అభివృద్ధికి దోహదపడే వనరులలో ‘మానవ వనరులు’ కీలకమైనవి. అలాంటి మానవ వనరులను సృష్టించే శక్తి విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగం ప్రత్యేకమైనది. గడిచిన దశాబ్దకాలంలో, శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రంగాలు విప్లవాత్మక మార్పులతో ముందుకు పోతున్నాయి. కానీ, సాంకేతికతను అందిపుచ్చుకొని విషయ దృక్పథాన్ని వినూత్నంగా విద్యార్థులకు తెలియచేయడంలో విద్యారంగం వెనుకబడింది.
విద్యారంగంలో సాంకేతికత ఆవశ్యకతకు ‘నూతన విద్యా విధానం-2020’ పెద్దపీటవేసింది. ఇటీవల కాలంలో, శాస్త్ర, సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న వినూత్న మార్పులలో ‘కృత్రిమ మేధస్సు’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) ఒకటి. ఇంటర్నెట్, డిజిటల్ వాయిస్ అసిస్టెన్స్, నెట్ఫ్లెక్స్ ఇలా అన్నింటిలోనూ కృతిమ మేధస్సుదే పాత్ర. గడచిన రెండేండ్లలో దీని వాడకం విపరీతంగా పెరిగింది. తాజాగా దీన్ని విద్యారంగంలోనూ ఉపయోగిస్తున్నారు. అసలు విద్యలో కృత్రిమ మేధస్సు అవసరమేనా? విద్యార్థి విషయగ్రహణకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
వాస్తవానికి కృత్రిమ మేధస్సు అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. ఎలాగైతే, వ్యక్తులు బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నారో అదే తరహాలో నేర్చుకొని, ఆలోచించి పనిచేయగల కంప్యూటర్ ప్రోగ్రామ్ అల్గారిథం. వాస్తవానికి కంప్యూటర్కు ప్రోగ్రాం ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. కానీ కృత్రిమ మేధస్సు అలా కాదు, ఒక పనిని రిపీట్గా చేయడం ద్వారా దాన్ని ఇంకా మంచిగా చేసేందుకు ఆలోచిస్తుంది. తప్పులు సరిచేసుకుంటూ ఆ పనిని మరింత సమర్థవంతంగా చేస్తుంది. వ్యక్తి మెదడు మాదిరిగానే, కృత్రిమ మేధస్సు కూడా పని చేస్తుంది. వ్యక్తి మెదడులోని ఒక్కో న్యూరాన్ కొన్ని వందల న్యూరాన్లతో సంబంధం కలిగినట్టు, కృత్రిమ మేధస్సు కూడా ప్రపంచ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనిషిలాగా ఆలోచించి పనిచేయగలిగిన ఒక యంత్రం. ఉదాహరణకు, మీరు మెట్రోలో ప్రయాణించే సమయంలో రానున్న స్టేషన్, మీరు ఎటువైపుగా దిగి వెళ్లా లో మీకు తెలియచేసేది కృత్రిమ మేధస్సు ద్వారానే. ఈ కృత్రి మ మేధకు అన్ని రకాలుగా దిశానిర్దేశం చేసేది మాత్రం మాన వ మేధస్సే. ఇది మెషిన్ లెర్నింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, బిగ్ డేటా, న్యూరల్ నెట్వర్క్, సెల్ఫ్ అల్గారిథమ్ మీద ఆధారపడి ఉంటది. దీన్ని మొదట 1956లో జాన్ మెకార్తీ అనే అమెరికన్ శాస్త్రవేత్త రూపొందించారు.
కృత్రిమ మేధస్సును నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నాలెడ్జి రిప్రజెంటేషన్, ఆటోమేటెడ్ రీజనింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనే రూపాల ద్వారా వాడతారు. ఏ రూపంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించినా, డాటాను విశ్లేషించి, అర్థం చేసుకొని, నిర్ణయాలు తీసుకోని పనిచేయడమే దాని ఉద్దేశం. మనదేశంలో కృత్రిమ మేధస్సు మీద లిటరసీ రేటు రోజు రోజుకు పెరుగుతున్నది. గ్లోబల్ ఏఐ నివేదిక 2023 ప్రకారం, ప్రపంచ దేశాలలో కృత్రిమ మేధ సాంకేతికత నైపుణ్యం అభివృద్ధి రేటులో ఇండియా 3.23 రేటుతో ప్రథమస్థానంలో ఉండగా, అమెరికా, జర్మనీ తరువాత స్థానంలో ఉన్నాయి. 2025 నాటికి మనదేశంలో కృత్రిమ మేధస్సు మార్కెట్ విలువ సుమారు 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అదేవిధంగా 2025 నాటికి మన దేశ జీడీపీలో కృత్రిమ మేధస్సు విలువ సుమారు 450 నుండి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉన్నది. ఈ కృత్రిమ మేధస్సు అభివృద్ధికి భారత ప్రభుత్వం 2018లో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించి, కృత్రిమ మేధస్సును మన దేశంలో ఆరోగ్యం, వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఆటో మొబైల్, ఈ-కామర్స్ వంటి ఇతర రంగాలలో వాడుతున్నారు. నేడు కృత్రిమ మేధస్సును విద్యారంగంలోనూ ప్రవేశపెట్టారు.
విద్యారంగంలో సాంకేతికతను జోడించడం కీలకమైనది. ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి అయిన విద్యారంగంలో కృత్రిమ మేధస్సుకు తావులేదు అనే వాదనలో పసలేదు. కృత్రిమ మేధస్సు ద్వారా విద్యార్థికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. చిన్నతనం నుంచే సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేటి తరానికి, కృత్రిమ మేధస్సు ద్వారా అభ్యసించడం మరింత సులువవుతుంది. విద్యార్థికి ఈ పరిజ్ఞానం ద్వారా పర్సనలైజ్డ్, ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఇంటెలిజెన్స్ ట్యూటరింగ్ పద్ధతి వంటివి అలవడుతాయి. విద్యార్థుల ఆలోచన శైలిని ఎప్పటికప్పుడు గమనించవచ్చు. రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ ఈ పరిజ్ఞానం ద్వారా సాధ్యపడుతుంది. అంతేకాకుండా, వివిధ రకాల సమస్యల పై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి పద్ధతులపై పూర్తి అవగాహనా వస్తుంది. కృత్రిమ మేధస్సుతో కూడుకున్న కొన్ని సాంకేతికతలను ఇప్పటికే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఉపయోగిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి చాట్బాట్, వర్చువల్ రియాలిటీ మొదలగునవి.
కృత్రిమ మేధస్సు అధ్యాపకునికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, మూల్యాంకనం, గ్రేడింగ్, విద్యార్థుల ఫీడ్బ్యాక్ వంటివి సులభతరమవుతాయి. విద్యార్థి అభ్యసన తీరును గ్రహించి తన అభ్యసనను మరింత మెరుగు పరచడానికి ఈ పరిజ్ఞానం చాల కీలకమైనది.
‘లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ద్వారా పాఠశాల అన్ని ఆన్లైన్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. విద్యార్థి పురోగతిని తెలియచేయడం, నివేదికలు రూపొందించడం వంటివి సాధ్యమవుతుంది. అదేవిధంగా విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ‘రోబోటిక్స్’ వాడకం ఇప్పటికే మొదలైంది. కొన్ని సర్వేల ప్రకారం, విద్యార్థి అభ్యసనపై రోబోటిక్స్ ప్రభావం చాలా ఉన్నది.
లోతైన విశ్లేషణ, విసుగుచెందని వివరణ వంటివి రోబోటిక్ విద్యలో కీలకమైనవి. బోధనలో రోబోటిక్స్ సాంకేతికత ప్రస్తుత తరానికి అనివా ర్యం. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికీ నేర్చుకునేందుకు రోబోలు అద్భుతమైన వనరుగా ఉపయోగపడు తాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు తమ బోధనలో, అడ్మినిస్ట్రేషన్లలో కృత్రిమ మేధస్సును విజయవంతంగా అమలుచేస్తున్నాయి.
కరోనా తరువాత, భారత ప్రభుత్వం సైతం డిజిటల్ విద్యకు ప్రాముఖ్యం ఇస్తున్నది. అందులో భాగంగా, స్వయంప్రభ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, సాంకేతిక ఆధారిత అభ్యసన వంటి ఇతర డిజిటల్ బోధన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజీసీ సైతం కృత్రిమ మేధస్సును ఉన్నత విద్యతో అనుసంధానం చేయడంపై దృష్టిపెట్టింది. అయితే, సుమారు 60 శాతం గ్రామీణ జనాభా ఉన్న మనదేశంలో ఈ కృత్రిమ మేధస్సు అమల్లో ఎన్నో సవాళ్లున్నాయి. సామాజిక-ఆర్థిక అసమానతలు, లింగ అసమానతలు, ఉపాధ్యాయుల కొరత, నాణ్యతలేని బోధన, అధిక డ్రాపౌట్ రేటు వంటివి స్థూల సమస్యలు కాగా, సాంకేతికత సమ్మిళితం అనేది సూక్ష్మ సమస్యగా చెప్పుకోవచ్చు.
మనదేశంలో అధికశాతం అధ్యాపకుల వయసు 45-55 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాబట్టి కృత్రిమ మేధస్సు ద్వారా బోధించాలంటే తప్పక వారికి తగిన శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కూడా పెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. అయితే, ఎంఎల్ సిస్టం ద్వారా ఫార్మల్ లర్నింగ్, స్కూల్ మేనేజ్మెంట్, మ్యాపింగ్, మ్యాచింగ్ ఆఫ్ స్కిల్స్ అలా గే, ఎన్ఎల్పీ సిస్టం ద్వారా ఫార్మల్, ఇన్ఫార్మల్ లెర్నింగ్ పద్దతులను అమలు చేయవచ్చు. కానీ వీటి వినియోగంలో సమర్థవంతమైనశిక్షణ నైపుణ్యాలు కలిగిన వారిని నియమించాలి.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యకు ఒక ప్రత్యేక స్థా నం ఉన్నది. మానవ-కేంద్రీకృత విధానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విద్యకు అనుసంధానం చేయడంద్వారా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసుకుంటాయి. అందుకే, తెలుగు రాష్ర్టాల విద్యాశాఖ లు, ఉన్నత విద్యా మండళ్లు సైతం రా నున్న ఐదేండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్కు విద్యను అనుసంధానం చేసే విధంగా పాలసీ రూపకల్పన చేయాలి. తద్వారా భవిష్యత్ తరాలకు విద్యను సులభతరం చేయడమే కాకుండా వందశాతం అక్షరాస్యతను సాధించవచ్చు.
వ్యాసకర్త : (స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్)
వై. వెంకటరావు