వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ‘కాదేదీ కాలం కరెంటు కోతలకు అతీతం’ అన్నట్టుగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెంటు పరిస్థితులను గమనిస్తే. మనకున్న విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, అందుకు అనుగుణంగా అవసరమయ్యే విద్యుత్తు డిమాండ్ను బేరీజు వేసినప్పుడు ప్రజల కరెంటు కష్టాలకు ఆయా పాలకుల నిర్వహణా లోపం, చిత్తశుద్ధి మాత్రమే ప్రధాన లోపంగా కనిపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు ఉత్ప త్తి సంస్థల ఉత్పత్తి సామర్థ్యం 101415 మెగావాట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వాల అధీనం లోని ఉత్పత్తి సామర్థ్యం 105749 మెగావాట్లు. అదే సమయంలో ప్రైవేట్ భాగస్వామ్యం 216195 మెగావాట్లుగా ఉన్నది. వెరసి దేశంలో మనకందుబాటులో ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 417668 మెగావాట్లుగా ఉన్నది. జూన్లో నమోదైన అత్యధిక పీక్ డిమాండ్ 224106 మెగావాట్లు. కానీ వానా కాలం మొదలైన అనంతరం చాలా రాష్ర్టాల ప్రజలు విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్నారు.
ఆగస్ట్లో కూడా కరెంటు కోతలకు తరచుగా ఏవో కుంటిసాకులు చెప్పే ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల ప్రజానీకం ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలకు వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న వ్యవసాయ డిమాండ్ కారణాలుగా పేర్కొంటున్నారు తప్ప నష్టనివారణ చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్గించడంలో విఫలమవుతున్నారు.
ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలు వ్యవసాయరంగానికి నాణ్యమైన కరెంటు సంగతేమో కానీ కనీసం బెంగళూర్ లాంటి కాస్మొపాలిటన్ నగరానికైనా గంటల తరబడి విధిస్తున్న కోతల నుంచి ఉప శమనం కల్పించమని రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యం లో పారిశ్రామిక వేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడా నికి వెనుకంజ వేస్తున్నారు. సుమారు 16000 మెగావాట్ల డిమాండ్ను సరఫరా చేయలేక అక్కడి డిస్కం, రాష్ట్ర విద్యుత్తు సంస్థలు చేతులెత్తేశాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని ‘జోధ్పూర్ విద్యుత్తు వితరణ్ నిగం లిమిటెడ్’ పరిధిలోని రైతులు గతవారం రోజులుగా జోధ్పూర్ పట్టణంలోని డిస్కం కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం ‘మహాపడావ్’ను నిర్వహిస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్ల ను గమనించినట్లయితే పాలకులు రైతుల పట్ల ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది. వ్యవసాయానికి రోజుకు 7 గంటల త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలి. దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు కొత్త కనెక్షన్లు మంజూరు చేయా లి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు పంటలు ఎండిపోకుండా తొందరగా మార్చడానికి అనువుగా డివిజనల్ కార్యాలయంలో ఐదు ట్రాన్స్ఫార్మర్లు రోలింగ్ స్టాక్గా అందుబాటులో ఉంచాలి. నిజం చెప్పాలంటే పైన చెప్పినవేవీ డిమాండ్లు కావు. బాధ్యత కలిగిన అధికారులు నిర్వర్తించాల్సిన కనీస విధులు.
తెలంగాణ రాష్ట్రంలో పై డిమాండ్ల విషయానికి వస్తే ఏడు గంటలు కాదు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందుతున్నది. కాదు కూడదంటూ ఎవరైనా యుద్ధానికి వస్తే ఎండిన ఒక మడిని చూపించండి. ముఖ్యమంత్రి బాధ్యుల తోలు ఒలుస్తారు. బోరు వేసుకున్న రైతు ఏండ్ల తరబడి ఎదురు చూడటం కాదు నెలరోజుల్లో కరెంట్ ఇవ్వకుంటే పై అధికారుల నుంచి శ్రీముఖాలు వస్తాయి. బోరు వేసుకున్న రోజే కరెంటు తీసుకున్నా ఇవ్వడానికి అధికారులు సిద్ధం. క్షేత్ర స్థాయిలో ఇదీ వాస్తవ పరిస్థితి.
కాలిన ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంట్ వాహనంలోనే తీసుకువచ్చి మార్చాలి. లేకుంటే రైతులకు వాహనం కిరాయి చెల్లించాలి. తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల ప్రకారం క్షణం ఆలస్యం అవకూడదు. తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలలోనే ఇన్ని మార్పులు సాధ్యపడినప్పుడు మిగతా రాష్ర్టాలు ఎందుకు విఫలమవుతున్నట్టు?
రాజస్థాన్ రాష్ట్ర పీక్ డిమాండ్ 13776 మెగావాట్లు. కాగా దినసరి వినియోగం సగటున 300 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. వానకాలం లోక్సభ సమావేశాల సందర్భంగా కేంద్ర విద్యుత్తు శాఖామంత్రి ఆర్కేసింగ్ గ్రామీణ ప్రాంతాలకు 19 గంట లు, పట్టణ ప్రాంతాలకు 23 గంటలకు పైగా కరెంటు సరఫరా జరుగుతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 5న కర్ణాటక ప్రభుత్వం గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 200 యూనిట్లు వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు అన్నమాట. అంతే కాకుండా వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నారు. – కల్బుర్గి, రాయచూర్, శివమొగ్గ, చిక్మగ్ళూర్ తదితర ప్రాంతాల్లోని రైతులెవ్వరికీ ఏడు గంటల త్రీఫేజ్ కరెంటు అందడం లేదు. కర్ణాటక, రాజస్థాన్ రాష్ర్టాల్లోనే కాకుండా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ర్టాల ప్రజలు కూడా విపరీతమైన విద్యుత్తు కోతలను ఎదుర్కొంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో 94 శాతం గృహ వినియోగదారు లు, నోయిడా లాంటి పారిశ్రామిక కీలక ప్రాంతంలో 86శాతం గృహ వినియోగదారులు రోజువారీ విద్యుత్తు కష్టాలు అనుభవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లా లకు గాను 56 జిల్లాల ప్రజలు తీవ్ర కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం, 80 మంది పార్లమెంటు సభ్యులు పాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ పీక్ ఆగస్టు 16న 25,805 మెగావాట్లుగా నమోదయ్యింది. సుమారు 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ 25,805 మెగావాట్ల డిమాండ్ను తీర్చలేకపోవడం అక్కడి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది
మన రాష్ట్ర విషయానికి వస్తే గత సంవత్సరంతో పోల్చి చూసినపుడు ఆగస్టులో గణనీయమైన వృద్ధి కనబడుతోంది. ఆగస్టు 25న 14,361 మెగావాట్లు పీక్ డిమాండ్ నమోదు కాగా ఆ రోజు వినియోగం 275 మిలియన్ల యూనిట్లుగా ఉన్నది. గత సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 40 మిలియన్ల యూనిట్ల వృద్ధి నమోదయ్యింది.
దూరదృష్టి కలిగిన పాలకులు చిత్తశుద్ధ్దితో సమస్యలపై దృష్టి సారించినప్పుడు ప్రజలు సౌకర్యవంతంగా అభివృద్ధిలో భాగస్వాములవుతారనడానికి తెలంగాణ చక్కటి ఉదాహరణ. దటీజ్ కేసీఆర్.
(వ్యాసకర్త: టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313