ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే నీరు కరెంటు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, కమ్యూనికేషన్స్ రంగాలదే కీలకపాత్ర. ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరసలో ఉన్నది. చెడగొట్టడం, కూలగొట్టడం చాలా సులువు. పునర్నిర్మాణం చాలా కష్టం. తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ జేబులో నుంచి ఇచ్చింది కాదు. లక్షల మంది చేసిన పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. స్వరాష్ట్ర సాధన కోసం ఎగిసిపడిన మంటలకు కేంద్రంలో నాడు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ తప్పనిసరిగా ప్రకటించవలసిందే. తెలంగాణ ఎవరి భిక్ష కాదు.
తెలంగాణ వచ్చింది మొదలు గత తొమ్మిదేండ్లలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటే జరిగిన అభివృద్ధి కనపడుతుంది. 10 జిల్లాలున్న తెలంగాణ నేడు 33 జిల్లాలైంది. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య బాగా పెరిగింది. పట్టణాల సంఖ్య పెరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పెరిగాయి. తొమ్మిదేండ్లలో ప్రజాప్రతినిధుల సంఖ్య మూడింతలు పెరిగింది. అధికారుల సేవలు ప్రజలకు దగ్గరైనయి. ప్రభుత్వం ప్రజల చేరువలోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దగ్గరయ్యాయి. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ ఆఫీసులు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. దేశంలోనే వరంగల్లో అతి పెద్దగా నిర్మిస్తున్న కాళోజీ నారాయణరావు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటుగా జిల్లాకో మెడికల్ కాలేజీ, హైదరాబాద్లో నిర్మిస్తున్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నూతన సచివాలయ భవన నిర్మాణం. 24 గంటలు శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నిర్మించిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్.. ఇవన్నీ తొమ్మిదేండ్ల అభివృద్ధి పనులు కావా? ఇవన్నీ తెలంగాణ ప్రజల కోసం చేసినవి కావా?
2014కు ముందు అధ్వాన్న దశలో ఉన్న తెలంగాణను, నేడు వైభవంతో వెలిగిపోతున్న తెలంగాణతో ప్రజలు పోల్చి చూసుకోవాలి. మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలతో భూగర్భ జలాలు పెరిగినయి. అటవీ సంపద పెరిగింది. తొమ్మిదేండ్ల తెలంగాణలో మతకలహాల్లేవు. పల్లెప్రగతితో పల్లెలు ఆహ్లాదంగా ఉన్నాయి. రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలతో గ్రామస్థులకు మేలు జరగలేదా? ఆసరా పథకంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు మేలు జరుగుతున్న విషయం మరిచిపోతున్నారా? హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొన్న మాట అబద్ధమా? ఫ్లై ఓవర్లు, స్కై వేలు, అండర్పాసుల వల్ల ట్రాఫిక్ రద్దీ తొలగిపోయిన మాట వాస్తవం కాదా? మెట్రోరైల్ విస్తరణ పనులు కనబడటం లేదా?
చెప్పుడు మాటలు, తప్పుడు ప్రకటనలు చూస్తే మొదటికే మోసం వస్తుంది. మోసపోతే గోస తప్పదు. అందుకే తప్పుడు మాటలను వినొద్దు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి గర్వపడాలి కానీ, ఇంతకన్నా గొప్పగా మరేదో జరగబోతుందని అనుకున్నపుడు ప్రస్తుత తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది. మనకు మనమే నష్టపోతాం.
కన్నోజు మనోహరాచారి
79950 89083