2014 వరకు ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. సరైన వసతులు లేక రాష్ట్రవ్యాప్తంగా రోగులు నానా అవస్థలు పడేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో సర్కారు దవాఖానలు కొత్తరూపు సంతరించుకుంటు న్నాయి. దీంతో ఆ దవాఖానలు సామాన్య రోగులకు పెద్ద భరోసాను కల్పిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే ఆ భరోసాకు తాజా ఉదాహరణ. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 76.3 శాతం పెరిగి రికార్డు నమోదును సృష్టించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ వల్ల 13 లక్షల మందికిపైగా మహిళలు లబ్ధి పొందారు. సాధారణ ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ముదావహం. 76.3 పెరగడమంటే తెలంగాణ వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
పరాయి పాలనలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే ఎన్నో ఇబ్బందులుండేవి. ప్రసవం కోసం దవాఖానకు పోతే కనీస సౌకర్యాలు లేక గర్భిణులు నానా యాతనలు పడేవారు. ఎంతోమంది బాలింతలు, పుట్టిన పసిపాపలు మరణించిన సంఘటనలున్నాయి. ప్రైవేటు దవాఖానకు పోతే ప్రజలను లక్షల్లో దోచుకునేవాళ్లు. అయినా అప్పటి ప్రభుత్వం చూస్తూ మిన్నకుండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వైద్యరంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పీహెచ్సీ నుంచి మండల, జిల్లా దవాఖానలతో పాటు రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి దవాఖానలో పరికరాలు, మందులు, పరీక్షలు చేసే ల్యాబోరేటరీలు ఏర్పాటుచేశారు. సాధ్యమైనంత మేర గర్భిణులకు సాధారణ ప్రసవం అయ్యేలా అన్నిరకాల వైద్య సేవలందిస్తున్నారు.
కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంతటి భయంకర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గర్భిణులకు, పుట్టిన పసిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తగా వైద్యసేవలందించింది. అందుకే తెలంగాణలో ప్రభుత్వ వైద్యానికి ఆదరణ పెరుగుతూనే ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం బాలింతలకు అందిస్తున్న బృహత్తరమైన పథకం ‘కేసీఆర్ కిట్’. ఈ కిట్ నవజాత శిశువులకు మంచి బహుమంతి వంటిది. ఇదిలా ఉంటే ఆర్థికమంత్రి హరీశ్రావు వైద్యారోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు మరింత మెరుగయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్రావు నిత్యం వైద్యారోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, రాష్ట్రంలో పలు దవాఖానల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. కొన్నిరోజుల్లో మరో 9 వైద్య కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాల్లో వైద్య కళాశాల సంఖ్య 26కు చేరుకోనున్నది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళా కార్యక్రమం’ ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే 2 లక్షల 78 వేలకుపై మహిళలకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యం పట్ల ఉన్న మమకారాన్ని చూపెట్టుకున్నది. మొత్తంగా రాష్ర్టాన్ని ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణగా మార్చే క్రమంలో విజయపథంగా ముందుకు సాగుతున్నదనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
చిటుకుల మైసారెడ్డి
94905 24724