సామాజిక మథనం నుంచి పుట్టిన కళ సాహిత్యమని.. సాహిత్యం, కళలు సమాజానికి మార్గదర్శనం చేసే రెండు చేతులూ, కండ్లూ అని భావిస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ప్రయాణం ప్రారంభమై అప్పుడే పదిహేనేండ్లు పూర్తయ్యాయి.
సాహిత్య సృజన, రచన అంటే కేవలం వృత్తి, వ్యాపకం, గుర్తింపు, పేరుప్రఖ్యాతులు, కీర్తి కోసం ఎంచుకున్న మార్గమో, సాధనమో కాదని ప్రరవే నమ్ముతుంది. ఇటువంటి దృఢమైన అభిప్రాయంతో సాహిత్యకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు సంఘంలోని దౌర్జన్యాలు, అన్యాయాలు వెరసి అసమానతలపై కదం తొక్కే సైనికులైతే అది ప్రరవే సాహిత్య సాంస్కృతిక సామాజిక పథమే అవుతుంది.
సమాజంలో విస్మృతికి గురవుతున్న గుర్తింపు లేని వర్గాలకు, దళిత, బహుజన సామాజికవర్గాల రచయితలకు దామాషా ప్రాతిపదికన స్థానాలు ఏర్పరిచి, వారిలోని రచనా స్ఫూర్తిని, నిర్ణయాత్మక స్థాయిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రరవే ఏర్పడింది. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా నిర్మితమైంది. అటువంటి సమ సాంప్రదాయాన్నే రాజీ లేకుండా పదిహేనేండ్లుగా కొనసాగిస్తూ వస్తున్నది. ఈ ప్రయాణంలో ప్రరవే అధ్యయనం, అవగాహన, ఆచరణ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకొన్నవే. సామాజిక అంశాలపై ప్రరవే ఎన్నో సభలు, సమావేశాలను నిర్వహించింది.
సాహిత్య సృజన విమర్శన రంగాలను, అనువాద రంగంలో, పత్రికా రంగంలో స్త్రీల కృషిని మదింపు చేయటమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు అనుకున్న లక్ష్యాలకు అవరోధంగా ఉన్న సామాజిక సాంస్కృతిక సమస్యలపై చర్చించటం, వాటిని అధిగమించటానికి చేయాల్సిన కృషి గురించి నిర్ధారణకు రావటం ఈ సభలు, సమావేశాల సారం. సామాజిక మార్పు కోసం ప్రపంచమంతటా జరిగిన ఉద్యమాలపై అవగాహన, సమకాలీన భారతీయ సమాజంలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండటమే సాహిత్య రచనను బాధ్యతాయుతమైన ఆచరణగా మలుస్తుందని ప్రరవే నమ్ముతుంది. అందుకే, ఆ దిశగా దేశీయ ఉద్యమాలు సాహిత్యాన్ని ప్రతిఫలించిన తీరుపైనా, సాహిత్య కళా సృజనకు బోల్షెవిక్ విప్లవం మూల వనరుగా మారిన తీరుపైనా ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించింది.
యురేనియం, ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలు, ప్రజావ్యతిరేక ప్రభుత్వాల అభివృద్ధి విధానాలు సృష్టించిన విధ్వంసం, విస్థాపనల గురించి అవగాహన కోసం ప్రరవే క్షేత్ర పర్యటనలు కూడా చేపట్టింది. కొత్త పౌరసత్వ చట్టం, కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా నిరసనలతోనూ ప్రరవే స్వరం కలిపింది. ప్రజాస్వామిక హక్కుల చైతన్యంతోనే ప్రరవే ఇవన్నీ చేసింది.
గుజరాత్ మారణకాండ పరిణామాలను సమీక్షిస్తూ బిల్కిస్ బానోకు మద్దతుగా అభిప్రాయ సమీకరణ జరిపినా, ముజఫర్నగర్కు వెళ్లి మత మారణకాండ బాధిత ప్రజలకు మద్దతుగా మాట్లాడినా.. హిందూత్వ అధికార రాజకీయాల వ్యతిరేకతలో భాగమే. సామాజిక సాహిత్య అధ్యయనాలకు ప్రేరకంగా ఉండాలనే ఆయా సదస్సులలో వక్తల ఉపన్యాసాలను, క్షేత్ర పర్యటన అనుభవాలను పుస్తకాల రూపంలో ప్రచురించింది ప్రరవే. ఢిల్లీ నుంచి మొదలుకొని రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఆయా ప్రాంతాల మేధావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు అందిస్తున్న స్నేహ సహకారాలు లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు, మా పదిహేనేండ్ల ప్రయాణం ఇలా సాగేది కాదు.
పదిహేనేండ్ల ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని 2024, ఫిబ్రవరి 10, 11వ తేదీలలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తన ఏడో మహాసభను జరుపుకొంటున్నది. అందుకు ఖమ్మం వేదికగా నిలుస్తున్నది. సమకాలీన సమస్యగా మారిన ‘ట్రోల్’ ఈ మహాసభల ప్రధానాంశం. అదే అంశంపై మహిళల గొంతును వినిపించే కథనాలతో పుస్తకం కూడా ప్రచురిస్తున్నది ప్రరవే. ఈ మహాసభలకు ఖమ్మం సాహిత్య బంధుబృందాలను, రచయితలను, అభ్యుదయ భావాలు, ప్రజాస్వామిక ఆలోచనలు కల మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం.
(వ్యాసకర్త: ప్రరవే జాతీయ అధ్యక్షురాలు)
– అనిశెట్టి రజిత 98494 82462