రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. అట్టడుగువర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులకు ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ రక్షణతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారు అభ్యున్నతి సాధించాలని, సమాజంలో సమాన స్థాయికి చేరాలని భారత రాజ్యాంగం దళితులకు రిజర్వేషన్లు కల్పించింది.
కానీ, దళిత సమాజంలోని కొన్ని వర్గాలు నేటికీ అసమానతలను ఎదుర్కొంటున్నాయనేది వాస్తవం. రిజర్వేషన్ ఫలాలు కింది స్థాయి వరకు చేరడం లేదనేది కఠోర సత్యం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో షెడ్యూల్డ్ కులానికే చెందిన మాల, మాదిగ వర్గాలు అత్యధికంగా లబ్ధి పొంది, మిగతా కులాలు అణచివేతకు గురయ్యాయని అనేక నివేదికలు తేటతెల్లం చేశాయి. నివేదికల వరకు ఎందుకు? మన కండ్ల ముందే వాస్తవ పరిస్థితి కనిపిస్తున్నది.
SC Sub Castes | ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం మాల, మాదిగ కులాలే పోటీ పడుతుండటం గమనార్హం. ఇంతకాలం అన్యాయానికి గురై, రాజ్యాధికారానికి పూర్తిగా దూరమైన ఉపకులాలను విస్మరిస్తూ.. ‘మాకు అన్యాయం జరిగింది, కాదు కాదు మాకు అన్యాయం జరిగింది. మాకే మొత్తం ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలను కేటాయించాలి’ అని మాల, మాదిగ వర్గాలు పోరాడుతుండటాన్ని చూస్తే విస్మయం కలుగకమానదు. రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నవారే బహుజన రాజ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరం.
2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ జనాభా 3.63 కోట్లు. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 63,60,158. అంటే రాష్ట్ర జనాభాలో 17.50 శాతం ఎస్సీలే. దళిత జనాభాలో మాదిగల సంఖ్య 25,09,992. అంటే దళితుల్లో 39 శాతం. ఇది రాష్ట్ర జనాభాలో 6.9 శాతం. మాలల జనాభా 17,05,448. అంటే దళితుల్లో 27 శాతం, రాష్ట్ర జనాభాలో 4.6 శాతం. ఇక దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాల (ఉప కులాలు) జనాభా 21,44,718. అంటే దళిత జనాభాలో 34 శాతం. రాష్ట్ర జనాభాలో 5.9 శాతం వారే ఉన్నట్టు లెక్క.
మరొక అన్యాయం ఏమంటే.. మాల, మాదిగలకు కుల ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్ ఇస్తే, ఉపకులాలకు మాత్రం ఆర్డీవో జారీ చేస్తారు. ఈ నిబంధన వల్ల ఉపకులాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కారణంగానే లక్షలాది మంది ఉపకులాలవారు మాల, మాదిగ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. దీంతో ఈ రెండు కులాల జనాభా అధికారిక లెక్కల్లో పెరిగింది. వాస్తవానికి ఉపకులాల జనాభా మాల, మాదిగల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎస్సీ కులగణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇక రాజకీయ అవకాశాల విషయానికొస్తే.. ఉమ్మడి ఏపీలో 42 పార్లమెంట్ స్థానాలుండగా వాటిలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 7. అదే విధంగా 294 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు కేటాయించినవి 48. 1956 నుంచి 2014 వరకు చూసుకుంటే.. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అధిక శాతం మాలలకు దక్కగా, ఆ తర్వాత స్థానంలో మాదిగలు ఉన్నారు. నాడు ఉపకులాల ఊసేలేదు. రాష్ట్ర విభజన తర్వాత మన తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 ఎస్సీ రిజర్వ్డ్ కాగా, 17 పార్లమెంట్ స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్. ఈ 3 స్థానాల విషయానికొస్తే.. దశాబ్దాలుగా పెద్దపల్లి నియోజకవర్గంలో మాల సామాజికవర్గానికి చెందిన గుడిసెల వెంకటస్వామి కుటుంబం, నాగర్కర్నూల్ నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన మంద జగన్నాథం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో కంటోన్మెంట్ స్థానం కనుమరుగైంది. దాని స్థానంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. అయితే అక్కడి నుంచి కూడా మాదిగలే ప్రాతినిధ్యం వహించారు.
ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఉపకులాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో.. ఉపకులాల సంఖ్య అధికంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో మొదటిసారి నేతకాని ఉపకులానికి చెందిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పార్లమెంట్ సభ్యునిగా అవకాశం లభించింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో సామాజిక న్యాయ ప్రకారం.. ఒక స్థానం మాదిగలకు, రెండోది మాలలకు, మూడోది ఉపకులాలకు దక్కాలి. కానీ మాల, మాదిగ కులాలకు చెందినవారే.. తమకు అన్యాయం జరిగిందంటే, తమకు అన్యాయం జరిగిందని వాదులాడుకుంటూ ఉపకులాల గొంతు నొక్కుతున్నారు.
తెలంగాణలోని 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 10 చోట్ల మాదిగలు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మిగతా 9 స్థానాల్లో మాలలు అధికారాన్ని అనుభవిస్తున్నారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం.. వెనుకబడిన దళిత ఉపకులాలకు 6 స్థానాలు దక్కాల్సి ఉండగా ఎక్కడా అవకాశమివ్వడం లేదు. మాలల వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని, మిగతా వెనుకబడిన దళిత కులాలకు న్యాయం చేకూర్చేలా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ‘మాదిగ దండోర’ పేరుతో ఒక వర్గం.. ఎస్సీలను వర్గీకరించవద్దని ‘మాల మహానాడు’ పేరిట మరో వర్గం ఉద్యమిస్తున్నది. ఈ రెండు కులాల నేతలు ఈ విధంగా రాజ్యాధికారం అనుభవిస్తూ, ఆధిపత్యం చెలాయిస్తూ మిగతా 57 ఉపకులాలను ఎదగనివ్వకుండా అణచివేస్తున్నారు.
దళితులందరికీ దక్కాల్సిన ప్రయోజనాలను ఈ రెండు కులాలే పొందుతున్నాయి. సర్పంచి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రుల వరకు ఈ కులాలే వారే ఎక్కువగా ఉంటున్నారు. దళితుల్లో వెనుకబాటుకు గురైన కులాల పేర్లు బయటికి రానీయకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలనే ముద్ర వేసి అందరి ప్రయోజనాలు రెండు వర్గాలే పొందుతుండటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
ఉపకులాలకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదు. ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్లో, ఎస్సీ, ఎస్టీ కమిషన్లోఉపకులాలకు కనీసం సభ్యులుగా కూడా స్థానం లేకపోవడం శోచనీయం. వారికి నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఎంపీ (రాజ్యసభ) స్థానాలు కూడా దక్కడం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధిలోనూ ఒక్క శాతం అందడం లేదు. ఉపకులాలు కేవలం ఓటు బ్యాంకుగానే మిగిలిపోయాయి. దళితుల్లోనే ఇంతటి వివక్ష, ఆధిపత్యం ఉంటే ఇక రిజర్వేషన్లు ఎందుకున్నట్టు? ఎవరి కోసం ఉన్నట్టు?
ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ఆలోచనాధోరణిని మార్చుకోవాలి. ఈ వివక్షను రూపుమాపాలి. వెనుకబడిన దళిత కులాల వృత్తులు, సంప్రదాయాలను పరిరక్షించడం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ కులాలను ఉపకులాలుగా కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎంబీఎస్సీ)గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. నామినేటెడ్ ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలను ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాల, మాదిగలతో సంబంధం లేకుండా ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి శాశ్వత న్యాయం చేయాలి. జనాభా దామాషా ప్రకారం ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తేనే ఉపకులాలకు చెందిన ప్రజల జీవితాలు బాగుపడుతాయి.
రాష్ట్రంలో దళిత జనాభా 17 నుంచి 25 శాతానికి పెరిగిందనేది ఒక అంచనా. దీని ప్రకారం మాదిగల జనాభా 6 నుంచి 9 శాతానికి, మాలల జనాభా 4 నుంచి 6 శాతానికి, మిగతా 57 ఉపకులాల జనాభా 6 నుంచి 10 శాతానికి పెరిగిందన్నది వాస్తవం. కానీ, మాదిగలే 12 శాతానికి పైగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని, సమాజాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా దళితుల రిజర్వేషన్లను పెంచాలి. జనాభా దామాషా ప్రకారం.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల్లో మాల, మాదిగ, ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశమే లభించని ఉపకులాలకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఇప్పటివరకు రాజ్యాధికారాన్ని అనుభవించిన కులాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తేనే అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం జరుగుతుంది.
(వ్యాసకర్త: ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు)
– బైరి వెంకటేశం మోచి
94919 94090