జమిలి ఎన్నికల ప్రక్రియ అమల్లోకి రావడానికి అనేక అవరోధాలున్నాయి. కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాల పరిమితిని అవసరాలకు తగ్గట్టుగా కుదించాల్సి ఉంటుంది. ఇదిచేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, అలాగే మొత్తం రాష్ర్టాల్లో సగం రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి.
లోక్సభకు, రాష్ర్టాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. ఇందుకు ‘లా-కమిషన్’ కసరత్తు చేస్తున్నదని లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఇటీవల వెల్లడించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కూడా కిందటేడాది పేర్కొన్నది. జమిలి ఎన్నికలకు అనుగుణంగా ఓటరు జాబితాను తయారుచేసే కార్యక్రమంలో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇన్నాళ్లూ ప్రతిపాదన స్థాయిలోనే ఉన్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నదని అర్థమవుతున్నది. లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన కొత్తది కాదు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై తొలిసారి చర్చ జరిగింది.
1951 నుంచి 1967 వరకు లోక్సభకు. శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది. 1969లో బీహార్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలు రద్దయ్యాయి. దీంతో ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపవలసి వచ్చింది. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దీంతో ఏడాది పొడవునా దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం మొదలైంది.
కేంద్రంలో ఎన్డీయే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై చర్చించడానికి 2019 జూన్లో ప్రధాని మోదీ అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటుచేశారు. మొత్తం 40 రాజకీయపార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు స్వాగతం పలికితే, మరికొన్ని వ్యతిరేకించాయి. బీజేపీ వంటి జాతీయపార్టీలకు ఈ ప్రతిపాదన లాభమనీ, ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదనలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటుచేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.
ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 1999లో ‘లా కమిషన్’ ఇచ్చిన నివేదికలో జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తమైంది. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల బోలెడన్ని లాభాలున్నాయని పేర్కొంది. ప్రభుత్వానికి కొన్ని వందల కోట్లు ఆదా అవుతాయని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నది. అలాగే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయన్నది. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ప్రయాస తప్పుతుందని న్యాయ కమిషన్ సూచన.
జమిలి ఎన్నికల ప్రక్రియ అమల్లోకి రావడానికి అనేక అవరోధాలున్నాయి. కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాల పరిమితిని అవసరాలకు తగ్గట్టు కుదించాల్సి ఉంటుంది. ఇది చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, అలాగే మొత్తం రాష్ర్టాల్లో సగం రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి. దేశమంతా ఎన్నికలంటే అందుకు తగ్గట్టు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సమకూర్చుకోవాలి. ఓటు పడిందా, లేదా అనేది తెలుసుకోవడానికి ‘వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ యంత్రాలను సమకూర్చుకోవాలి. వీటికి రూ.9284 కోట్లు ఖర్చవుతాయన్నది 2015 నాటి అంచనా. పదిహేనేండ్లకోసారి ఈ యంత్రాలను మార్చాలి. అంటే ప్రతి మూడు ఎన్నికల తర్వాత ‘వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ యంత్రాలను కొత్తగా కొనుక్కోవాలి. ఇంత పెద్దమొత్తంలో ధనాన్ని ఎన్నికల పేరిట ఖర్చుపెట్టడం సమంజసమా అనే ప్రశ్న తలెత్తుతున్నది.
జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది. లోక్సభ కాలపరిమితి ప్రారంభమయ్యే తేదీ, అలాగే ముగిసే తేదీలను ముందుగానే నిర్ణయించుకోవాలన్నది ప్రధాన సూచన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే.. వాళ్లే ఆ తర్వాత ప్రధానిగా ఎవరుంటారో చెప్తూ వారి పేరిట విశ్వాస తీర్మానం పెట్టాలి. ఈ రెండు తీర్మానాలపై సభలో ఒకేసారి ఓటింగ్ జరగాలి. రాష్ర్టాల శాసనసభలకూ ఇదే విధానం వర్తింపజేయాలన్నది మరో సూచన.
జమిలి ఎన్నికల ప్రతిపాదన వల్ల జాతీయపార్టీలకే మేలు జరుగుతుందన్నది ఒక వాదన. లోక్సభ ఎన్నికలప్పుడు ప్రజలు జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తారని, అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాంతీయ అంశాలను పట్టించుకుంటారనే అభిప్రాయం ఉన్నది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల స్థానిక అంశాలు గాలికిపోయి, జాతీయ అంశాలే ప్రధానం అవుతాయనీ, ఫలితంగా జాతీయపార్టీలకు మేలు జరుగుతుందన్నది ప్రాంతీయ పార్టీల నేతల వాదన. జమిలి ప్రతిపాదన వెనుక ఆరెస్సెస్ రహస్య అజెండా ఉన్నదని ప్రాంతీయపార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు.
కొందరు రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం- ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ఆలోచనే ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం. భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక సిద్ధాంతానికి అర్థం లేకుండా పోతుంది. అధ్యక్ష తరహా పాలన సాగే అమెరికా వంటి దేశాలకు మాత్రమే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం పనికొస్తుంది. అనేక జాతులు, మతాల వారుండే మన దేశానికి ఇది పనికిరాదు. చివరికి జాతీయపార్టీలు బలోపేతమై, ప్రాంతీయపార్టీలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి,దేశ సమగ్రత దెబ్బతింటుంది. కానీ ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనను వీలైతే 2022 లోక్సభ ఎన్నికల్లోనే అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు అభ్యంతరకరం.
-(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎస్.అబ్దుల్ ఖాలిక్