ఇజ్రాయెల్ తన బలమైన సైనిక శక్తితో గాజాపై ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. గాజాలోని హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తున్నామనే నెపంతో గాజా పౌరులపై కూడా అరాచక దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు వేలసంఖ్యలో మరణించారు. మొత్తంగా 13 వేలమంది చనిపోయారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వాస్తవ మరణాలు అంతకు మించే ఉంటాయని అనధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంకా పూర్తి సమాచారం, గణాంక వివరాలు బయటకు రాలేదు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అయితే అది కూడా శుక్రవారంతో ముగిసింది. గాజా జనాభా సుమారు 23 లక్షలు. కాల్పుల విరమణ సమయంలో ఇరుపక్షాలు అనుకున్నట్టే పలువురిని విడుదల చేశాయి. అయితే ఈ ప్రక్రియ సంపూర్ణంగా జరుగాలని ప్రపంచం కోరుకుంటున్నది.
పలు దేశాలు అందించే మానవతా సహాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా బాధితులకు చేరటంలో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న అరకొర సహాయం వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఐక్యరాజ్య సమితి విభాగా లు, ఇతర దేశాలు తమకు తోచిన సహాయం చేస్తున్నాయి. ఆహారం, మెడిసిన్, పాలు, దుస్తులు, నీరు, పెట్రోలు, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. మన దేశం కూడా తనవంతు సహాయం చేస్తున్నది. యుద్ధ మారణకాండను చూసి ప్రపంచ ప్రజల సానుభూతి వెల్లువలా గాజా బాధితుల పక్షాన నిలిచింది. జనావాసాలపై, ఆసుపత్రులపై, స్కూళ్లపై విచక్షణా రహితంగా ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించటాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ నిరసనను వివిధ రూపాల్లో తెలుపుతున్నారు.
యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి. ఇజ్రాయెల్ ఆగడాలను పూర్తిగా బలపరుస్తున్న అమెరికా ఇతర ఐరోపా దేశాలు తమ దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. ‘గాజాలో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచాలి. ఇజ్రాయెల్పై యుద్ధ నేరారోపణలను చేయాలని ఆ దేశ పౌరుల ప్రదర్శనల ద్వారా వారి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నారు. అలాగే, హమాస్ ఇజ్రాయెల్పై చేసిన అమానుష, ఆకస్మిక దాడులను, జరిపిన మారణకాండను, కిడ్నాప్లను కూడా ప్రపంచ దేశాలు ఎలాంటి శషభిషలు లేకుండా బలంగా ఖండించాలి. దాంతో పాటు ఈ దాడులకు గత 75 ఏండ్లుగా పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయెల్ అనుసరించిన అక్రమ నిర్బంధాలు, అణచివేతలే కారణమనే సత్యాన్ని కూడా ప్రపంచ దేశాలు గుర్తించాలి.
గడిచిన చరిత్ర తేటతెల్లగా ప్రపంచం ముందున్నది. చరిత్రను ఎవరు వక్రీకరించినా నిజాలు దాగవు. సత్యాన్ని ఎవరు ఎన్ని రకాలుగా తమ శక్తియుక్తుల ద్వారా మసిబూసి మారేడుకాయ చేయాలన్నా అది నేటి ఆధునికయుగంలో అసాధ్యం. సత్యాన్ని ప్రకటించటానికి ఆ దేశాలకు ధైర్యం, నిజాయితీ కావాలి. తమ దేశాల ఆర్థిక ప్రయోజనాల కోసం అవి ఇజ్రాయెల్ను బలపరుస్తున్నాయనేది ప్రపంచానికి తెలుసు.
మొదటినుంచి ప్రపంచ దేశాలపై అమెరికా తన గుత్తాధిపత్యం కోసం నాటో కూటమి ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి తెలిసినవే. ఇందులో దాపరికం లేదు. ఇజ్రాయెల్ను బలపర్చటంలో నాటో కూటమి ఆర్థిక సామ్రాజ్య విస్తరణే కారణం. యుద్ధ విరమణ సంధికాలం ముగిసిన వెంటనే తమ సైన్యం గాజాను తిరిగి చెరపడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఆయన కర్కశత్వాన్ని మరోసారి వెల్లడించింది. ఈ యుద్ధోన్మాది ప్రకటన పశ్చిమాసియాతో పాటు ప్రపంచ శాంతి సుస్థిరతలకు కూడా తీవ్రంగా చేటుచేస్తుంది. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే, వాస్తవాలను విస్మరిస్తే ప్రపంచానికే ప్రమాదం.
ఈ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండాలంటే, మరో ప్రపంచ యుద్ధం జరగకూడదనుకుంటే, తాత్కాలిక ఒప్పందాలు లాంటి కంటితుడుపు చర్యలు సరిపోవు. గాజాలో మారణకాండ పూర్తిగా ఆగిపోవాలి. తక్షణం యుద్ధ విరమణ పూర్తిస్థాయిలో జరగాలి. మొన్న సోమవారం స్పెయిన్లో ఈయూ, అరబ్, ఉత్తర ఆఫ్రికా దేశాలు సమావేశమై పిలుపునిచ్చినట్టు ఇజ్రాయెల్ తన యుద్ధోన్మాదాన్ని తక్షణం విడనాడాలి.
అమెరికా, యూరప్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ, గాజాకు అనుకూలంగా, మొత్తంగా పాలస్తీనా విమోచనకు, ఆ దేశ సార్వభౌమ రాజ్యస్థాపనకు, మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జరుపుతున్న ర్యాలీలను, వారి అభీష్టాన్ని గుర్తించాలి. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత పేరిట ఇజ్రాయెల్ చేసిన భీకర బాంబు దాడులతో గాజా సర్వనాశనమైంది. ఈ సమయంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి ఇజ్రాయెల్పై యుద్ధ నేరం మోపాలి. జరిగిన దానికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలి. గాజాలోని పాలస్తీనా ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలి.
ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి వివిధ సంస్థలు, అంతర్జాతీయ న్యాయస్థానం క్రియాశీలకంగా మానవతా దృష్టితో వ్యవహరించాలి. తక్షణ చర్యలు ఉమ్మడిగా చేపట్టాలి. ప్రపంచ శాంతిని కాపాడాలి. గాజా పునర్నిర్మాణానికి, శాంతికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రపంచ దేశాల సహకారం అవసరం. ఈ విషయంలో అమెరికా, నాటో కూటమి కూడా మానవత్వంతో ముందుకు రావాలి.
కోలాహలం రామ్కిశోర్
98493 28496