౌన్’ చేశారు. కేసీఆర్తో సహా 2,167 మంది తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు.
నవంబర్ 29 తర్వాత తెలంగాణ ఉద్యమం అన్ని జిల్లాల్లో కార్చిచ్చులా వ్యాపించింది. మరునాడు (30న) జరిగిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. భారతీయ జనతా పార్టీ, సీపీఐ (ఎం.ఎల్-న్యూ డెమోక్రసీ) బంద్కు మద్దతు ప్రకటించాయి. కేసీఆర్ దీక్షను ఆపాలని పోలీసులు చేసిన కుట్ర విఫలమైంది. డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణపై ప్రకటన చేసేదాకా కేసీఆర్ ఆమరణ దీక్ష అప్రతిహతంగా కొనసాగింది. ఈ విధంగా నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
(వ్యాసకర్త: వి.ప్రకాశ్, 95539 55304, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)