Kaleshwaram | కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వెనుక ‘రాజకీయ కోణాలను, మతలబు’లను వెతుకుతున్న నేతలకు మరోసారి గుర్తుచేయాల్సిన సందర్భం.
వేలాది రైతన్నల ఆత్మహత్యల శోకసంద్రం నుంచి, పుట్టిన గడ్డమీదే రెండోశ్రేణి పౌరులుగా చూడబడుతుంటే ఆత్మ గౌరవం కోసం రగిలిపోయిన లక్షలాది ప్రజల హృదయాంతరాలల్లోంచి జనించింది తెలంగాణ నినాదం, స్వయం పాలన కోసం రాష్ట్ర సాధన ఉద్యమం.
వలస పాలన తమ ప్రాంతాలకు తరలించుకుపోతున్న కృష్ణా, గోదావరి జలాలను, ఇక్కడి బీళ్ళకు మళ్లించి నెత్తురొలుకుతున్న నేలపై పచ్చని పైరులను, హరితవనాలను సృష్టించాలని, ‘కోటి రత్నాల వీణ తెలంగాణ’ను కోటి ఎకరాల మాగాణంగా చూడాలని, ‘మా నీళ్లు మాకే’నని మర్ల బడ్డతెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతిరూపంగా, నీటి తావుల కోసం తమ మేధస్సులను మధించి తొవ్వలు వెతికిన ఈ ప్రాంత ఇంజినీర్ల కృషి, ఉద్యమనేతల మహా సంకల్పం నుంచి ఉద్భవించిందే ఈ మహా ‘కాళేశ్వరం’!
కాలి ఎముక విరిగితే అతికించుకుంటాము తప్ప ‘శరీరం వృథా’ అని ఎలా అనుకోమో వందలాది పియర్ల/ పిల్లర్లలో ఒకటి రెండు నేలలోకి జారితే ‘బ్యారేజీలన్నీ వృథా’ అని భావించరాదు. ‘సూర్యున్ని చూపెడితే చూపుడు వేలు వైపు చూసే మనస్తత్వాల’ను మార్చుకోవాలి. ప్రజాధనంతో సృష్టించేది ఏదైనా, ఎవరు దానికి జీవంపోసి రూపం ఇచ్చినా దాన్ని ప్రజల సంపదగానే భావించాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీబ్యారేజీ) నిర్మాణ స్థలం ప్రాంతంలో బ్యారేజీ నిర్మించాలనే ఆలోచన, రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎగువకు ఎత్తిపోయాలని, తద్వారా ఎగువ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని ‘స్టెప్ లాడర్ టెక్నాలజీ’ని తెలంగాణకు ప్రత్యామ్నాయంగా సూచించింది ప్రఖ్యాత ఇంజినీర్ కీ.శే.టి.హన్మంతరావు. ఆ ఆలోచనలను వెలికితీసి గోదావరి నదిపై అమలు చేయాలనుకున్నది మాజీ సీఎం కేసీఆర్. ఆ ప్రణాళికకు రూపుదిద్దింది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ బృందం. దాన్ని అమలుచేసింది ప్రభుత్వం. తెలంగాణను నిండు కుండలా మార్చింది, మార్చబోతోంది కాళేశ్వరం. ఉత్తర, దక్షిణ తెలంగాణకూ జీవనాడి గోదావరికి ప్రాణం పోసిన ప్రాణహిత సహజ ప్రవాహ జలధార కాళేశ్వరం.
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రుల బృందం ఈ నెల 30న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా ఈఎన్సీ (ఇరిగేషన్) మురళీధర్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పూర్వాపరాలు ఎంతో ఓపికతో వివరించారు. కాళేశ్వరంపై మొదటిసారి ఒక అవగాహన ఏర్పర్చుకునే అవకాశం మంత్రులకు లభించింది. ఈ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరంపై అపోహ లు, అనుమానాలను తొలగిస్తూ వాస్తవ పరిస్థితిని ప్రజ ల ముందుంచారు అధికారులు.
ఈ ప్రజెంటేషన్ వీక్షించిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నీటి పారుదల శాఖా మం త్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ‘కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదు.. ‘తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ మార్చడం వెనుక రాజకీ య, ఇతర కోణాలున్నాయి..’ అని తీవ్రమైన వ్యాఖ్య లు చేశారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పూర్వాపరాలు తెలుసుకోవడం అవసరం.
ప్రాణహిత ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించింది తెలంగాణ రిటైర్డు ఇంజినీర్లు. వారిలో ముఖ్యులు విశ్రాంత చీఫ్ ఇంజినీర్లయిన వెంకటరామారావు, అనంతరాములు, ప్రభాకర్. వీరు తయారుచేసిన ప్రాథమిక సాధ్యాసాధ్య నివేదికను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సదస్సులో చర్చించి తుదిమెరుగులు దిద్దినారు.
కీ.శే.ఆర్.విద్యాసాగర్రావు, భీమయ్య తదితరులు ఈ నివేదికను తెలంగాణ ప్రజాప్రతినిధుల ముందుపెట్టి వారి సలహాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేసిన తర్వాత 2005లో అప్పటి మంత్రి హరీశ్రావు చొరవతో ఆనాటి సీఎం కీ.శే.వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఒప్పించి 27-6-2005 నాడు డీపీఆర్ తయారీకై జీవో జారీ చేయించారు. ప్రతిపాదిత 12 లక్షల ఎకరాలను ఆ జీవోలో 5 లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకు కుదించింది ప్రభుత్వం. దీనిపై టీఆర్ఎస్ మం త్రుల నిరసన వల్ల ముఖ్యమంత్రి జోక్యంతో ఆ జీవోను 12 లక్షల ఎకరాలకు సవరించింది.
16.05.2007న ఈ ప్రాజెక్టు కోసం రూ.17,875 కోట్ల పరిపాలనా అనుమతులనిచ్చింది ప్రభుత్వం. కొద్దిరోజుల్లోనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38,500 కోట్లతో 16.40 లక్షల ఎకరాలకు ఆయకట్టును పెంచుతూ 17-12-2008న మరో జీవోను జారీచేసింది. చేవెళ్ళ ప్రాంత ఆయకట్టును అదనంగా చేర్చి ప్రాజెక్టు పేరు ‘ప్రాణహిత-చేవెళ్ళ’గా మార్చారు వైఎస్. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆయకట్టు పెంపు 34 శాతం కాగా వ్యయాన్ని 115 శాతం పెంచిన ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. కేంద్ర జల సంఘం అనుమతి ఏప్రిల్ 2010లో లభించగా 2008 జూన్ నుంచి మే 2009 నాటికే ఈ ప్రాజెక్టు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించా రు. ప్రాణహిత నదిపై బ్యారేజీకి మహారాష్ట్ర అనుమతి కోరకుండానే చేవెళ్ల వద్ద కాల్వలకు శంకుస్థాపన చేసి కమీషన్ల కోసం ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారు.
అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిపై మహారాష్ట్ర ఒత్తి డి పెంచడంతో 6-5-2012న ఇరు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జనవరి 2013లో జరిగిన బోర్డు తొలి సమావేశంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 15.10.13న ఇదే విషయమై తమ వ్యతిరేకతను తెలుపుతూ ‘ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నిర్మాణం కొనసాగించడం వల్ల మున్ముందు జరిగే నష్టానికి వారే బాధ్యులవుతారని’ తన వ్యతిరేకతను తెలిపింది మహారాష్ట్ర.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టాక తన జన్మదినం రోజు ముం బైలో జరిగిన ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో మరోమారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ 152 మీటర్ల ఎత్తుకు తమ ప్రభుత్వం ఏ పరిస్థితిలోనూ అంగీకరించదని, ముంపు తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషించవలసిందిగా కేసీఆర్ను కోరారు.
అంతకుపూర్వం 2014లో జూలై అప్పటి నీటి పారుదల శాఖామంత్రి ముంబాయికి వెళ్లి ఆ రాష్ట్ర మంత్రితో, అధికారులతో చర్చించినా వారు ఒప్పుకోలేదు.
26.10.2015న రెండు రాష్ర్టాల చీఫ్ ఇంజినీర్ల స్థాయి సమావేశం హైదరాబాద్లో జరిగినప్పుడు 148 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తును అనుమతించేది లేదని స్పష్టం చేశారు మహారాష్ట్ర అధికారులు.
మరోపక్క జూలై 2008లోనే ‘ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదనలో నీటి నిల్వ సామర్థ్యం తగినంత లేద’ని కేంద్ర జల సంఘం అభ్యంతరం తెలిపింది. ఆ నివేదికలో 160 టీఎంసీలను వినియోగించుకోవడానికి కేవలం 14.70 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లనే ప్రభుత్వం పేర్కొన్నది. ఫిబ్రవరి 18, 2015న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం రాసిన మరో లేఖలో ‘160 టీఎంసీల వినియోగానికి 14.70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లు చాలవ’ని స్పష్టం చేసింది.
కేంద్ర జలసంఘం 4.3.2015న ప్రాణహిత ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్కు రాసిన మరో లేఖలో తుమ్మడిహెట్టి వద్ద లభ్యమయ్యే నీటి పరిమాణం 165 టీఎంసీలు కాగా దీనిపై పై రాష్ర్టాలు (మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్) వాడుకోవాల్సిన 63 టీఎంసీలు పోగా తెలంగాణకు మిగిలేది 102 టీఎంసీలు మాత్రమేనని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర పట్టుబడుతున్నట్టు ప్రాజెక్టు బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లికి తరలించే నీటి పరిమాణం 44 టీఎంసీలు మాత్రమే. బ్యారేజీ ఎత్తు 4 మీటర్లు తగ్గడం వల్ల 5 టీఎంసీల నీటి నిల్వ అంచనా సామర్థ్యం 1.8 టీఎంసీలకు తగ్గుతుంది.
మహారాష్ట్ర సూచన మేరకు 148 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీని వేన్గంగ-వార్ధా నదుల సంగమ ప్రదేశం కనుక 40 డిగ్రీల స్క్యూ (Skew) లో నిర్మించాలి. బ్యారేజీ గేట్లకు నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో రావాలంటే బ్యారేజీ డిజైన్ ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో సంక్లిష్టమైనది. మన దేశంలో కానీ, ఇతర దేశాల్లో కానీ స్క్యూ బ్యారేజీలు ఎక్కడా లేవు. అంతేగాక సుమారు 110 గేట్లు ఉండే ఈ బ్యారేజీ రెండు వైపులా మట్టి కట్టలతో సుమారు 6 కిలోమీటర్ల పైనే పొడవుంటుంది. ఇప్పుడిది నిర్మించాలంటే సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైనే వ్యయమవుతుంది.
తుమ్మడిహెట్టి బ్యారేజీకి ఎడమ వైపున చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి అనుమతులు సాధించడం సాధ్యపడకపోవచ్చు.
బ్యారేజీ ఎత్తు 4 మీటర్లు తగ్గడం వల్ల 2014 నాటికే 152 మీటర్ల ఎత్తును దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో (రోజుకు ఒకటిన్నర టీఎంసీల నీటిని తరలించే) తవ్విన కాల్వలకు ఎత్తిపోయాలి. ఈ ఒక్క లిఫ్టే చాలదు. ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి ప్రాణహిత కాల్వనీరు చేరాలంటే 73.5 కిలోమీటర్ల (కాల్వ పొడువు) వద్ద 39 మీటర్ల ఎత్తుకు రోజూ 1.7 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్వను 46 కి.మీటర్ల పొడువు తవ్వినారు. ఫారెస్టు క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాల్వ పనులు నిలిచిపోయాయి.
ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి తీరుతామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు పైన తెలిపిన అవరోధాలు ఆయన దృష్టికి వచ్చి ఉంటే కేసీఆర్ రీ డిజైనింగ్ ఎం దుకు చేపట్టినారో అర్థమవుతుంది.
కాళేశ్వరం పేరుతో రీ-డిజైనింగ్ చేసిన ప్రాజెక్టు వలన కలిగే ప్రయోజనాలను కూడా కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ప్రాణహిత-గోదావరి సంగమం స్థలంలో లభ్యమయ్యే నీరు 284 టీఎంసీలు ఉంటుందని కేంద్ర జల సంఘం తెలిపింది. ఎగువ రాష్ర్టాలు 63 టీఎంసీల నీటిని భవిష్యత్తులో వినియోగంలోకి తెస్తే కూడా ఇంకా 221 టీఎంసీల నీరు తెలంగాణలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదనంగా ఇక్కడ లభ్యమయ్యే 119 టీఎంసీలలో 72 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లాలోని పరీవాహక ప్రాంతం నుంచే వస్తాయి. తుమ్మడిహెట్టి బ్యారేజీకి దిగువన పెద్దవాగు, నీల్వాయి, వట్టివాగు, చెలిమెల వాగు, గొల్ల వాగు, జైపూర్ వాగు తదితర వాగుల నుంచి ఈ నీరు ప్రాణహిత, గోదావరి నదుల్లో కలుస్తాయి.
రీ-డిజైనింగ్లో మూడు బ్యారేజీలు, పంపింగ్ స్టేషన్ల ద్వారా రివర్స్-ఫ్లో చేసే నీరు 36 టీఎంసీలు గోదావరి నదిలో నిల్వ ఉండటం వల్లన మత్స్య సంపద, పరిశ్రమల ఏర్పాటు, టూరిజం వంటి అదనపు ప్రయోజనాలు సమకూరనున్నాయి. ఇంత భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లను నిర్మించాల్సి వస్తే సుమారు మరో 5 వేల కోట్లు అవసరమై ఉండేది.
తుమ్మడిహెట్టి నుంచి బ్యారేజీ నిర్మాణాన్ని కాళేశ్వరానికి తరలించడం వెనుక ఆత్మహత్యల పాలవుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే కోణమే తప్ప మంత్రి అపో హ పడుతున్నట్టుగా ఏ రాజకీయ కోణమూ, మరే ‘మతలబు’ లేదు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆదినుంచీ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేంద్రంలో, మహారాష్ట్రలో తమ పార్టీ ప్రభుత్వాలే ఉన్నా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకిచ్చి కమీషన్లు రాబట్టుకున్నారు. మల్లన్నసాగర్ను అడ్డుకోడానికి వందలాది కేసులు వేసింది నిర్వాసితుల ముసుగులో కాంగ్రెస్ నాయకులేననేది తెలిసిందే.
బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ వదులుకోలేదు. లేదా రద్దు చేయలేదు. రీ-డిజైనింగ్ చేసేనాటికే (2016) నిర్మించిన కాల్వను ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి గతంలో (50 వేల ఎకరాలు) వినియోగించాలనే తలంపుతో 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్నారు.
కానీ, ఆ ఎత్తులో నిర్మిస్తే ఇప్పటికే తవ్విన కాల్వకు నీరందించడం గ్రావిటీ ద్వారా సాధ్యపడదని, బ్యారేజీ నిర్మాణంలో పైన తెలిపినట్టు అనేక ఇబ్బందులున్నాయని గ్రహించి నిపుణుల సూచన మేరకు తుమ్మడిహెట్టికి సుమారు 2 కిలో మీటర్ల ఎగువన వార్ధానదిపై (పెన్ గంగ-వార్ధా సంగమస్థలానికి సుమారు 20 కిలోమీటర్ల దిగువన) బ్యారేజీని 155 మీటర్ల ఎత్తులో 29 గేట్లతో 1,751 మీటర్ల పొడవు (దీనిలో కాంక్రీట్ స్ట్రక్చ ర్ పొడవు 572 మీటర్లు మాత్రమే)తో నిర్మించాలని డీపీఆర్ను రూపొందించి కేంద్ర జల సంఘానికి పం పింది ప్రభుత్వం. ‘బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్ట్’ అంచనా వ్యయం రూ.4550.73 కోట్లు (భూ సేకరణ, బ్యారేజీ, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, పంప్హౌజ్లు, సబ్స్టేషన్లు మొదలైనవి)
తుమ్మడిహెట్టితో పోల్చితే ఈ ప్రాజెక్టుకయ్యే ఖర్చు చాలా తక్కువ. దీనిలో నీటి నిల్వ సామర్థ్యం 2.94 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా (50 క్యూమెక్స్ లేదా 1765 కూసెక్స్) 7.35 కిలోమీటర్ల కాల్వను, నిర్మించి ప్రాణహిత కాల్వకు (54 కిలోమీటర్ల మొత్తం పొడవు) కలుపుతారు. వార్ధా నదిలో లభ్యమయ్యే వరద జలాలను పైకాల్వ నుం చి టన్నెల్ ద్వారా జైపూర్ వాగులోకి మళ్లించి సుందిళ్ల రిజర్వాయర్కు చేర్చవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోయి తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులోనే బ్యారేజీ నిర్మించాలని అనుకుంటే ప్రజలు వారికిచ్చిన పుణ్య(పాలనా)కాలం ముగిసిపోతుందే తప్ప లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ఒకవేళ నిర్మించినా రెండు లిఫ్టులతో ఎత్తిపోయగలిగే నీరు కాళేశ్వరం కింద స్థిరీకరించాల్సిన 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు, కొత్తగా నీరందించాల్సి ఉన్న 19,63,360 ఎకరాలకు తుమ్మడిహెట్టి వద్ద లభ్యం కాదు. మళ్లీ కాళేశ్వరమే శరణ్యం.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 141 టీఎంసీల నీటిని నిల్వజేసే 15 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు, 22 లిఫ్టులు, 21 పంప్హౌజ్లు, 7 లింకుల్లో 28 ప్యాకేజీలు, 19 సబ్స్టేషన్లు, 1,531 కిలోమీటర్ల ప్రవాహ కాల్వలు, 203 కిలోమీటర్ల భారీ సొరంగాలు 98 కి.మీ. ప్రెషర్మేన్లు.
మేడిగడ్డ బ్యారేజీలోని 8 బ్లాకుల్లో గల 86 పియర్స్లో 7వ బ్లాకులోని కేవలం 3 పియర్స్ కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరమే పనికిరానిదైందా? ఈ 3 పియర్స్ కుంగడానికి కారణాలను నిపుణుల కమిటీ పరిశోధిస్తుంది. ఎల్ అండ్ టీ కంపెనీ తమ సొంత డబ్బుతో 7వ బ్లాకును మొత్తంగా కానీ, లేదా కుంగిన 3 పియర్స్ను కానీ పునర్నిర్మిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం న్యాయవిచారణ జరుపుకోవచ్చు కానీ, ప్రమాదానికి కారణాలను వెలికి తీయగలిగేది నిపుణుల కమిటీ మాత్రమే. తక్షణమే దేశంలోని లేదా ఇతర దేశాల్లోని నిపుణులను సంప్రదించి కమిటీని నియమించాలి.
మంత్రుల బృందం సరస్వతీ (అన్నారం) బ్యారేజీని కూడా అదేరోజు సందర్శించారు. అసహజమైన ప్రమాదమేదీ ఆ బ్యారేజీలో సంభవించలేదని ఇప్పటికే వారికి అర్థమై ఉండవచ్చు. పార్వతి (సుందిళ్ళ) బ్యారేజీతో పాటు ఈ రెండు సురక్షితంగానే ఉన్నాయి.
నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి లేవనెత్తిన మరికొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ‘రెండు టీఎంసీలనే పూర్థిస్థాయిలో లిఫ్ట్ చేయనప్పుడు మూడో టీఎంసీ కోసం తొందరేమొచ్చింద’ని మంత్రి ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి, తెలంగాణ సాగునీరు, వ్యవసాయ పరిస్థితులపై సమగ్ర అవగాహనతో మూడో టీఎంసీ కోసం తాపత్రయ పడ్డారు. నదుల అనుసంధానం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైంది. గోదావరి-కావేరి నదుల అనుసంధాన పనులు మొదలు కాబోతున్నవి. ఇదే జరిగితే తెలంగాణ నికర జలాల్లో తన హక్కులను శాశ్వతంగా కోల్పోతుంది. ఒకవేళ కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసి మరో 7 లక్షల ఎకరాలను (చెరువులు, వాగులపై చెక్డ్యాంలు, చిన్న, మధ్యతర హా ఎత్తిపోతల పథకాలు, మీడియం, మైనర్ ప్రాజెక్టుల కింది ఆయకట్టు) స్థిరీకరించాలనేది, తద్వారా మొత్తం 45 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీటిని అందించాలని కేసీఆర్ సంకల్పించారు. ఒకసారి ఈ వ్యవస్థను ఏర్పా టుచేసుకుంటే తెలంగాణకు గోదావరి జలాల్లో గల పూర్తి వాటాను (968 టీఎంసీలు) వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ మంచి ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో స్టేటస్కో ఆర్డర్ తీసుకోగా రాష్ట్ర ప్రభు త్వం సరైన రీతిలో వాదనలు విన్పించి ‘స్టే’ను రద్దు చేయించగలిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటి కోసం కరెంటుపై వేలాది కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వస్తుంద ని మరో వాదనను ఎంతోకాలంగా కాం గ్రెస్ పార్టీ ముందుకు తెస్తున్నది.
తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేస్తే అవసరమయ్యే వ్యయం కూడా తక్కువేమీ కాదు. రెండింటికీ తేడా ఒక్క లిఫ్టు మాత్రమే. కాళేశ్వరంలో 3 బ్యారేజీల వద్ద 3 లిఫ్టులుంటే తుమ్మిడిహట్టి నీటిని రెండు లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు.
కాళేశ్వరం ద్వారా సాగులోకి వచ్చే కొత్త ఆయకట్టుకు గానీ, స్థిరీకరించే ఆయకట్టుకు గానీ ఎగువ గోదావరి, కడెం, మంజీరా నదుల నుంచి నీరు రాని కరువు పరిస్థితుల్లోనే కాళేశ్వరం నుంచి మూడు దశల్లో నీటిని లిఫ్ట్ చేస్తారు. పంట కాలం మొత్తం అన్ని లిఫ్టులు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఇది ‘స్టాప్ గ్యాప్’ ఏర్పాటుగా భావించాలి.
కాళేశ్వరం ఆయకట్టు (స్థిరీకరణతో కలిపి)లో లక్షలాది బోర్లు, బావులు ఉంటాయి. కాల్వల ద్వారా సాగునీరందుతున్నప్పుడు వీటి అవసరం ఉండదు. ఆ మేరకు కరెంటు ఆదా అవుతుంది.‘నాన్-పీక్ అవర్స్’లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు ను లిఫ్టులకు వినియోగించడం ద్వారా విద్యుత్తు వృథాను నివారించవచ్చు, రిజర్వాయర్లు నింపుకోవచ్చు.
ప్రవాహ కాల్వల ద్వారా నీరు లభించే అవకాశమే లేనప్పుడు తెలంగాణకు ఎత్తిపోతలు తప్ప మరో దారి లేనే లేదు.
కాళేశ్వరం జలాలన్నీ కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితం కావు. అపారమైన నీటి నిల్వలతో ఉండే వంద కిలోమీటర్లకుపై ఉండే గోదావరి నదిలో, రిజర్వాయర్లలో, చెరువులలో, వాగులపై ఉండే భారీ చెక్డ్యాంలలో, విశాలమైన ప్రధాన కాల్వలలో వేల కోట్ల ఆదాయాన్నిచ్చే మత్స్య సంపదను సృష్టించడం అసాధ్యమేమీ కాదు.
మంచినీటి చేపలకు, రొయ్యలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. గతం కన్న మత్స్యకారుల ఆదాయం తెలంగాణలో వంద రెట్లు ఇప్పటికే పెరిగింది. సుమారు 3,500 చెరువులకు కాళేశ్వరం జలాలను మళ్లిస్తు న్నాం. కాళేశ్వరం జలాలతో పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉన్నది. 1944లోనే నిజాం గోదావరిపై బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించి తీర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను నెలకొల్పాలని ప్రణాళికలు తయారుచేయించాడు. అవి అమలుకాలేదు. ఇప్పుడు వాటి అమలుకు అవకాశం ఏర్పడింది. గోదావరి బ్యారేజీల వద్ద, రిజర్వాయర్లలో నిల్వ ఉండే నీటిలో టూరిజం పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు.
ఈ ఆదాయ మార్గాలపై, వాటి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టాలే తప్ప పనికిమాలిన సాకులతో కాళేశ్వర ప్రాజెక్టుపై, కేసీఆర్పై విషం చిమ్మడం ద్వారా సాధించేదేమీ లేకపోగా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)
– వి.ప్రకాశ్ 90009 50400