వ్యవస్థను రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు ఆవేదన చెందారు. తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని బాధపడ్డారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ‘వీఆర్ఏల క్రమబద్ధీకరణ’తో వారి జీవితాల్లో ఆశలు చిగురించాయి. ‘వీఆర్ఏ’లకు పే స్కేల్ వర్తింపజేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొండంత అండ లభించినట్లయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తున్నది. వీఆర్ఏల అర్హతల ప్రకారం… మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో సర్దుబాటు చేయనున్నది. ఇంత కాలానికి వీఆర్ఏల కల సాకారమై గౌరవ ప్రదమైన హోదా లభించింది. ఇందుకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు సరైన గౌరవం లేదు. ఒక ఉద్యోగి గాను సరైన గుర్తింపు లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం వారికి ఒక గౌరవ స్థాయి దక్కింది. నీరటి, మస్కూరు, లష్కర్, శాఖసింది వంటి కాలంచెల్లిన పేర్లతో పిలిచిన భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ ఉద్యోగాలను శాశ్వతంగా రద్దు చేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు.
రైతుల కల్లాల దగ్గర ఇచ్చింది తీసుకుని చాలీచాలని బతుకులు సాగించిన వీఆర్ఏలకు ఇకపై అటువంటి పరిస్థితులు ఉండబోవు. నాటి భూస్వామ్య వ్యవస్థకు నిలువెత్తు సాక్ష్యాలుగా, గ్రామ సహాయకులుగా పనిచేసిన తర్వాత రూపాంతరం చెంది వీఆర్ఏ వ్యవస్థగా మారింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్నప్పటికీ వీఆర్ఏల జీవితాలలో పెద్దగా మార్పు రాలేదు. గత పాలకులు వీఆర్ఏలను పట్టించుకున్న దాఖలాల్లేవు.
తమ సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ఉద్యోగం కల్పించాలని, గౌరవ వేతనం అందించాలని ఎంతోకాలంగా వీఆర్ఏలు పోరాటం చేశారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేయాలని భావించిన ముఖ్యమంత్రి వీఆర్ఏలను ఎక్కడ సర్దుబాటు చేయాలనేదానిపై శాఖలవారీగా సమీక్షలు జరిపి చివరికి వీఆర్ఏలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసీఆర్ మానవత్వానికి దర్పణంగా నిలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 61 ఏండ్ల లోపువారు 16, 758 మంది, దాటినవారు 3,797 మంది ఉన్నా రు. వీరిలో 10వ తరగతి అర్హత కలిగినవారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయటం, అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించటం. ఇది కేసీఆర్ సునిశిత దృష్టికి, ఏ వర్గం కష్టపడకూడదన్న దృక్పథానికి అద్దం పడుతున్నది. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన సంచలన నిర్ణయాలను తీసుకుంటూ దేశానికి దిక్సూచిగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం అని తాజా నిర్ణయంతో మారో మారు స్పష్టమైంది.
(వ్యాసకర్త: ఐ అండ్ పీఆర్, పౌర సంబంధాల అధికారి)
– ఎం.కిరణ్మయి