తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు మొత్తంగా తీరిపోయాయంటూ ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. దాదాపు 80 వేల కోట్ల రూపాయల వ్యయంతో అయిదేండ్లలో నిర్మించిన కాళేశ్వరం బృహత్ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం వివిధ కార్పొరేషన్లు, బ్యాంకుల కన్సార్టియంలు ఇచ్చిన భారీ రుణాలకు తిరిగి చెల్లింపులు 2022 జూన్ నుంచి మొదలయ్యాయని, ఈ అప్పులు 2035 వరకు వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ గత సంవత్సరం జూన్లో చెప్పారు. దీంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ చెబుతున్న లెక్కలకు, సీఎం కేసీఆర్ చెప్తున్న మాటలకు పొంతన కుదరటం లేదని తెలంగాణలో చర్చ మొదలైంది.12 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు అప్పుల బకాయిలను తీర్చాల్సి ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు మొత్తం తీర్చేశాం అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతున్నాయి. కానీ అపరచాణక్యుడు కేసీఆర్ ఆలోచించకుండా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోవడం విమర్శిస్తున్నవారి అజ్ఞానానికి తార్కాణం అని చెప్పుకోవాలి. ఆయన వ్యాఖ్యలు లోతుగా ఆలోచిస్తేనే అసలు విషయం మనకి అర్థమవుతుంది.
సీఎం ప్రకటన వెనుక మర్మం: సీఎం కేసీఆర్ ప్రకటనను ఏ దృష్టితో చూడాలి? 13 జిల్లాల్లో లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కోసారి మూడు కోట్ల టన్నుల వరి పండుతున్నదని కేసీఆర్ వివరించారు. ఈ ప్రాజెక్టు కింద వ్యవసాయం గణనీయంగా వృద్ధి చెందింది కాబట్టే ఏటా మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణలో ఉత్పత్తవుతున్నదని, వ్యవసాయ వృద్ధితోపాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగి దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉన్నదని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయంలో ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి మళ్లీ వెనక్కి వస్తుంది కాబట్టే రూ.80 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పులు మొత్తం తీరిపోయాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ మాగాణంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తవుతున్నదన్న వార్తలు చూస్తుంటే కూడా తన గుండె ఉప్పొంగుతున్నదని భావోద్వేగానికి గురయ్యారు. పంజాబ్, హర్యానాలను తలదన్నేలా రాష్ట్రంలో పండుతున్న వరిధాన్యాన్ని నిల్వ చేయడానికి గిడ్డంగులు సరిపోవని, దీంతో కొత్త గిడ్డంగులు కట్టాల్సి వస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు జరగడం వల్ల తెలంగాణ రైతుల చేతుల్లో డబ్బులు ఆడుతున్నాయని అన్నారు. రైతు వృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు అప్పులు కట్టడం రాష్ర్టానికి సమస్య కాదని ఆయన మాటల్లోని అంతరార్థం. హరితవిప్లవ పితామహుడు స్వామినాథన్ ఎన్నో సందర్భాల్లో పల్లెల్లో రైతుల ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధిని ఒకసారి కండ్లారా చూడాలనుందని ఆయన తెలపడం, వ్యవసాయరంగంలో రాష్ట్రం విజయం సాధించింది అనడానికి నిదర్శనం.
కాగ్ విమర్శ, విపక్షాల విమర్శలు: కాళేశ్వరం అప్పులు ప్రభుత్వం తిరిగి ఎలా తీరుస్తుందని కాగ్ ప్రశ్నలు కురిపించింది. అయితే ప్రాజెక్టు వల్ల రైతుల ఆదాయం పెరిగిందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని సీఎం కేసీఆర్ దానికి సమాధానం ఇచ్చారు. అయితే తలసరి అప్పు పెరగడం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుల్లో రాష్ట్రం కింది నుంచి 4 వ స్థానంలో ఉంది.
కాళేశ్వరంపై సీఎం అపార విశ్వాసం: వ్యవసాయం, పరిశ్రమల ద్వారా తెలంగాణలో పెరుగుతున్న ఆదాయంతో అప్పుల చెల్లింపులు తమకుపెద్ద లెక్క కాదనే ధీమాను సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై అపార విశ్వాసం ఉంది కాబట్టే ఆయన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు ద్వారా జరిగిన అభివృద్ధ్ది సీఎం వివరించినా విపక్షాలకు అర్థం కానప్పటికీ, లబ్ధి పొందిన ప్రజలకు కాళేశ్వరం ఘనత స్పష్టంగా అర్థమైంది.
ప్రపంచ వేదికపై సమున్నతంగా కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్ట్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) నుండి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏఎస్సీఈ నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్లో ప్రపంచ వేదికపై తెలంగాణ రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు అందుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట ప్రపంచ ప్రఖ్యాత డిస్కవరీ చానల్ ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా చరిత్రకెక్కింది. దశాబ్దాలుగా ఎండిపోయిన బీళ్లతో కనిపించిన రాష్ర్టానికి నీటికష్టాలను తీర్చడం, లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం దీని లక్ష్యం. రుతుపవనాల కొరత లేదా నీటిపారుదల సౌకర్యాల కొరత కారణంగా మహారాష్ట్రలోని విదర్భ తర్వాత అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రంలో, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ విషాదగాథను మార్చగలిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపుహౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
కాళేశ్వరం ఘన చరిత్ర: ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రం చేపట్టని అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టు ఇదే. 13 జిల్లాల్లోని 18 లక్షల ఎకరాల భూమికి సాగునీరందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు వాస్తవంగా మొత్తం రాష్ర్టాన్ని కవర్ చేస్తుంది. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాలకు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటుగా చుట్టుపక్కల అతి ముఖ్యమైన ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. అంతేకాదు, అనేక రాష్ర్టాల్లోని పరిశ్రమలకు నీటిపారుదల ప్రాజెక్టు నీటిని అందిస్తుంది. 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి పంపులు ప్రతిరోజూ 2 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టీఎంసీ) నీటిని ఎత్తిపోయడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. 2 టీఎంసీల నీటిని అన్నారం, సుందిళ్ల అనే రెండు బ్యారేజీల్లోకి పంపిస్తారు. ఇక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయరుకు నీరు వెళ్తుంది. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్స్, పైపులైన్ల ద్వారా నీటి పంపిణీ ప్రారంభమవుతుంది. దీనికి అవసరమైన నీరు మేడిగడ్డ బ్యారేజీ నుండి 14.09 కిలోమీటర్ల భూగర్భ సొరంగం ద్వారా వస్తుంది, ఇది ప్రపంచంలోనే పొడవైన నీటిపారుదల సొరంగం. పంప్ పనిచేసే గుహ, సర్జ్పూల్, 2 కోట్ల లీటర్ల నీటిని పట్టుకునే సామర్థ్యంతో ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉండటం విశేషం.
(వ్యాసకర్త: చేవెళ్ల పార్లమెంటు సభ్యులు)
-డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి