ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత ఎదురుచూస్తూనే ఉన్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నీరుగారుస్తూ.. పోరాటాలను కించపరుస్తూనే ఉన్నాయి.
ప్రతీసారి ఓరుగల్లు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ను, 2014 విభజన చట్టంలోని హామీని తొంగలో తొక్కతున్నాయి. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విభజన హామీ అయిన కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై ఒకసారి పీరియాడిక్ వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ (పీఓహెచ్) అని, ఆ తర్వాత వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, తాజాగా వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ అని అయోమయానికి గురిచేస్తున్నది.
40 ఏండ్లలో ఎన్ని నాటకాలు.. : నాటకం… తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన లేకపోవడంతో యువత నిరుద్యోగులుగా మారుతున్నారని, 1980వ దశాబ్దంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఉద్యమాలు జరిగాయి. పీవీ నరసింహారావు అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని 1982లో ప్రకటన చేయించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.
మోసం… : ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన పరిణామాల్లో పంజాబ్ ప్రజల్లో విశ్వాసం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు తరలించారు.
ద్రోహం… : ఇందిరాగాంధీ ఇచ్చిన హామీని సోనియాగాంధీ సైతం విస్మరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్తో ఉద్యమాలు కొనసాగుతున్నా.. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ఆమె సొంత
నియోజకవర్గం రాయబరేలీలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది.
ఉద్యమ డిమాండ్…: తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలనే ప్రజల డిమాండ్ కేంద్రం ముందుంచాం. ఆ నేపథ్యంలో 2009లోనే అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అది ముందుకుసాగలేదు. ఆ తర్వాత వ్యాగన్ తయారీ పరిశ్రమ పశ్చిమబెంగాల్కు 2011లో తరలిపోయింది. తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని చేర్చారు.
బీజేపీ నాటకాలు: స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన అనంతరం ఉద్యమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అనేకసార్లు వింత వాదనలు తెచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును గాలికి వదిలేసింది. దేశంలో కోచ్ల తయారీకి డిమాండ్ లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులు పలుమార్లు చెప్పారు. అయితే బీజేపీ ఆ తర్వాతి తొమ్మిదేండ్లలో మహారాష్ట్రలోని లాతూర్లో, అసోంలోని కోక్రాజార్లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 2022లో గుజరాత్లోని దాహోద్లో రైల్వే వర్క్షాప్ను లోకోమోటివ్ ఉత్పత్తి కర్మాగారంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ దాహోద్ వర్క్షాప్ తయారీ యూనిట్గా అప్గ్రేడేషన్ ఖర్చు దాదాపు రూ.20 వేల కోట్లు. అదే సమయంలో తెలంగాణ కొత్త రైల్వేజోన్, లైన్ల ఏర్పాటుపై ఒక్క రూపాయి కేటాయించలేదు.
పూటకో మాట… స్పష్టత కరువై… : కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ రోజుకో మాట, పూటకో అబద్ధం చెప్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చింది. కానీ మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలో రైల్వే అభివృద్ధిపై చిత్తశుద్ధి లోపించింది. ఇప్పుడు వారు చేస్తున్నదంతా ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యవహారం మాత్రమే. ఎన్నికలుంటే మోదీ వస్తాడు. లేకుంటే ఈడీ వస్తుందని దేశం ప్రజలకు తెలుసు. తాటాకు చప్పుళ్లకు బెదరని భారత రాష్ట్ర సమితి కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తూనే ఉంటుంది. ఈ డిమాండ్ సాధనలో కేంద్ర బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం. మోదీ దుర్నీతిని రాష్ట్రంలోని ప్రజలకు వివరిస్తూనే ఉంటాం.
రైల్వే డివిజన్ డిమాండ్… : దక్షిణ, మధ్య రైల్వేజోన్లో అత్యధికంగా రెవెన్యూ ఇచ్చే కాజీపేట రైల్వే జంక్షన్ను రైల్వే డివిజన్గా ఏర్పాటుచేయాలనే డిమాండ్ సైతం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దక్షిణ మధ్యరైల్వే కింద సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం ఒక్క జోన్లో మూడు డివిజన్లు ఉండాలని నిబంధనలున్నా కాజీపేటను మాత్రం డివిజన్గా ప్రకటించడం లేదు. కాజీపేట డివిజన్ డిమాండ్పై బీజేపీ వింత వాదనకు దిగుతోంది. సికింద్రాబాద్కు సమీపంగా ఉన్న నేపథ్యంలో డివిజన్ చేయలేమన్నప్పుడు, ఆంధ్రలోని గుంటూరును డివిజన్ ఎందుకు చేశారు? రైల్వే డివిజన్గా ఉన్న విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్ మధ్య దూరం కేవలం 36 కిలో మీటర్లు మాత్రమే. ఇక్కడే బీజేపీ ద్వంద్వ నీతి, తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనబడుతున్నది.
వీటి మాటేమిటీ..?: తెలంగాణలో గడిచిన తొమ్మిదేండ్లలో కేవలం 285 కిలోమీటర్ల మేర మాత్రమే కేంద్రం రైల్వేట్రాక్ వేయగలిగింది. మొత్తంగా తెలంగాణ రైల్వేపైనే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిధులు కేటాయించడం లేదంటే ఇక తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఎంత కక్ష చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
(వ్యాసకర్త: ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు, వరంగల్ పశ్చిమ)
-దాస్యం వినయ్భాస్కర్