2020, జూన్ 28వ తేదీన పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న ‘జ్ఞానభూమి’లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగ సారాంశం.
PV Narasimha Rao | పీవీ నరసింహారావు గురించి ఇదీ, అదీ అని చెప్పడానికి సాహసం కావాలి. ఆయన ఏది కాదో చెప్పలేని పరిస్థితి, పీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 380 డిగ్రీల పర్సనాలిటీ ఆయనది. ఆయన అంత అద్భుతమైన వ్యక్తి, అంతే అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన వ్యక్తిత్వ పటిమ.. ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ. ఆయన గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అతనొక గొప్ప సంస్కరణశీలి… నిరంతర సంస్కరణశీలి. ఒక నాయకుడిగా సంస్కరణలు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. వాటివల్ల వచ్చే విమర్శలను తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి. సంస్కరణలకు నిలువెత్తు రూపం పీవీ. పీవీ ఏ రంగంలో, ఏ స్థానంలో ఉన్నా అక్కడ సంస్కరణలు తేవడమే ఆయన పని. అందుకే సంస్కరణశీలి అనే మాటకు పీవీ సరైన వ్యక్తి.
రాష్ట్రంలో పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్లో రెసిడెన్షియల్ స్కూల్ను స్థాపించి గురుకుల విద్యకు ఆయన నాంది పలికారు. మన డీజీపీ మహేందర్రెడ్డి సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు.. ఇలా ఎంతోమంది రత్నాలను సర్వేల్ స్కూల్ తయారు చేసింది. పీవీకి ఆ తర్వాత కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. అప్పటి వరకు ఆ శాఖ పేరు విద్యా శాఖగా ఉండేది. ఈ పేరు సరైంది కాదని చెప్పి, ఆ శాఖ పేరును హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖగా ఆయన మార్పించారు. ఆ తర్వాత హెచ్ఆర్డీ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఓ సందర్భంలో పీవీకి జైళ్ల శాఖ అప్పగించారు. అక్కడ కూడా సంస్కరణలు చేపట్టి ఓపెన్ జైల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వ పటిమ అలాంటిది. ఆయన తీసుకొచ్చిన గురుకుల విద్య.. నేడు విద్యావ్యవస్థకే తలమానికంగా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా పీవీ ఆశయం కోసమే కొత్తగా 900 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయం కోసం తీసుకొచ్చిన గురుకులాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బోర్డు పరీక్షల్లో 99.9 శాతం, కొన్నిచోట్ల 100 శాతం ఫలితాలు వస్తున్నాయి. ఇది పీవీ చూపించిన బాట.
పీవీ నరసింహారావు ఇంగ్లిషులో కొత్త సామెతను తీసుకొచ్చారు. తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశాలను పట్టించుకోని ప్రపంచానికి ‘లుక్ టు ఈస్ట్’ అని పిలుపునిచ్చారు. ఎంతసేపు మీరే కాదు.. ఈస్ట్లో కూడా గొప్పగొప్ప సంస్కరణలు జరుగుతున్నాయి. మాకు చరిత్ర ఉన్నది. సంస్కృతి ఉన్నది. గొప్ప వైవిధ్యం ఉన్నదని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచమంతా ఈస్ట్ వైపు చూసేలా చేసిన వ్యక్తి పీవీ, ఇది ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. ఆ విధంగా చెప్పడానికి భయపడేవారు. కానీ, పీవీ తాను నమ్మిన వాదానికి కట్టుబడి ఉండేవారు. దానికి అనుగుణంగానే చెప్పవలసిన దాన్ని ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పేవారు. ఇదే ఆయన్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది.
ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సంస్కరణలు చేసే పీవీ, ఏపీ ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో భూ సంస్కరణలు చేశారు. ఈ సంస్కరణలు ఆయనతోనే, ఆయన కుటుంబంతోనే ప్రారంభించారు. అప్పటికే ఆయన స్వయంగా పెద్ద భూస్వామి. 1200 ఎకరాల ఆసామి. భూసంస్కరణల్లో భాగంగా ఆయనకు, ఆయన కుటుంబానికి అర్హత ఉన్నంతవరకు 100 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని, మిగిలిన భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పగించినటువంటి మహోన్నత వ్యక్తి. ఇది మామూలు విషయం కాదు. అదే ఈ రోజుల్లో అయితే మాయా మశ్చీంద్ర చేసి, ఏదో చేసి ఓ పదెకరాలు ఇచ్చి తప్పించుకుంటరు. కానీ, పీవీ అలా కాదు. అందుకే ‘పీవీ మన తెలంగాణ ఠీవీ’ అని అంటున్న. తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి లక్షణం. అది పీవీగారిలో పుష్కలంగా ఉన్నది. ఆయన ఆచరించి చూపారు. జాగీర్దారు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను ఆయన స్వయంగా చూశారు. దానినుంచి ఎంతో నేర్చుకున్నారు. దీని ఫలితమే ఆయన చేపట్టిన భూసంస్కరణలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. దీనికి ఆద్యులు.. కారణభూతులు పీవీనే అని చెప్పకతప్పదు. పీవీ చెప్పడమే కాదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం చేరేవరకు పటిష్టంగా అమలుపరిచారు. ఇదీ మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర.
పీవీ ప్రధాని అయ్యేనాటికీ దేశ గమ్యం అంధకారమై ఉన్నది. మన బంగారాన్ని ఇతర దేశాల బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న సందర్భం అది. అలాంటి క్లిష్ట సమయంలో పీవీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయనేమీ ముఠాలు కట్టి, ఇంకోటి చేసి ప్రధాని పదవి సాధించుకోలేదు. ఆయనకు వరించి వచ్చిన అవకాశం అది. దాన్ని కూడా ఆయన ఎంత గొప్పగా చేశారో మనకు తెలుసు. అప్పటివరకు రాజకీయాల్లో లేనటువంటి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ఆర్థికమంత్రిని చేసి, ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. మనం ఇప్పుడు అందరం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ, పొందినటువంటి ఆర్థిక పరిణతికి ప్రధాన కారణభూతుడు పీవీ నరసింహారావు. భారతదేశం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదిగిందంటే అది ఆయన చలవే. పబ్లిక్ సెక్టార్ల మీద పోటీతత్వం పెరిగిందంటే, ప్రైవేట్ రంగం ప్రభుత్వరంగంతో, ప్రభుత్వరంగం ప్రైవేట్ రంగంతో పోటీపడే ఆర్థిక సృజన జరిగిందంటే దానికి ఆద్యుడు పీవీనే.
ప్రపంచం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. కాబట్టి సంస్కరణలు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఈ భూమ్మీద మనుషులు జీవించి ఉన్నంతకాలం సంస్కరణలు జరుగుతూ ఉండాల్సిందే. పరిస్థితులను బట్టి ఎప్పుడు, ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి. అది అభ్యుదయవాదుల ఆలోచనా సరళి. పీవీ గొప్ప అభ్యుదయవాది కాబట్టే నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారు. ఆ కాలానికి, ఆ పరిస్థితికి ఏ సంస్కరణ అవసరమో అర్థం చేసుకొని, చదివి ఇతరులకు నేర్పి.. అందరినీ ఒప్పించి సంస్కరణలను అమలు చేసిన గొప్ప వీరుడు. పీవీ ఎవరికీ భయపడకుండా తనకు అర్థమైతే.. తనకు పూర్తిగా నమ్మకం కలిగితే ఆ సంస్కరణను అమలు చేస్తారు. అలా ఆయన నాడు చేసిన సంస్కరణలే నేడు ఫలితాలిస్తున్నాయి.
తన గ్రామం నుంచి రాష్ట్రం, దేశం.. మొత్తం ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి పీవీ. అలాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సినంత గౌరవం లభించలేదు. ఇందుకు అనేక కారణాలు న్నాయి. ఇది సందర్భం కాదు కాబట్టి రాజకీయాల్లోకి పోదల్చుకోలేదు. ఆయనకు చేయాల్సిన వారు చేయకపోవడం వల్ల మనం మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన బిడ్డ పీవీ పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం.
పీవీ ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక. ఆయనకు కుల బలం లేదు. గొప్పగా ధన బలం లేదు. మరి ముఖ్యమంత్రి ఎట్లయ్యారు? కేంద్ర మంత్రి ఎట్లయ్యారు? ప్రధానమంత్రి ఎట్లయ్యారు? ఆయన ముఠాలు గట్టే వ్యక్తి అసలే కాదు. ఆయన జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా అలాంటి పార్శ్వమే కనిపించదు. తనపై తనకుండే ఆత్మవిశ్వాసం, తాను సముపార్జించుకున్న విజ్ఞానం, అనుభవమే ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. అన్నింటినీ మించి ఇందిరాగాంధీ వంటి నాయకురాలు క్లిష్ట సమయంలో పిలిచి మాట్లాడే స్థాయికి ఎదగడంతో పాటు ఆమె అంతరంగికుల్లో ఒకరిగా ఎదిగే స్థాయి ఆయనకు వచ్చిందంటే ఆయనకు గల వాక్శుద్ధి. చిత్తశుద్ధే అందుకు కారణం.
పీవీ అంతర్ముఖుడిగా ఉంటారు. కానీ, ఆయన అంతర్ముఖుడు కాదు. అలా అయితే 17 భాషలు ఎలా నేర్చుకుంటారు? ఆయన ఎక్కువగా మాట్లాడరు.. అంతేకానీ ఆయన మాట్లాడితే మాత్రం సరస్వతీదేవి నాట్యం చేసినట్టే ఉంటుంది. ఓయూలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారని నాటి నిజాం ఉస్మానియా నుంచి పీవీని బహిష్కరించారు. తన రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దని ఆదేశించారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు పోయి యూనివర్సిటీలో సీటు సంపాదించుకొని చదువుకున్నారు. చదువుకోవడమే కాదు, గొప్పగా మరాఠీ భాష కూడా నేర్చుకున్నారు. మరాఠీ నవలలను తర్జుమా చేసేంత, అనర్గళంగా ప్రసంగించే శక్తి సంపాదించారు.
పీవీ ఓ గొప్ప విద్యార్థి. ఆయనకు వయస్సుతో నిమిత్తం లేదు. ఆయనకు ఎలాంటి హద్దుల్లేవు. ఆయన అనుకున్నారంటే నేర్చుకోవాల్సిందే. అలా కాకపోతే 17 భాషలు ఎలా వస్తాయి? ఒక భాష నేర్చుకోవడానికి మనకు తలపానం తోకకు వస్తది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీతో మాట్లాడుతూ… ‘రాబోయేదంతా కంప్యూటర్ యుగమండి.. కచ్చితంగా గ్లోబ్ను కంప్యూటరే డామినేట్ చేస్తది. కానీ ఈ ముసలివాళ్లతోనే చిక్కొచ్చి పడింది. వీళ్లు మార్పును స్వాగతించరు. మారరు’ అని అన్నరు. దీంతో పీవీకి కోపం వచ్చి వెంటనే ఆయన కూతురు వాణికి ఫోన్ చేసి నీ కంప్యూటర్ పట్టుకొని సాయంత్రం విమానానికి రమ్మన్నారట. ఆ విధంగా వేగంగా కంప్యూటర్ నేర్చుకొని జీవితం చివరి దశ వరకు కంప్యూటర్ మీదనే పనిచేశారు. ఆయనకు అంతపట్టు ఉండేది. సామాజిక దృక్పథాన్ని అలవరుచుకున్న వ్యక్తి. అందుకే ఆయన్ను 360 డిగ్రీల పర్సనాలిటీ వ్యక్తి అని అన్నాను.
పీవీలో రసజ్ఞత కూడా ఉంది. సాహిత్యం చదువుకున్నా ఆయన గొప్పలు చెప్పుకోలేదు. ఆయన చాలా అద్భుతమైన కవి, రచయిత, సాహిత్య పిపాసి. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ‘వేయిపడగలు’ చాలా గొప్ప నవల. చాలామంది పీవీ గారు దీన్ని హిందీలోకి అనువాదం చేశారని చెప్తారు. కానీ ఆయన అనువాదం చేయలేదు. అనుసృజన చేశారు. ఎవరో విశ్వనాథ సత్యనారాయణను అడిగారట… ‘పీవీ మీ నవలను హిందీలోకి అనువాదం చేశారు కదా మీకు ఎలా అనిపించింది’ అని, అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ చెప్తూ ‘అసలు పీవీ హిందీలో రాస్తేనే నేను తెలుగులోకి అనువాదం చేసినట్టు అనిపించింది’ అన్నారట. రసజ్ఞత ఉంది కాబట్టే వేయిపడగలు నవలను చదివి, తాను పొందిన రసప్రాప్తిని మొత్తం దేశానికి తెలియజేయాలనే తపనతో దాన్ని హిందీలోకి అనువదించారు.
పీవీకి చదువుతో పాటు సంస్కారం, సంస్కృతి ఉన్నాయి. చదువుతో పాటు ఉండాల్సిన రసజ్ఞత, సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా గొప్పగా ఉన్నటువంటి మూర్తిమత్వం పీవీ సొంతం. భాస్కర శతకంలోని ఓ పద్యం ఇందుకు ఉదాహరణ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటన్ బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెదునుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
మంథని శాసనసభ్యునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పీవీ నరసింహారావు.. శాసనసభ్యునిగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా, సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా, దేశ ప్రధానమంత్రిగా, నిరంతర సంస్కరణశీలిగా అంచెలంచెలుగా ఎదిగినా.. తన సాహిత్య పిపాసను మాత్రం వదులుకోలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సాహిత్యానికి సమయం కేటాయించడం కష్టమవుతుంది. కుటుంబానికి సమయం దొరకదు. ప్రజాజీవితంలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా చదువరి లక్షణాలను వదులుకోలేదు. ఓ సాయుధపోరాట యోధుడిని ‘గొల్ల రామవ్వ’ ఏ విధంగా కాపాడిందో అద్బుతంగా చెప్పారు.
ఏ పోరాటమైనా నాయకత్వం ఆంధ్రులది.. చచ్చేటోళ్లు మనోళ్లు, గొప్ప పని చేసినోళ్లు మనోళ్ల్లే. అన్నిరకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారినై. అవన్నీ కూడా బయటకు తీయాలె. తెలంగాణ భవిష్యత్ తరాలకు ఆ చరిత్ర అందించాలి. పీవీ మహోజ్వలమైన చరిత్ర కలిగిన ధీశాలి. ఆసక్తి గల వారు పీవీ మీద 360 డిగ్రీస్ పర్సనాలిటీ పేరుతో పుస్తకమే రాయవచ్చు. అంతపెద్ద జీవితం అతనిది. ఆచరణ ఉంది, వ్యక్తిత్వం ఉంది. అంచెలంచెలుగా ఎదిగిన తీరు మన కళ్లముందు ఉంది. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకునేందుకు పీవీ చరిత్ర ఆదర్శంగా నిలుస్తది. ఒక గైడ్లా నిలుస్తది. ఎలాంటి అండదండ లేకున్నా… తన జ్ఞానం మీద, విజ్ఞత మీద, వ్యక్తిత్వ పటిమ మీద ఇన్ని పదవులు అలంకరించిన వ్యక్తి ఒక పీవీ మాత్రమే. ఆయనకు నేపథ్యం లేదు… తనకు తాను వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకుంటూ ఏ స్థాయిలో అయినా సరే ముందుకుపోయి చరిత్రలో అధ్యాయనాన్ని సృష్టించగల వ్యక్తి ఆయన.
మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ మొదలుపెట్టిన వ్యక్తి నెహ్రూ అయితే, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. తన వినూత్న ఆర్థిక సంస్కరణలతో గ్లోబల్ ఇండియాను ఆవిష్కరించిన వ్యక్తి పీవీ. నెహ్రూకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి పీవీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇష్టం లేనివారికి ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం.
33 జిల్లాల్లో హోర్డింగ్స్ పెట్టాలని చెప్పిన. పీవీకి సంబంధించిన కరీంనగర్, వరంగల్, వంగరలో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీలో మీటింగ్ పెట్టుకొని చెప్పే వ్యక్తి కాదు పీవీ. తెలంగాణ బిడ్డలు దేశమంతా గర్జించాలి. ఇతర రాష్ర్టాల్లోనూ కలకత్తా, ముంబయి, ఢిల్లీలో కూడా ‘సన్ ఆఫ్ ది సాయిల్ ఆఫ్ ఇండియా’ అని హోర్డింగ్ పెట్టారు. బహుముఖ వ్యక్తిత్వం, ధీశాలి, ప్రజ్ఞా దురంధరుడు, భాషా కోవిదుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, సంస్కరణశీలి. ఆయనలోని అన్ని కోణాలు వెలుగులోకి రావాలి. ఇందుకు కేశవరావు సరైన వ్యక్తిగా భావించి ఈ బాధ్యతలను ఆయనకే అప్పగించినం. పీవీకి, కేకేకు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు విడుదల చేశాం. ఈ సంవత్సరం మొత్తం పీవీ శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం.
పీవీని ‘అర్ఫన్ మౌలా’ అని పాకిస్థాన్కు చెందినవారే అన్నారు. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు పీవీ పాకిస్థాన్ను సందర్శించారు. అక్కడి అధికారి ‘మా తాజ్ మహల్ను తీసుకున్నారు. అందుకు పరిహారం ఇవ్వాలి’ అని అడిగారట. వెంటనే పీవీ తడుముకోకుండా మీరు మా తక్షశిల, హరప్పా మొహెంజోదారో తీసుకున్నారు కదా, దానికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో వాళ్లు మళ్లీ తాజ్ మహల్ గురించి మాట్లాడలేదట.
పీవీ రచనలు చాలా ఉన్నాయి. అముద్రితంగా ఉన్నటువంటి రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ముద్రిస్తాం. అన్ని యూనివర్సిటీలకు ఈ రచనలను పంపిస్తాం. పీవీ వ్యక్తిత్వ పటిమ గురించి అద్భుతమైన స్థాయిలో మూడు నాలుగు ఎడిషన్స్ తీసుకురావాలని కేకేను కోరుతున్నా.. వాటిని అద్భుతంగా రాయాలి. వాటిని ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని భాషల్లో పంపిస్తాం. యూనివర్సిటీ, కాలేజీ లైబ్రరీల్లో ఉండదగిన పుస్తకాలుగా ఉండాలి. ‘హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ’ అనేదానికి పీవీ ఓ ప్రతీక. కాబట్టి ఈ పుస్తకాలు ఉండాలి. విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
( పీవీ శతజయంతి సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రచురించిన ‘నమస్తే పీవీ’ ప్రత్యేక సంచిక నుంచి) ప్రస్తుత పరిస్థితుల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు చేయడం అవసరమా? వీటికి ఇంత ప్రాధాన్యం అవసరమా? అనే సందేహాలు వచ్చాయి. కానీ, ఉత్సవాలు నిర్వహించడం తప్పకుండా అవసరమే. నిన్నటి గతమే నేటి చరిత్ర అవుతుంది. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ.. ప్రపంచానికే సేవ చేసిన వ్యక్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గుర్తుచేసుకోవడమే కాదు, ఆయన గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.
పీవీ మన జాతి బిడ్డ. తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన గురించి ప్రపంచానికి వందకు వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలి. రాష్ట్రస్థాయిలో, అంతర్రాష్ట్ర స్థాయిలో, జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పీవీ ఉత్సవాలు జరగాలి. పీవీ శతజయంతి ఉత్సవాలు జ్ఞానభూమిలో మాత్రమే జరగడం లేదు. 51 దేశాల్లో జరుగుతున్నాయి. ఇందుకు నేను గర్వపడుతున్నా. ఈ బాధ్యతలను మున్సిపల్ శాఖ మంత్రి రామారావు తీసుకొని చక్కగా నిర్వహిస్తున్నారు.
పీవీ తాను చేసిన ప్రతి పనిలో జీవించేవారు. మంత్రిగా ఉంటే అందులో జీవించేవారు. ముఖ్యమంత్రి ప్రజల కోసమేనని నిరూపించారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కృషిచేశారు. అందరికీ అధికారం దక్కాలనేవారు. పీవీ కాలంలోనే బీసీలకు రాజకీయ ప్రోత్సాహం దక్కిందనడం ఎవరూ కాదనలేని నిజం. అందరూ బాగుండాలని కోరుకోవడమే కాదు, ఆచరించి చూపిన వ్యక్తి పీవీ. ఆశ్రయం లేని వాళ్లకు ఆశ్రయం కల్పించి.. వారిని తీర్చిదిద్ది ఉన్నతమైన పదవులిచ్చి ఆదరించిన గొప్ప వ్యక్తి మన పీవీ.